పురాతన భవనాలకు ‘తెలంగాణ’ పెట్టింది పేరు. ఖిల్లాలు, గడీలు.. ఇలా ఎన్నో అపురూప కట్టడాలను ఈ గడ్డ మీద నిర్మించారు. అయితే, ఓ రైతు కూడా తన కోసం ఇంద్ర భవనాన్ని నిర్మించాలనుకొన్నాడు. 1905లోనే లక్ష రూపాయలకు పైగా ఖర్చు పెట్టి, అ‘పూర్వ’ భవనానికి ప్రాణం పోశాడు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోట కొండూర్లో ఓ పురాతన భవనం అబ్బుర పరుస్తున్నది. ప్రాచీన శిల్పకళా కౌశలంతో, నాటి నిర్మాణశైలిని చాటుతున్నది. 116 ఏండ్లు దాటినా చెక్కు చెదరకుండా, నేటికీ ఠీవిగా నిలబడి ఉన్నది. 1905 ప్రాంతంలో గ్రామానికి చెందిన పెద్ద రైతు, భూమండ్ల (కటికె) ఇస్తారి.. ఈ భారీ భవనాన్ని నిర్మించాడు. ఆ రోజుల్లోనే 1500 ఎకరాల భూస్వామి ఆయన. వ్యవసాయంలో బాగా సంపాదించాడు. దొంగల బారినుంచి తన ఆస్తిని కాపాడుకోవడంతోపాటు తరత రాలు నిలిచేలా ఓ అద్భుతమైన భవనాన్ని నిర్మించాలని సంకల్పించాడు. సుమారు 400 గజాల విస్తీర్ణంలో, మూడు అంతస్తుల్లో నిర్మితమైన ఈ భవనానికి అప్పట్లోనే రూ.లక్షకు పైగా ఖర్చు అయ్యింది. కుటుంబ సభ్యులతోపాటు బంధువులు, స్నేహితుల కోసం 14 ప్రత్యేక గదులను ఏర్పాటు చేయించాడు. చాడ గ్రామానికి చెందిన నకాసివారు (శిల్పా కళాకారులు) ఈ భవన నిర్మాణ పనులు చేశారు. నాటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఓ పెద్ద బంగ్లాకు ప్రాణం పోశారు.
పెద్ద బంగ్లాలోని ప్రతి అంగుళం.. అద్భుత శిల్పకళతో అలరాతుంది. ప్రధాన ద్వారంతోపాటు తలుపులన్నీ వివిధ రకాల లతలు, పూలు, జంతువులు, పక్షుల కళాకృతులతో దర్శనమిస్తాయి. దర్వాజాలతోపాటు కిటికీలు, గోడలూ చూడచక్కని అలంకారాలతో కనిపిస్తాయి. తరతరాల పాటు నిలిచి ఉండేలా ఎంతో పటిష్ఠంగా ఈ భవనాన్ని నిర్మించారు. ఇందుకోసం నాలుగు గజాల లోతు నుంచి పునాది వేశారు. మొదటి అంతస్తు వరకూ పూర్తిగా రాయి, డంగు సున్నంతోనే నిర్మించారు. ఈ రాయిని మోటకొండూర్ సమీపంలోని సింగారం నుంచి తెప్పించారు. అప్పట్లో ‘సింగారం బండ’ అంటే.. ప్రసిద్ధి. ఆ తర్వాతి అంతస్తులను డంగు సున్నాన్ని ఉపయోగిస్తూ, ఇటుకలతో కట్టారు. పెద్ద దర్వాజాతోపాటు తలుపులు, కిటికీలకూ టేకు కలపను ఉపయోగించారు. నాణ్యతకు పెద్దపీట వేస్తూ నిర్మించిన పెద్ద బంగ్లా 116 సంవత్సరాలైనా, చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నది. ఈ భవన నిర్మాణం గురించి తెలిసిన ఇంజినీర్లు హైదరాబాద్ నుంచి వచ్చి చూసి వెళ్లేవారు. ఇప్పటికీ అంతే. అటుపక్క వెళ్లేవారి కండ్లన్నీ ఆ భవంతి మీదే.
మా ముత్తాత కటికె ఇస్తారి ఎంతో ఇష్టంగా ఈ భవనాన్ని కట్టించుకొన్నాడని మా తాతలు చెప్పేవారు. భవనం నిర్మించేటప్పుడు కూలీలకు కూడా ఇక్కడే అన్నం పెట్టేవారట. వరంగల్లో కాకతీయ పాలకులు కట్టించిన ఓ భవనాన్ని చూసి, అదే నమూనాలో పెద్ద బంగ్లాను నిర్మించాడు. అప్పటి కలెక్టర్, సబ్కలెక్టర్, ఇతర అధికారులు కూడా ఈ భవనాన్ని సందర్శించారట.
– భూమండ్ల లక్ష్మయ్య,మోట కొండూర్.
✍ తండ జహంగీర్గౌడ్ ,యాదాద్రి