మంచి ఉద్యోగం సంపాదిస్తే చాలు.. ఇక లైఫ్ సెటిల్ అని అందరూ అనుకుంటారు. అదే డాక్టర్ లేదా IAS ఉద్యోగం వస్తే ఆ వ్యక్తి జీవితంలో చాలా సాధించాడు తన గమ్యం చేరుకున్నాడు అని అనుకుంటాం. కానీ ప్రపంచంలో కొంత మంది ఎంత పెద్ద విజయం సాధించినా విశ్రాంతి తీసుకోరు.. దానిని తమ గమ్యంగా భావించరు. అది కేవలం తమ జీవిత ప్రయాణంలో ఓ మజిలీగా భావిస్తారు. అలాంటి ఒక వ్యక్తి పేరే రోమన్ సైనీ.
చిన్నతనం నుంచే అద్భుత ప్రతిభా సంపన్నుడైన రోమన్ సైనీ 16 ఏళ్ల వయసులో ఎయిమ్స్ నిర్వహించిన పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఎయిమ్స్లో ప్రవేశం పొందిన దేశంలోనే అతి పిన్న వయస్కుడిగా నిలిచారు. ఎమ్బిబిఎస్లో ప్రవేశం కోసం ఎయిమ్స్, ఢిల్లీ నిర్వహించే పరీక్ష అత్యంత కఠినమైనదిగా చెబుతుంటారు. అలాంటిది అయన ఎంబీబీఎస్ పూర్తిచేశాక 6 నెలల పాటు వైద్యునిగా పనిచేశాక సివిల్ సర్వీసెస్ వైపు దృష్టి సారించారు. మొదటి ప్రయత్నంలోనే ఐఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి మధ్యప్రదేశ్లో పోస్టింగ్ సంపాదించారు.
కానీ అక్కడ కూడా ఎక్కువ కాలం ఉండలేని సైనీ అధ్యాపకుని అవతారం ఎత్తారు. అదే క్రమంలో తన స్నేహితులు గౌరవ్ ముంజాల్, హిమాన్షు సింగ్తో కలిసి అన్అకాడెమీని ప్రారంభించారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను అన్ని పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలన్న ఉద్దేశంతోనే అన్అకాడెమీని స్థాపించినట్లు రోమన్ సైనీ తెలిపారు. ఈ అనాకాడెమీ సంస్థ మార్కెట్ విలువ ప్రస్తుతం 14 వేల కోట్లు. అన్అకాడెమీకి 18 వేలమంది ఉపాధ్యాయుల నెట్వర్క్ ఉంది. దీంతో భారతదేశంలోనే అతిపెద్ద టెక్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫార్మ్ సహవ్యవస్థాపకుడిగా రోమన్ సైనీ ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఇంత సాధించినా.. తను జీవితంలో ఇంకా ఎంతో సాధించాల్సి ఉంది అని రోమన్ సైనీ చెప్పారు.