రామన్నపేట, మార్చి 10 : అప్పుల బాధతో చేనేత కార్మిరుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్లంకి గ్రామానికి చెందిన మిర్యాల బాలరాజు (39) చేనేత పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య అంజలి, ఒక కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. చేనేత పని కోసం ఐదేండ్ల క్రితం భువనగిరిలోని ఫయ్ స్టార్ ఫైనాన్స్ కంపెనీలో రూ.3.50 లక్షలు అప్పు తీసుకున్నాడు. గత రెండు నెలలుగా చేనేత పనులు లేకపోవడంతో డబ్బులు లేక ఈఎంఐ కట్టలేదు. దీంతో మనస్థాపానికి గురై మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య అంజలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.