బెంగుళూరు: కర్నాటకలో ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఓట్లను నమోదు చేసుకున్న వారిలో తప్పులు ఉంటే వారికి నోటీసులు ఇస్తున్నారు. తాజాగా ఇన్ఫోసిస్ ఫౌండర్ నందన్ నిలేఖనీతో పాటు ఆయన కుటుంబానికి, జిరోదా వ్యవస్థాపకులు నితిన్ కామత్, నిఖిల్ కామత్లకు, కర్నాటక సీఎం శివకుమార్ తల్లి గౌరమ్మకు కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. సీఎం శివకుమార్ తల్లికి కనకపుర అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు ఉన్నది. అయితే ఆ పేరుతో మిస్మ్యాచ్ అయినట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ నేపథ్యంలో నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది.
ఇక నిలేఖనీ కుటుంబంలోని ఆయన భార్య , పిల్లలకు కూడా గత 2002 సర్తో మ్యాపింగ్ జరగలేదని ఆరోపణలు ఉన్నాయి. నితిన్ కామత్, నిఖిల్ కామత్, వారి తల్లి రేవతి కామత్కు.. బెంగుళూరు సౌత్ అసెంబ్లీ నియోజకవర్గంలో పేరెంట్స్ నేమ్ మిస్మ్యాచ్ అయ్యింది. అయితే ప్రముఖ వ్యక్తులు, వీఐపీలను వెరిఫికేషన్ ప్రక్రియ ద్వారా ఇబ్బందిపెట్టబోమని అధికారులు అన్నారు. వారి ఇంటికి సిబ్బంది వెళ్లి వివరాలను సేకరించనున్నట్లు అధికారులు చెప్పారు.
నోటీసులు జనరేట్ చేసినా, అధికారులు మాత్రం ఇంకా వారికి పంపలేదని తెలుస్తోంది. పేరు తప్పు పడిన అంశంలో భారతరత్న గ్రహీత ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు పేరిట నోటీసులు జనరేట్ చేశారు. కన్నడ స్టార్ శివరాజ్కుమార్కు 2002 సర్ లిస్టుతో మ్యాపింగ్ జరగలేదని కూడా నోటీసును జనరేట్ చేశారు. అధికారిక స్థాయిలోనే ఆ సమస్యలను పరిష్కరిస్తున్నారు.