Donate Kart | ఆపదలో ఉన్నవారికి సాయం చేయాలనిపిస్తే.. అమెజాన్నో, ఫ్లిప్కార్ట్నో ఆశ్రయించలేం కదా! ఆ పని చేసిపెట్టడానికంటూ ఓ వేదిక ఉండాలి. ఆ బాధ్యత మేం తీసుకుంటామంటూ ముగ్గురు యువకులు ముందుకొచ్చారు. పేదల అవసరానికి, ఉన్నవారి దాతృత్వానికి మధ్య నిర్మించిన ఆ మానవతా వారధి పేరు.. డొనేట్కార్ట్. ఆ కృషికి గుర్తింపుగా ‘ఫోర్బ్స్ ఇండియా’ ముప్పై ఏండ్ల లోపు ముప్పై మంది ఆంత్రప్రెన్యూర్స్ జాబితాలో చోటు సంపాదించారు.
ఆపద సమయంలో ఆపన్న హస్తం కోసం ఎదురుచూసేవారు అనేకమంది. ఆ పరిస్థితుల్లో స్వచ్ఛంద సంస్థలు ఎంతో కొంత సాయం అందిస్తాయి. ఆ ఎన్జీవోలకుకూడా ఎవరో ఒకరు విరాళం ఇవ్వాల్సిందే. లేకపోతే సేవా కార్యక్రమాలు ఆగిపోతాయి. కానీ, జనంలో ఎన్నో అపోహలు. ‘స్వచ్ఛంద సంస్థలు నిజంగానే బాధితులకు సాయం చేస్తాయా? లేదంటే ఆ డబ్బును దుర్వినియోగం చేస్తాయా?’ అన్న అనుమానాలు. వాటిని పటాపంచలు చేస్తూ.. నగదుకు బదులుగా వస్తువులను విరాళంగా ఇచ్చే వెసులుబాటు కల్పించింది.. డొనేట్కార్ట్.
సందీప్ శర్మది కోదాడ. గ్రాడ్యుయేషన్ కోసం ఎన్ఐటీ నాగ్పూర్లో చేరాడు. అనిల్కుమార్ రెడ్డిది చిత్తూరు. తనదీ అదే క్యాంపస్. ఇద్దరికీ అక్కడే పరిచయమైంది. భావాలు కలిశాయి. క్యాంపస్లోని ‘ప్రయాస’ సోషల్క్లబ్లో చురుగ్గా పనిచేశారు. ఆ బాధ్యతల్లో భాగంగా ఎన్జీవోలను సందర్శించేవారు. దీంతో వాటి నిర్వహణలోని సమస్యలను ఆకళింపు చేసుకున్నారు. ఏదో ఒకరోజు వాటన్నిటికి పరిష్కారం చూపాలని అనకున్నారు. ఫైనలియర్లో ఉండగా ‘ఇంట్రడక్షన్ టు ఆంత్రప్రెన్యూర్షిప్’ కోర్సు చేశారు. ఆ సమయంలోనే వాళ్ల ఆలోచనలన్నీ మారిపోయాయి. సామాజిక సమస్యలకు పరిష్కారం చూపాలన్న ఆకాంక్ష బలపడింది. సోషల్ ఆంత్రప్రెన్యూర్షిప్ వైపు మళ్లారు.. సందీప్, అనిల్.
అనిల్కు గోఫస్లో, సందీప్కు వేదాంతా కంపెనీల్లో ప్లేస్మెంట్స్ వచ్చాయి. ఉద్యోగం చేస్తే మంచి జీతం రావచ్చు, విలాసంగా బతకొచ్చు. కానీ అదే జీవితం కాదని అనుకున్నారు ఇద్దరూ. ఆఫర్లను కాదనుకొని ‘డొనేట్కార్ట్’ మీదే దృష్టిపెట్టారు. సంవత్సరం తర్వాత సారంగ్ బొబాడే వీరితో జతకలిశాడు. ప్రస్తుతం.. అనిల్కుమార్ రెడ్డి సీయీవో, సందీప్ శర్మ, సీఎంవో, సారంగ్ సీఓఓగా వ్యవహరిస్తున్నారు. మొదట్లో నాగ్పూర్ నుంచే డొనేట్కార్ట్ పనిచేసేది. తర్వాత ముంబైకి మారిపోయారు. మూడేండ్లుగా హైదరాబాద్ టీ-హబ్ నుంచి సేవలు అందిస్తున్నారు. డొనేట్కార్ట్ తరఫున ఇప్పటివరకు రూ.150 కోట్ల నిధులను సేకరించారు. వేయికి పైగా ఎన్జీవోలకు సేవలు అందిస్తున్నారు. పదిలక్షల విరాళాల మైలురాయిని చేరుకున్నారు. ఎన్జీవోలకు కావాల్సిన వస్తువుల వివరాలు ఈ వెబ్సైట్లో ఉంటాయి. దాతల సాయం కావాలనుకున్న సంస్థలు ఈ వెబ్సైట్లో పేరు నమోదు చేసుకోవాలి. వాటికి దాతలు స్పందిస్తారు.
చెన్నై నగరాన్ని వరదలు ముంచెత్తాయి. ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్జీవోలన్నీ ఇక్కడే మకాం వేశాయి. అనిల్, సందీప్ కూడా చెన్నై వెళ్లి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విరాళాలు చాలానే వస్తున్నాయి. ఆహారం, సామగ్రి, వస్తువులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. కానీ అవసరానికి మించి వస్తుండటంతో చాలా వరకు వృథా అవుతున్నాయి. ముఖ్యంగా ఆహార పదార్థాలు, ఔషధాలు ఒకే రకమైనవి వచ్చేవి. అత్యవసరమైన మరికొన్ని వస్తువులు అసలు అందేవే కాదు. ఈ సమస్య పరిష్కారానికి సాంకేతికతను పునాదిగా చేసుకొని ఒక ప్లాట్ఫామ్ను రూపొందించాలన్న ఆలోచన వచ్చింది వాళ్లకు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతోనూ మాట్లాడారు. విరాళాలు వసూలు చేయడం పెద్ద లక్ష్యమని తెలిసినా ధైర్యం చేసి రంగంలోకి దిగారు. దాతల సాయానికి సార్థకత చేకూర్చడం, బాధితులకు సకాలంలో సాయం అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
“అమెరికాలో జాబ్ వదిలేసొచ్చి.. సొంతూళ్లో లైబ్రరీ స్టార్ట్ చేసిండు”
Shark Tank India | అక్కడ ఒక్క ఐడియా చెప్తే చాలు.. మీ జీవితమే మారిపోతుంది !!”
Gitanjali Rao | 15 ఏళ్ల అమ్మాయే కదా అని తక్కువ అంచనా వేయకండి”
Sai Chinmayi | ఐటీ జాబ్ వదిలేసి వ్యవసాయం చేస్తున్న తెలంగాణ ఆడబిడ్డ”
“అప్పుడు నెత్తిమీద గంపపెట్టుకుని తిరిగాడు.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు”
“ఈ తహసీల్దార్ రూటే సపరేటు.. మంత్లీ మంత్లీ ఛాలెంజ్లు పెడుతూ ఆదర్శంగా మారిన ఎమ్మార్వో”
“ఆఫ్రికా దేశంలోని ఓ బ్యాంకు రూపురేఖల్నే మార్చేసిన తెలంగాణ బిడ్డ.. ఇంతకీ ఆయన ఏం చేశాడంటే..”