Ramaayanam | మాకు ఊహ తెలిసినప్పటి నుంచీ రైలు ప్రయాణమంటే.. హైదరాబాద్ పోవడమే! సెలవుల్లో మా కజిన్ ఆనంద్ అన్నయ్య వెంట రాజధానికి ప్రయాణం కట్టేవాళ్లం. రైల్లో రకరకాల మనుషుల్ని చూడటం, బయట వెనక్కి వెళ్తున్న చెట్లను కిటికీలోంచి చూడటం.. చాలా సంతోషంగా ఉండేది. ఆ యాత్రలో ఎన్నో అనుభవాలు.
ఒక్కోసారి అదృష్టం కొద్దీ ఎదురెదురు కిటికీల సీట్లు నాకూ, అక్కకూ దొరికాయి అంటే.. ఇక పండగే! ‘ఈ చెట్టు నాది, ఆ గుట్ట నీది’.. ‘ఈ పొలం నాది, ఆ గుడిసె నీది’.. ‘ఈ చెరువు నేనే తవ్వించాను, ఆ బిల్డింగ్ నేనే కట్టించాను’.. ఇలా కనిపించినవన్నీ పంచుకునేవాళ్లం. అప్పట్లో ఎందుకో గానీ మధ్యలో ఊరు కూడాలేని చోట రైలు చాలాసేపు ఆపేవారు. ఎంతో సేపటికి అవతలి వైపునుంచి గానీ, పక్కనుంచి గానీ ఏదైనా ట్రైన్ విపరీతమైన వేగంతో పక్క పట్టాలపై దూసుకొని వెళ్లేది. ఆ చప్పుడు భలే ఎంజాయ్ చేసేవాళ్లం. కానీ, మన రైలును ఆపి వాటిని ఎందుకు పంపుతారో తెలిసేది కాదు. రైలు మెల్లగానైనా వెళ్తుంటే పరవాలేదు కానీ.. అలా గంటలు గంటలు ఆగిపోతే చాలా విసుగు వచ్చేది. కొన్నిసార్లు అమ్మ ఒళ్లో చెరో పక్కన పడుకొని నిద్రపోయే వాళ్లం. మేం పడుకొని లేచేసరికి కూడా ఇంకా సికింద్రాబాద్ వచ్చేది కాదు. అక్కడ కూడా ప్లాట్ఫామ్ ఖాళీ లేదని అరగంట బయటే ఆపేవారు. ఎట్టకేలకు నాంపల్లి స్టేషన్లో దిగి.. చిన్నమ్మ వాళ్లింటికి వెళ్లేవాళ్లం. చిన్నమ్మ మాకు వేడివేడి అన్నం, పప్పు, చారు, పెరుగుతో భోజనం పెట్టేది. మేం వచ్చామని పక్కనున్న గజానన్ స్వీట్ హౌస్లో నమక్ పేడా, స్వీట్, బూందీ మిక్చర్ తెప్పించేది. ఫుల్లుగా తిని, రైలు ప్రయాణపు అలసట మర్చిపోయి.. మా కజిన్స్ హైమక్క, లక్ష్మీ వాళ్లతో ఆడుకునేవాళ్లం.
ఒకసారి ఆనంద్ అన్నయ్య రాలేకపోయాడు. అమ్మ కూడా ఇంటి నిండా చుట్టాలున్నారని రానన్నది. మేమేమో హైదరాబాద్ వెళ్లాలి.. నుమాయిష్ చూడాలి.. సెలవులు అయిపోయేలోగా మళ్లీ సంక్రాంతికి ఇంటికి వచ్చి, ఇంట్లో పండుగ చేసుకోవాలి. హోమ్ మినిస్టర్ అమ్మే అయినా.. పర్యాటక, విదేశాంగ శాఖామంత్రి నాన్నే! మమ్మల్ని ఒంటరిగా పంపడానికి నాన్న అస్సలు ఒప్పుకోడు. మొత్తానికి మా పోరు పడలేక.. మా వెంట కొమురయ్య అనే ఓ యువకుణ్ని పంపడానికి సిద్ధం చేశాడు నాన్న. అతను గ్రామ సుంకరి కొడుకు. పైగా ఎనిమిదో తరగతి చదివాడు. మా ఇద్దరి పాకెట్ మనీ అక్కకు ఇచ్చి.. (నేను కొంచెం లాఫర్వా మనిషినని నాన్నకు తెలుసు) రైలు టికెట్లకు, మిగతా ఖర్చులకు అతనికి డబ్బులు ఇచ్చాడు నాన్న.
“పదిలెం మరి! జాగ్రత్తగ వీండ్లను దింపి.. రేపు మళ్ల రైలుకు రా! ఊరికె అందరితోని మాట్లాడుకుంటు ఉండక, పిల్లలను కనిపెట్టుకుంటు ఉండు. ‘ఎటు పోతున్నం? ఏంది?’ అనేది ఎవ్వరికి జెప్పకు” అని పదేపదే చెప్పాడు. చెప్పాల్సిన జాగ్రత్తలు అమ్మ కూడా ఎన్నో మాకు చెప్పింది. స్టేషనుకు వెళ్లేసరికి రైలు గంట లేటు. అది మామూలే మాకు. ఓ చెట్టు కింద నిలబడ్డాం. ఇక మేము వారించే లోపలే.. మనవాడు రెచ్చిపోయి ఓ సిమెంట్ బెంచీ ఖాళీ చేయించి, మమ్మల్ని కూర్చోబెట్టాలని చూశాడు. వాళ్లు కొంచెం జరిగి ఒకరికి జాగా ఇచ్చారు. కానీ, మేము అక్కాచెల్లెళ్ల అనుబంధం ప్రదర్శించి నిలబడే ఉన్నాం.
కొమురయ్య కాసేపటికి కొంచెం పక్కనే నిలబడి ఉన్న నలుగురి దగ్గరికి వెళ్లాడు. ఎడం చెయ్యి సగం మడిచి వెనక్కు పెట్టుకుని, దానితో మామూలుగా వేలాడేసిన కుడి చెయ్యిని మోచేతి దగ్గర పట్టుకుని, కుడి కాలును కొంచెం దూరంగా విసిరేసి వంకరగా నిలబడి ..అందులో ఒకాయన్ని.. “యాడికి పోతాన్రు?!” అనడిగాడు. అతను “బోనగిరి” అని చెప్పి.. “నువ్వాడికి పోతానవ్? ఒక్కనివేనా?” అన్నాడు. మనవాడు వెంటనే.. “యే! ఒక్కన్ని కాదు. గటు జూడు. గా చెట్టు కింద నిలబడ్డరు.. గా ఇద్దరు అమ్మాయిలను పట్నం తీస్కపోతాన!” అన్నాడు.. మా వైపు వేలుపెట్టి చూపిస్తూ. వింటున్న మనిషి దిగ్భ్రాంతి చెందినట్టున్నాడు. “ఏమిటికి?” అని అడిగాడు. “ఊకెనే! సూశి ఒచ్చేతందుకు!” అని కొమురయ్య జవాబిచ్చాడు. ఆ మనిషితోపాటు మరో ముగ్గురు మా వైపు జాలిగానూ, కొమురయ్య వైపు అనుమానంగానూ చూడటం మొదలుపెట్టారు. మళ్లీ మనవాడే.. “ఎహె! సలికాలం సెలవులొచ్చిన కాణ్నుంచి.. పట్నం పోతమని సతాయిస్తాన్రంట. మా దొరకేమో బగ్గ పనులున్నయ్! ఇగేం చేస్తరు? నేనొక్కడ్నే ఊళ్లె జర సదూకున్నోన్ని అన్నట్టు! గందుకే నన్ను పిల్శి.. అమ్మాయిలను పట్నం కాడ పడగొట్టి రమ్మన్నడు. గందుకే తోలుకపోతాన!” అని చెప్పాడు. వాళ్ల జాలి.. మా వైపు నుంచి కొమురయ్య వైపు తిరిగింది. వద్దని వారిద్దామంటే మా వైపు చూడడు. ఇటు రమ్మని సైగ చేద్దామంటే బాగుండదు. ఏమీ చెయ్యలేక.. ప్రేక్షకుల్లా నిలబడ్డాం నేనూ, అక్కా! అరగంట గడిచేసరికి.. అక్కడక్కడా ఇద్దరు ముగ్గురు నిలబడి ఉన్న ప్రతిగుంపు దగ్గరికీ కొమురయ్య వెళ్లి, అదే పోజులో నిలబడి.. “యాడికి పోతానవ్?” అంటూ అదే ప్రశ్న అడిగి.. నాన్న మాటలు గాలికొదిలి.. తన వద్దనున్న మొత్తం సమాచారం అందించేశాడు. మొత్తానికి గంట గడిచేసరికి ఓ మూలగా జోలె పట్టుకుని అడుక్కునేవాడు, రైల్వే బుకింగ్ క్లర్క్, స్టేషన్ మాస్టర్, రైలు వస్తున్న సూచనగా గంట కొట్టే వ్యక్తితో సహా ఆ ప్లాట్ఫామ్ మీదున్న తెలుగు భాష తెలిసిన ప్రతి వ్యక్తికీ.. మేము ఇద్దరు అక్కాచెల్లెళ్లం సెలవులకు హైదరాబాద్లోని గౌలిగూడా గురుద్వారా పక్కన, ఫైర్స్టేషన్ ఎదురుగా ఉన్న మా చిన్నమ్మ వాళ్ల మూడంతస్తుల ఇంటికి వెళ్తున్నామనీ, వెంట బాగా చదువుకున్న, తెలివైన, హైదరాబాద్ బాగా తెలిసిన కొమురయ్య వస్తున్నాడనీ తెలిసిపోయింది. అయిదు గంటల రైలు ప్రయాణంలో కూడా ఈ సమాచార పౌరసంబంధ శాఖా నిపుణుడు వీలైనంత మందికి మా పుట్టుపూర్వోత్తరాలు తెలియజేశాడు. అంతేకాదు.. తనకు ఎక్కడో కొంచెం దూరంగా సీటు దొరికినా, మధ్యమధ్య మా సీటు దగ్గరికి వచ్చి.. ‘ఉన్నారుగా!?’ అన్నట్టు తొంగిచూసి, గొప్ప రాజభక్తి ప్రకటించేవాడు. మా పక్కనున్న వాళ్లు మమ్మల్ని.. “ఎవరాయన? ఊరికే వచ్చి చూస్తున్నడు?” అనడిగితే.. మేము జవాబు చెప్పలేక చచ్చేవాళ్లం.
– నెల్లుట్ల రమాదేవి ( Nellutla Ramadevi ), రచయిత్రి
Ramaayanam | సంగీత జ్ఞానం (గాత్రం)
Ramaayanam | చెంబులకొద్దీ నీళ్లు ముంచి ఇస్తుంటే.. బడికి పోయినా బాగుండె అని అనిపించింది!
Ramaayanam | తొలి యాత్రా స్పెషల్!