ఎవరు నిర్ణయించారో, ఎప్పుడు తీర్మానించారో . ‘ భిక్షాటన ’ .. వారి కులవృత్తిగా స్థిరపడింది. కొన్ని తరాలుగా ఇల్లిల్లూ తిరిగి అడుక్కోవడమే.. జీవనాధారమైంది. అయితే, మారుతున్న కాలంతోపాటు వారిలోనూ మార్పు వచ్చింది. పూర్వీకుల నుంచి వస్తున్న ఈ వెనుకబాటును.. ఆ కాలనీ మూకుమ్మడిగా తరిమికొట్టింది. తమవారెవరూ ‘ భిక్షాటన ’ చేయొద్దని తీర్మానించింది. ‘అడుక్కోవడం’ అనే సామాజిక దురాచారంపై స్వీయ నిషేధం ప్రకటించి, ఆదర్శంగా నిలుస్తున్నది.. బుడగ జంగాల కాలనీ.
జోగుళాంబ గద్వాల జిల్లా అనంతపురం గ్రామాన్ని ఆనుకొని ఉంటుంది గూడెం. ఇక్కడ 120 బుడగ జంగాల కుటుంబాలు ఉన్నాయి. సుమారు 600వరకూ జనాభా ఉన్న ఈ పల్లెను బుడగ జంగాల కాలనీ అని పిలుస్తారు. గతంలో వీరిలో ఎక్కువమంది భిక్షాటన చేసేవారు. కానీ, కాలంతోపాటు మనుషులూ మారారు. యాచనను పక్కన పెట్టి, తమకు తోచిన పనులు చేసుకొంటున్నారు. సర్కారు సహకారం ఉండనే ఉంది. వృద్ధులు, దివ్యాంగులకు ఆసరా పింఛన్లు వస్తున్నాయి, పెద్దలంతా కూలీ చేసుకొంటున్నారు. వ్యవసాయ పనుల్లో, ఉపాధి హామీలో జీవనోపాధిని వెతుక్కొంటున్నారు. ఇక, యువతీ యువకులు సంతల్లో చిన్నచిన్న వ్యాపారాలు చేస్తున్నారు.
బుడగ జంగాల కాలనీలో ఈ మార్పు పదేండ్ల క్రితం ప్రారంభమైంది. తమ తరంతోనే భిక్షాటన ఆగిపోవాలనీ, తమ పిల్లలు ఈ వృత్తిలోకి రావద్దనీ కాలనీ పెద్దలు సంకల్పించారు. ‘నలుగురూ మెచ్చే ఏ చిన్న పనైనా చేస్తాం కానీ.. ఆత్మాభిమానాన్ని చంపుకొని, అడుక్కోవడం మాత్రం చేయం’ అంటూ కాలనీ వాసులంతా ప్రతిన బూనారు. ఇకమీదట స్థానికులెవరైనా భిక్షాటన చేస్తే రూ.5 వేలు జరిమానా విధిస్తామని కట్టుబాటు చేసుకొన్నారు. అయితే, మధ్యలో కొందరు అలవాటు ప్రకారం భిక్షాటన చేస్తూ దొరికిపోయారు. కమిటీ పెద్దలు వారికి జరిమానా విధించారు. దీంతో, కష్టపడి పనిచేయడం మొదలుపెట్టారు. నచ్చిన పని చేసుకొంటూ హాయిగా జీవిస్తున్నారు. పిల్లలను ఇంగ్లిష్ మీడియం చదువులు చదివిస్తున్నారు. ఒకప్పుడు, యాచకులకు అడ్డాగా ఉన్న తమ కాలనీలో.. ఇప్పుడు, అడుక్కొనేవారే లేరని గర్వంగా చెబుతున్నారు.
గతంలో మాకంటూ ఓ సంఘం లేదు. ఊరూరూ తిరిగి అడుక్కొని జీవించేవాళ్లం. 20 ఏండ్ల కిందట, ఏదైనా పని చేసి ఆత్మాభిమానంతో జీవించాలనే ఆలోచన వచ్చింది. సంతలు, గ్రామాలు తిరిగి అల్లం, ఎల్లిపాయలు అమ్మడం మొదలు పెట్టిన. మా గూడెంలోనే సొంతిల్లు కట్టుకున్న. నాకు నలుగురు పిల్లలు. అందరినీ బాగా చదివిస్తున్న. ఒకప్పుడు కూడు, గూడు, గుడ్డ కోసం ఇతరులపై ఆధారపడేటోళ్లం. ఇప్పుడు మేమే కష్టపడి సంపాదించుకుంటున్నం.
– కల్యాణం సవారన్న, బేడ, బుడగ జంగం హక్కుల పోరాట సమితి
గతంలో బతుకుదెరువు కోసం రాష్ట్రాలు దాటి వలస పోయేటోళ్లం. భిక్షాటనే మాకు దిక్కు అనుకునేటోన్ని. కానీ. ఎన్నాళ్లిలా ఊరూరూ తిరుగుతూ బతకాలని అనుకున్నం. పెద్దలందరితో మాట్లాడి, ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నం. ఇప్పుడు పండ్లు, తినుబండారాలు అమ్ముకుంటూ ఆత్మాభిమానంతో
బతుకుతున్నం.
– గానిగ నర్సింహ బేడ బుడగ జంగాల గ్రామ అధ్యక్షుడు
మేము భిక్షాటన చేస్తే.. మా పిల్లలు కూడా ఆ వృత్తిలోకే దిగేవారు. అందుకే, మా
తరంతోనే అడుక్కొని బతికే దుస్థితి పోవాలనుకున్నం. ఆ ప్రయత్నం వృథా పోలేదు. మా కాలనీలోని 120 కుటుంబాల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ‘దేహీ’ అని యాచించే పరిస్థితి లేదిప్పుడు. కష్టపడి బతకడంలో ఉన్న సంతోషాన్ని అందరూ అనుభవిస్తున్నరు.
– సిరిగిరి ఆంజనేయులు
– పెద్ది విజయ భాస్కర్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వ్యవసాయం చేస్తున్న డాక్టర్.. గవర్నర్ ఇంటికి కూడా ఈయన పండించిన బియ్యమే వెళ్తాయి
116 ఏండ్లు గడిచినా చెక్కుచెదరని గడీ.. ఓ రైతు కట్టుకున్న ఇంద్ర భవనం ఎక్కడుందో తెలుసా?
Mystery | ఈ ఊళ్లో ఒకరు పోతే.. వారంలో ఇంకొకరు చావాల్సిందే.. వందల ఏళ్లుగా ఇదే సీన్