దొంగ.. జేబుదొంగ.. మంచిదొంగ.. ఇలాంటి సినిమాలు తీసి దొంగలను హీరోలను చేశారు. కానీ, నిజమైన దొంగలు.. సినిమాల్లో కరడుగట్టిన విలన్ల కన్నా డేంజర్! వారి దృష్టిలో దొంగత నం ఒక కళ. 64 కళల్లో అందరికీ సాధ్యం కాని అద్భుతమైన కళ అని భావిస్తుంటారు. పైగా, చేసేది పాడుపనే అయినా, దాన్ని పద్ధతిగా చేస్తామని గర్వంగా చెబుతుంటారు. ఒకరిని చూసి కాపీ కొట్టే రకం కాదంటూ బిల్డప్లు ఇస్తుంటారు. గ్రిల్స్ తొలగించి ఇంట్లో చొరబడే శైలి ఒకరిదైతే, నమ్మించి నట్టేట ముంచే మార్గం మరొకరిది. ఒకడి లక్ష్యం తాళం వేసినఇల్లు అయితే, వేరొకడి టార్గెట్ ప్రజా ప్రతినిధులు. ఎన్నిసార్లు కృష్ణజన్మ స్థానానికి వెళ్లొచ్చినా.. చోరకళా పోషణ మాత్రం ‘తగ్గేదే లే’ అని మీసం దువ్వుతుంటారు. విభిన్న శైలిలో దొంగతనాలు చేసిన దొంగల కథలు ఇవి. చదివితే తెలివిమీరిన దొంగల నుంచి తప్పించుకునే తరణోపాయం తట్టకపోదు.
మహారాష్ట్రకు చెందిన సంతోష్ షిండే ఖతర్నాక్ దొంగ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో లక్షల రూపాయల విలువైన సొత్తు చోరీ చేశాడు. రైల్వే ట్రాక్ల వెంబడి ఉన్న సంపన్న ప్రాంతాలనే షిండే టార్గెట్ చేసేవాడు. మంచి ఇల్లు చూసుకొని, రాత్రి చెట్లలో దాక్కుంటాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత స్పాట్ పెట్టిన ఇంటికి వస్తాడు. మెల్లగా కిటికీ గ్రిల్స్ తొలగిస్తాడు. పిల్లిలా ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అందినకాడికి దోచుకుంటాడు. ఆ ఇంట్లో మనుషులున్నా షిండేకు బేఖాతరే! చల్లగా చోరీ చేసి మళ్లీ పొదల మాటున దాక్కుంటాడు. తెల్లారాక ఏమీ తెలియని వాడిలా సంచితో దర్జాగా బయటికి వస్తాడు. ట్రైన్ ఎక్కి మహారాష్ట్ర చేరుకుంటాడు. షిండే చోరీ కేసులు ఛేదించిన సైబరాబాద్ పోలీసులు షాక్కు గురయ్యారు. 2007లోనే తాను చనిపోయినట్టు ముంబై కార్పొరేషన్ నుంచి మరణ ధ్రువీకరణ పత్రాన్ని పొందాడు షిండే. పలు చోరీ కేసుల్లో షిండే గురించి ఆరా తీసిన పోలీసులు డెత్ సర్టిఫికెట్ చూసి అతను నిజంగానే చనిపోయాడని నమ్మి వెనక్కి వెళ్లేవారు. అయితే, 2014లో అల్వాల్, రాజేంద్రనగర్లో అందరూ ఇంట్లో ఉండగానే గ్రిల్స్ తొలగించి భారీ చోరీలకు పాల్పడిన కేసులు నమోదయ్యాయి. ఎంవో (మోడస్ ఆపరాండి) ప్రకారం అవి షిండే చేసిన దొంగతనాలే అని పోలీసులకు అనుమానం వచ్చింది. దొంగతనం జరిగిన చోట వేలిముద్రలు సేకరించి తీగ లాగితే, డొంక కదిలింది. ఆ వేలి ముద్రలతో షిండేవి సరిపోలడంతో పోలీసులకు అసలు విషయం అర్థమైంది. నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించి పోలీసులను బురిడీ కొట్టిస్తున్నాడని తేలిపోయింది. పోలీసులు రంగంలోకి దిగి సంతోష్ షిండేను అరెస్ట్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లోని పోలీసులకు మంత్రి శంకర్ పేరు తెలియకుండా ఉండదు. అలాంటి చోర చరిత్ర శంకర్కు ఉంది. ఇల్లు ఇల్లంతా లూఠీ చేయడానికి రెండు నిమిషాలు చాలు. ఎలాంటి హంగామా లేకుండా ఒక రాడ్, స్క్రూ డ్రైవర్తో చకచకా పని కానిచ్చేస్తాడు. ఒక్కడే చోరీకి రావడం, వేషాలు మార్చిమార్చి తిరగడం, ఎంత ఎత్తయిన గోడ పైనుంచి అయినా అమాంతం దూకేయడం శంకర్ ప్రత్యేకత. పక్కా ప్లాన్తో చోరీకి దిగుతాడు. తన భార్యలు, చిన్న దొంగలతో రెక్కీ చేయిస్తాడు. తాళం వేసిన ఇండ్లను గుర్తిస్తాడు. చోరీకి మాత్రం ఒక్కడే వెళ్తాడు. దొంగతనం చేసిన తర్వాత, అదే ఇంటి డాబాపై విశ్రాంతి తీసుకుంటాడు. తెల్లవారుజామున 5 గంటలకు నిద్రలేచి జాగింగ్ డ్రెస్ వేసుకొని పారిపోవడం మంత్రి శంకర్ మార్క్. 1979 నుంచి నాలుగు దశాబ్దాలుగా శంకర్ చోరీలు అప్రతిహతంగా కొనసాగుతూనే ఉన్నాయి. పోలీస్ రికార్డుల ప్రకారం శంకర్ 256 కేసుల్లో నిందితుడు. 209 కేసుల్లో శిక్ష కూడా పడింది. 21 సార్లు జైలుకు వెళ్లొచ్చాడు. నాలుగు సార్లు పీడీయాక్ట్ పెట్టారు.. అయినా మంత్రి శంకర్ మారలేదు. చివరిసారిగా ఓ చోరీ కేసులో హైదరాబాద్ పోలీసులు 2020 డిసెంబర్లో అరెస్టు చేశారు.
చైన్ స్నాచర్ ఉమేశ్ది గుజరాత్లోని అహ్మదాబాద్. ఈయనగారు చోరీ చేయాలంటే ముందుగా బైక్ ఉండాలి. అది కూడా గేర్లు లేని యాక్టివా ఉంటేనే ఉమేశ్ యాక్టివ్గా చోరీ చేయగలడు. ఎందుకంటే ఈ చోరకేసరికి గేర్ల బండి నడపడం రాదు మరి! అహ్మదాబాద్ నుంచి విమానంలో బయల్దేరి దొంగతనం చేయదలచిన నగరంలో వాలుతాడు. మంచి లాడ్జ్లో మకాం పెడతాడు. దొంగతనానికి ముందు యాక్టివా కోసం గాలింపు మొదలు పెడతాడు. తాళం చెవి ఉన్న యాక్టివా కోసం అవసరమైతే పదుల కిలోమీటర్లు పాదచారిగానే గాలిస్తాడు. ఒక్కసారి బండి దొరికిందా.. ఉమేశ్కు బ్రేక్లు వేయడం కష్టమే! యాక్టివాను చాకచక్యంగా చోరీ చేసి సొంతబండిలా ఊరంతా తిరుగుతాడు. అనుమానం రాకుండా రైల్వేస్టేషన్లోనో, బస్స్టాండ్లోనో పార్క్ చేస్తాడు. రాత్రి కాగానే యాక్టివా తీసుకొని వీధులన్నీ చక్కర్లు కొడతాడు. సీసీ కెమెరాల్లో తన ముఖం పడకుండా టోపీ, మాస్క్, జాకెట్ ధరిస్తాడు. దర్జాగా వేటకు బయల్దేరతాడు. ఎవరి మెడలో అయినా బంగారు గొలుసు కంట పడిందా.. ఉమేశ్ చేతులు చటుక్కున దాన్ని లాగేస్తాయి. ఒకట్రెండు రోజుల్లో దొరికినన్ని గొలుసులు చోరీలు చేసి, బండిని ఎక్కడో వదిలేసి ఎంచక్కా అహ్మదాబాద్కు చెక్కేస్తాడు. 2015 నుంచి వరుస చోరీలు చేస్తూ అటు అహ్మదాబాద్ ఇటు హైదరాబాద్ పోలీసులకు చుక్కలు చూపించాడు ఉమేశ్. చివరికి రాచకొండ పోలీసులకు చిక్కాడు. ఇతరులకు మామూలు ఫోన్ కాల్స్ చేయడు. ఎవరికీ దొరక్కుండా వైఫై ఉపయోగించి వాట్సాప్ కాల్లో మాత్రమే మాట్లాడతాడు.
‘తొండ ముదిరి ఊసరవెల్లి అయింద’నే మాట చోర ప్రవీణ వీర బ్రహ్మచారికి అతికినట్టు సరిపోతుంది. పదుల సంఖ్యలో కేసులు, ఏండ్ల కొద్దీ జైలు జీవితం అనుభవించినా పరివర్తన రాని వీర ముదురు చోరుడు ఇతను. వరంగల్ జిల్లా ఖాజీపేటకు చెందిన వీరబ్రహ్మచారి చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. సరైన పెంపకం కొరవడటంతో కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. డబ్బు సంపాదించడానికి అడ్డదారే రహదారి అని భావించాడు. ప్రజాప్రతిఘటన, మావోయిస్టుల పేరుతో దందాలకు తెగబడ్డాడు. ఉమ్మడి రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, కర్ణాటకలోనూ కార్యకలాపాలు సాగించాడు. చివరికి 2012లో అరెస్టయ్యాడు. ఐదేండ్ల శిక్ష అనుభవించాడు. శిక్షాకాలంలో బ్రహ్మచారి సత్ప్రవర్తన చూసి పోలీసులే ఆశ్చర్యపోయేవారట. తనకు ఏదైనా ఉపాధి చూపితే నిజాయితీగా బతుకుతా అనడంతో, పోలీసులు అండగా నిలిచారు. అప్పటి సైబరాబాద్ సీపీ (ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్) సీవీ ఆనంద్ అండగా నిలిచారు. జైలు అధికారులతో కలిసి ఉప్పల్ రింగ్ రోడ్డులో టీ దుకాణం పెట్టించారు. దాని ప్రారంభోత్సవానికి అప్పటి క్రైమ్ డీసీపీ కూడా హాజరవడం విశేషం. కొన్నాళ్లు చిక్కటి టీ అమ్ముతూ చక్కగా బతుకు వెళ్లదీసిన బ్రహ్మచారి, టీ దుకాణం మూసేశాడు. వక్రమార్గం పట్టాడు. కట్ చేస్తే.. 2020 ఫిబ్రవరిలో జహీరాబాద్లో మహిళపై అత్యాచార ఘటనలో నిందితుడిగా పోలీసులకు మళ్లీ చిక్కాడు.
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన తోట బాలాజీ నాయుడు లక్ష్యం ప్రజాప్రతినిధులను మోసం చేయడమే! మాయమాటలతో ఎంపీలు, ఎమ్మెల్యేలను బురిడీ కొట్టించి లక్షల్లో టోకరా వేస్తాడు. గతంలో ఎన్టీపీసీలో ఇంజినీర్గా పనిచేసిన బాలాజీ నాయుడు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. దీంతో యాజమాన్యం అతణ్ని ఉద్యోగం నుంచి తొలగించింది. తన దుస్థితికి ప్రజాప్రతినిధులే కారణమని వారిపై కక్ష పెంచుకున్నాడు. జైలు నుంచి వచ్చాక పొలిటీషియన్లనే లక్ష్యం చేసుకున్నాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల్లో రుణాలు, ఇతర ప్రయోజనాలు కల్పిస్తానంటూ ప్రజాప్రతినిధుల నుంచి డబ్బు లాగడం మొదలుపెట్టాడు. పదేండ్లుగా ఎమ్మెల్యేలు, ఎంపీలను మోసగించి లక్షల రూపాయలు కొట్టేశాడు. బాలాజీ మీద ఇప్పటివరకు 66 కేసులు నమోదయ్యాయి. ఎన్నోసార్లు జైలుకు వెళ్లాడు. అతనిపై పీడీయాక్ట్ కూడా ప్రయోగించారు. అయినా, జైలు నుంచి విడుదల కాగానే మళ్లీ చేతివాటం ప్రదర్శిస్తాడు. చివరగా నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే నుంచి రూ.2.5 లక్షలు తీసుకున్న కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు చిక్కాడు. దీంతో లీడర్లు ఊపిరిపీల్చుకున్నారు.
మాటలే ఈ దొంగకు పెట్టుబడి. అవతలి వాళ్లలో నమ్మకం పెంచి నట్టేట ముంచి అందినకాడికి దోచుకుంటాడు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు చెందిన అబ్బూరి సోమయ్య మాటలతో అబ్బురపరుస్తాడు. రైళ్లు, విమానాల్లో తోటి ప్రయాణికులతో మాటకలిపి పరిచయం పెంచుకుంటాడు. తర్వాత కొన్నాళ్లకు ఫోన్ చేసి ఆ వ్యక్తుల యోగక్షేమాలు విచారిస్తాడు. ‘మీ కోసం హరిద్వార్ నుంచో, కాశీ నుంచో కలశం తీసుకొచ్చాను’ అని చెప్పి వారిని కలుస్తాడు. వారింట్లోనే కొన్నాళ్లు మకాం వేస్తాడు. ఆతిథ్యం ఇచ్చిన వారికోసం తానే స్వయంగా కొంత ఖర్చు చేస్తాడు. అవతలి వాళ్లకు నమ్మకం బాగా కుదిరిందని అనిపించాక ‘మీ ఇంట్లో బంగారం ఈ కలశంలో వేస్తే రెట్టింపు అవుతుంద’ని చెబుతాడు. తీరా బంగారం వేశాక ‘వేడినీళ్లతో స్నానం చేసి వచ్చి పూజలో కూర్చోమ’ని చెబుతాడు. ఇంట్లోవాళ్లు స్నానానికి వెళ్లగానే ఇంటికి బయటి నుంచి తాళం పెట్టి బంగారంతో ఉడాయిస్తాడు. ఉద్యోగం ఇప్పిస్తానని, వ్యాపారంలో లాభాలు వస్తాయని చెప్పి నిలువుదోపిడి చేస్తాడు సోమయ్య. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రలో 37 పోలీస్స్టేషన్ల పరిధిలో 67 చోరీలకు పాల్పడ్డాడు. ఎట్టకేలకు రెండేండ్ల కింద సైబరాబాద్ పోలీసులకు చిక్కాడు.
మహబూబ్ఖాన్ పఠాన్.. ఆంధ్రప్రదేశ్ అనంతపురం ప్రాంతానికి చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. తాళం వేసిన ఇండ్లలో పట్టపగలే చోరీ చేయడంలో పట్టున్నవాడు. తాను చోరీలు చేయాలనుకునే ప్రాంతాన్ని ఎంచుకుని, పరిసరాల్లో ఇల్లు అద్దెకు తీసుకుంటాడు. స్థానికంగా తిరుగుతూ ముందు రెక్కీ నిర్వహిస్తాడు. తన నేర చరిత్ర ఎవరికీ తెలియకుండా చూసుకుంటాడు. దొంగ వ్యవహారాల గురించి చివరికి తల్లికి, భార్యకు కూడా అనుమానం రానివ్వడు. అంత జాగ్రత్తపరుడు. తన వివరాలు ఎక్కడా నమోదు కావొద్దని, ఇంతవరకూ ఆధార్కార్డు కూడా తీసుకోలేదు. అంతేకాదు, మహబూబ్ఖాన్కు పార్ట్నర్షిప్ అంటే గిట్టదు. దీనివల్ల ఏదో ఒక రోజు తేడా వచ్చి, విషయం బయటికి పొక్కుతుందన్న ముందుజాగ్రత్త. జేబులో ఎప్పుడూ తొమ్మిది సిమ్కార్డులు పెట్టుకుంటాడు. తల్లి, భార్య, పిల్లలు, సోదరుడు.. సందర్భాన్ని బట్టి ఒక్కొక్కరితో ఒక్కోసారి ఒక్కో నంబర్తో కాల్ చేసి మాట్లాడుతుంటాడు. ఇలా ఆరేండ్ల కాలంలో 61 చోరీలు చేశాడు. కొట్టేసిన బంగారం హైదరాబాద్, బెంగళూరు దుకాణాల్లో అమ్మేస్తాడు. ఆ ప్రాంతంలో చోరీలు పూర్తికాగానే మకాం మరోచోటుకు మారుస్తాడు. చోరీ సొమ్ముతో పఠాన్ తొమ్మిది లగ్జరీ కార్లు కొన్నాడు. అన్నీ బ్రోకర్ల ద్వారానే. ఆరు నెలలు కాగానే వాటిని తక్కువ ధరకు తిరిగి వాళ్లకే అమ్మేస్తాడు. తరచూ ఇండ్లు మార్చే పఠాన్ తన ఇద్దరు పిల్లలను బడిలో చేర్చేటప్పుడు కూడా ‘తండ్రి పేరు’ అన్న దగ్గర తన పేరు కాకుండా మారుపేర్లు రాయించాడు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. తెలంగాణ పోలీసులు వలవేసి పట్టేశారు. ‘నేను దొంగతనం చేసిన తర్వాత ఎన్నోసార్లు పోలీసుల ముందు నుంచే తాపీగా నడుచుకుంటూ వెళ్లాను. యూనిఫాంలో ఉన్న పోలీసులను నేను గుర్తుపడతాను కానీ.. స్టేషన్లో ఏ రికార్డులూ లేని నన్ను మీరెలా గుర్తుపడతారు సార్!’ అంటూ విచారణలో పఠాన్ చెప్పిన మాటలకు పోలీసు అధికారులు సైతం అవాక్కయ్యారు.
తమిళనాడులోని రేవతీపురం ఉరపాకం ప్రాంతానికి చెందిన తమిళ సెల్వన్ సైకాలజీలో ఎమ్మెస్సీ చేశాడు. ఇతను ఓ సైకో దొంగ. ఇండ్లలో చోరీలు చేసే రకం కాదు. ఇంటర్నెట్ సమాచారాన్ని ఆయుధంగా చేసుకుంటాడు. యూనివర్సిటీలు, కళాశాలల్లో సీనియర్ మహిళా ఫ్యాకల్టీ ఫొటోలు, ఫోన్ నంబర్లు సేకరిస్తాడు. వాళ్ల ఫొటోలను టెక్నాలజీ వాడి నగ్న చిత్రాలుగా మారుస్తాడు. వాటిని టెలిగ్రాం యాప్ ద్వారా వాళ్లకు పంపుతాడు. నగ్న చిత్రాలు నెట్లో పెడతానంటూ భయపెట్టి బిట్కాయిన్స్ రూపంలో డబ్బులు డిమాండ్ చేస్తాడు. బేరానికి ఒప్పుకోకపోతే టెక్నాలజీ సాయంతో బాధితుల ఫోన్లో ఖాతాలను తెరిచి నగ్న చిత్రాలు షేర్ చేస్తాడు. ‘మీరు నాతో మాట్లాడాలంటే మళ్లీ ఈ ఫొటోలు నాకు షేర్ చేయండి’ అని రిక్వెస్ట్ పెడతాడు. బాధితురాలి ఫోన్కు వేర్వేరు ఫోన్ల నుంచి ఆమె చిత్రాలే వెళ్లేలా చేస్తాడు. ఈ ప్రచారం ఆగాలంటే తను అడిగిన మొత్తం పంపాలని డిమాండ్ చేస్తాడు. ఇలా దాదాపు 200 మంది మహిళల జీవితాలతో ఆడుకున్నాడు సెల్వన్. అదే టెక్నాలజీ సాయంతో రాచకొండ పోలీసులు.. తమకు ఫిర్యాదు అందిన ఐదు రోజుల్లోనే తమిళ సెల్వన్ను అరెస్టు చేశారు.
మహ్మద్ సలీం 1991 నుంచి చోరీలు చేస్తున్నాడు. నవాబ్ సాహెబ్కుంటకు చెందిన మహ్మద్ సలీం బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి అభిమాని. అందుకే, ఏకంగా తన పేరును మార్చుకున్నాడు. దాదాపు 160 దొంగతనాలు చేసిన సలీం చోరీ స్టయిల్ కాస్త డిఫరెంట్. ఎన్నడూ సంపన్నుల ఇంట్లో దొంగతనం చేయడు. మధ్యతరగతి ఇండ్లనే టార్గెట్ చేస్తాడు. వాళ్లయితే పోలీసులపై పెద్దగా ఒత్తిడి చేయలేరని, పలుకుబడి ఉపయోగించలేరని తన లాజిక్. అయినా, పోలీసులు వదల్లేదు.. 22 సార్లు జైలుకు పంపారు. కానీ మారింది లేదు. ఇప్పుడు సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను ఎంచుకొని చోరీలకు పాల్పడుతున్నాడు. తాజాగా 2021 ఆగస్ట్లో ఓ చోరీ కేసులో పోలీసులకు చిక్కాడు సలీమ్ ఉరఫ్ సునీల్ శెట్టి.
తాళం ఉన్న ఇండ్లలోకి చొరబడి చోరీలు చేయడంలో ఈ ఇద్దరు కర్ణాటక దొంగల స్టైలేవేరు. ఉత్తరహళ్లికి చెందిన దొంగ ప్రకాశ్ అలియాస్ బాలాజీ అలియాస్ ఖాన్ది ఒక కొత్త మోడస్ ఆపరాండి. ఒక ఏరియాలో తాళం వేసి ఉన్న ఇండ్లను గమనిస్తాడు. రాత్రి వెళ్లి ఆ ఇంటి గొళ్లానికి న్యూస్పేపర్ పెట్టి వస్తాడు. పొద్దున్నే మళ్లీ వెళ్తాడు. గొళ్లానికి తాళంతోపాటు పేపర్ ఉంటే ఇంట్లోవాళ్లు ఇంకా ఊరినుంచి రాలేదని నిర్ధారించుకుంటాడు. ఒకవేళ పేపర్ తీసి ఉంటే ఆ ఇంటి జోలికి వెళ్లడు. ఇలా ఓనర్లు తిరిగి రాలేదని గుర్తించిన తర్వాత.. పట్టపగలు మెల్లగా ఆ ఇంట్లో దూరి తన పని కానిచ్చేస్తాడు. ఒకవేళ పోలీసులకు పట్టుబడితే మాత్రం ఒక్కోసారి ఒక్కో పేరు చెప్పి..తాను మొట్ట మొదటిసారిగా చోరీ చేస్తున్నట్టు అమాయకంగా నటిస్తాడు. ఒకసారి జైలు నుంచి బయటికి వస్తే మళ్లీ అంతా మామూలే. మరో దొంగ నగేశ్ది ఇంకో స్టైల్…ఇంటి లోపల కార్లు పార్క్ చేసి, గేటుకు తాళం ఉంటే చాలు..వెంటనే బకెట్, మగ్, షాంపూతో ఆ ఇంట్లోకి వెళతాడు.. ఎవరైనా గమనించి ఆపితే కారు క్లీన్ చేయాలని ఓనర్లు చెప్పారంటూ కట్టింగ్ ఇస్తాడు. ఎవరూ చూడకపోతే కారునే కాదు.. ఇంటినీ క్లీన్గా దోచుకుని చెక్కేస్తాడు.
హైవేలకు ఆనుకుని ఉండే ఊర్లను ఎంచుకుంటారు వారు. అందరూ మోడ్రన్ డ్రెస్లో ఉండే 18 నుంచి 25 ఏండ్ల యువతులే. ఊరి చివర్లో కాపుకాస్తూ వచ్చిపోయే ద్విచక్ర వాహనదారులను అటకాయిస్తారు. అనాథ పిల్లల చదువుల కోసం డొనేషన్లు కలెక్ట్ చేస్తున్నామంటూ తొలుత మాటల్లోకి దింపుతారు. అడిగినంత ఇచ్చారా సరేసరి… లేదంటే బెదిరింపులకు దిగుతారు.. ఈ ఉత్తరాది అమ్మాయిల బ్యాచ్ వెనుక పెద్ద ముఠాలే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఈ తరహా వసూళ్లకు పాల్పడిన ఘటనలు అనేకం ఉన్నాయి. పోలీసుల నిఘా పెరగగానే మరోచోటికి మకాం మారుస్తారు. తాజాగా ఈ ముఠా కదలికలు గుంటూరు జిల్లా పెదకాకానిలో ఆంధ్రా పోలీసులు గుర్తించారు.
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఓ పల్లెటూరు ముల్తానీపురా. ఆ ఊరికి చెందిన కంజేఖేర్వా ముఠా పేరు దాదాపు దక్షిణాది రాష్ట్రాల పోలీసులందరికీ తెలుసు. ఇక్కడ వంద కుటుంబాలు ఉంటాయి. దాదాపు 60 శాతం కుటుంబాలకు దొంగతనమే వృత్తి. అనాదిగా ఆ ఊరు చోర నిపుణులకు పుట్టినిల్లు. దొంగతనానికి బయటికి వచ్చారంటే ఒక్కొక్కరు కనీసం కిలో బంగారం దోపిడి చేయనిదే తిరిగి ఇండ్లకు వెళ్లరు. ధాబాల దగ్గర భోజనం కోసం ఆగే బస్సుల్లో చోరీలు చేయడంలో వీరు సిద్ధహస్తులు. అంతేకాదు, ఆ ఊరి నియమం ఏంటంటే ఆ కుటుంబాల్లో ఆడపిల్లల్ని అసలు చదవనివ్వరు. మగపిల్లల్ని బడికి పంపినా, ఎవ్వరినీ ఉన్నత చదువుల దాకా పోనివ్వరు. బడి పూర్తికాగానే చోరీల్లో తర్ఫీదు మొదలవుతుంది. ఆ ఊరు గుట్టపై ఉండటంతో మైనర్లను కాపలాకు ఉపయోగించుకుంటారు. పోలీసులెవరైనా అటువైపు వస్తే అప్రమత్తం చేయడం పిల్లల బాధ్యతే. పోలీసులు తమ ఇలాఖాలో కాలుపెడితే, తీవ్రంగా దాడులు చేయడానికైనా వెనుకాడరు. తెలంగాణలోనూ పలుచోట్ల దొంగతనాలు చేశారు. వీళ్ల కదలికలపై రెండు నెలలపాటు నిఘాపెట్టారు సైబరాబాద్ పోలీసులు. ఎట్టకేలకు ఆ ముఠా కూకట్పల్లిలో చోరీకి వస్తున్నట్టు అందిన ముందస్తు సమాచారంతో ఇక్కడే వాళ్లను పట్టేశారు.
…? నాగోజు సత్యనారాయణ
సమంత, అఖిల్ ఫిట్నెస్ వెనుక ఉన్నది ఇతనే.. బాలీవుడ్ స్టార్స్ కూడా ఈయన శిష్యులే
వాట్సాప్ అంతలా క్లిక్ అవ్వడానికి కారణమేంటి? ఇది ఫ్యామిలీలకు ఎలా యూజ్ అవుతుంది?
సెలబ్రెటీలకు కోట్లు కుమ్మరిస్తున్న ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్.. అసలు ఏంటది?