Ramaayanam |‘నానమ్మ గురించి రాయడం మొదలుపెడితే.. ఓ పెద్ద గ్రంథమే అవుతుంది. నానమ్మకు కొన్ని పనుల విషయంలో పేటెంట్ ఉండేది. వాటిని మటుకు చాలా అందంగా, పరిపూర్ణంగా చేసేది. మిగతావాటి సంగతి నాకు తెలియదు.
ఇంట్లో బావినిండా నీళ్లు, చేద బొక్కెన ఉన్నా.. ఎందుకోగానీ నీళ్లు చేది చిన్నచిన్న బిందెలు, చెంబుల్లో నింపి మూతలు పెట్టి ఉంచడం ఆమెకిష్టం. తెల్లవారి ఉదయాన్నే వాడని నీళ్లను పారపోసి మళ్లీ చేది నింపేది. నాకూ, అక్కకూ పొద్దున్నే మొహాలు కడుక్కోవడానికి చెంబుల్లో నీళ్లు చేది ఉంచేది. ఇక చలికాలం అయితే నీళ్లు మరీ చల్లగా ఉంటాయని.. కట్టెల పొయ్యి మీది కొప్పెరలో కాగుతున్న నీళ్లకు కొన్ని చన్నీళ్లు కలిపి గోరువెచ్చగా ఇచ్చేది. మేము తెచ్చుకుంటామని ఎంత చెప్పినా వినకపోయేది. మధ్యమధ్య ఆ పొయ్యిలో కట్టెలు జరిపి నిప్పులు తోడి చల్లార్చి, మళ్లీ కట్టెలు సర్ది మంట ఆరిపోకుండా చూసేది. ఆ బొగ్గులను పాలు కాచడానికి, పప్పు వండటానికి కుంపటి కోసం వాడేవారు. ఇంకా చిన్నప్పుడైతే చల్లారిన తరువాత పొయ్యిలో మెత్తటి బూడిద ఎత్తి, వస్త్రకాయిదం పట్టి మాకు పళ్లు తోముకోవడానికి ఇచ్చేది. అది ఎందుకో భలే రుచిగా ఉండేది. కట్టెల పొయ్యిలో ముందటి భాగంలో ఎక్కువ మంట తగలని చోట నిప్పులు బయటికి తోడి, వాటిమీద చిక్కుడు కాయలు కాల్చి, గింజలు ఒలిచి మాకు తినడానికి ఇచ్చేది.
నానమ్మ వారానికి ఒకసారి చల్ల చేసేది. రోజూ తీసి పెట్టిన మీగడంతా ఓ కుండలో వేసి, తాటికమ్మలతో చేసిన చుట్టకుదురుపై కుండను ఉంచేది. దాని మూతిని ఓ వదులు తాడుతో గుంజకు కట్టేది. కర్రతో చేసిన కవ్వపు చివరను కుండలో మీగడకు ఆనేట్టు ఉంచి.. పై చివరను మరో వదులు తాడుతో అదే గుంజకు కట్టేది. ఇక మధ్యలో రెండుమూడు చుట్లుగా కవ్వానికి తాడుచుట్టి.. రెండు చివర్లనూ ఒకసారి అటూ, ఒకసారి ఇటూ లాగుతూ చల్ల చిలికేది. వెన్న పడేదాకా అలా నిలబడి ఉండటమే కాదు, శ్రావ్యమైన గొంతుతో పాటలు కూడా పాడేది. ‘చల్లజెయ్యి గొల్లభామ, నడుము తిప్పు నంగనాచి’ పాట ఆమె దగ్గరే నేర్చుకుని.. మళ్లీ తన మీదే పాడేవాళ్లం. ఆమె అత్తగారి ఊరు గొల్లపెల్లి గనుక చిన్న నానమ్మను మేమే కాదు.. అందరూ ‘గొల్లమ్మ’ అనే పిలిచేవారు. “ఆఁయ్! నన్నే అంటున్నారే భడవలు!” అని మందలించేది.
చల్ల కవ్వం చేసే లయబద్ధ్దమైన చప్పుడు, దాంట్లోంచి వెన్న రావడం, ఆ తరువాత దాన్ని వెచ్చబెట్టి నెయ్యి చేయడం.. ఇదంతా చూడటం మాకు ఇష్టంగా ఉండేది. సెలవురోజు గనుక అయితే.. ఆ పరిసరాల్లోనే తచ్చాడేవాళ్లం. అంతా అయ్యాక నానమ్మ మాకు పారిజాత ఆకులు తెంపి, వాటిల్లో వెన్న పెట్టేది. పైన పంచదార వేసేది. మేము లొట్టలేసుకుంటూ నాలుకతో అద్దుకుంటూ తినేవాళ్లం. పారిజాతం ఆకులు గరుగ్గా నాలుకకు గుచ్చుకునేవి. బాదం ఆకులుండగా పారిజాతం ఆకుల్లో ఎందుకు పెట్టేదో మాకు అర్థమయ్యేది కాదు. ఓ సారి అమ్మనడిగాను. మరి డౌట్స్ తీర్చుకోవాలిగా! “అమ్మా! నానమ్మ ఎందుకు గా బరుసు బరుసు చిన్న ఆకులల్ల వెన్న పెడ్తది?!” అని. అమ్మ నవ్వి “వెన్న ఆరోగ్యమే గానీ, ఆకలి గాకుండ కడుపుల మందం జేస్తదని గావొచ్చు. పెద్ద ఆకులల్ల పెడితె.. మీరు అట్లనే ఎక్కువ తింటరు గద! కృష్ణుడు జూడు.. వెన్న తినే ఉంటడు” అని చెప్పింది. అప్పటికి బుర్ర ఊపేశాను. ఈ మధ్య ఒకాయన బటర్ కాఫీ తాగితే బోలెడు శక్తి వస్తుందనీ, రోజంతా ఆకలేయదనీ చెపితే.. ఈ సంగతి కృష్ణుడికి అప్పుడే తెలుసన్నమాట అనుకున్నాను.
ఇక వెన్న తీశాక మిగిలిన ఆ పుల్లటి చల్లకోసం “గింతంత సల్ల పొయ్యిండ్రి!” అంటూ కొంతమంది రెగ్యులర్గా వచ్చేవారు. వాళ్లు సత్తుగిన్నెలో, మట్టి గురుగులో తెచ్చుకునేవారు. ఎవరైనా ఉత్త చేతుల్తో వచ్చినా “ఏంది!? చేతులూపుకొంట ఒచ్చినవ్? ఎండ్ల పొయ్యాలె?” అంటూ, తన దగ్గర స్టాక్లో ఉన్న మట్టి గురుగుల్లో పోసి ఇచ్చేది నానమ్మ.
అయితే ఎందుకో గానీ, నానమ్మకు కొందరు వ్యక్తులంటే అస్సలు పడేది కాదు. వారిలో వీరన్న ఒకడు. ఆర్థికంగా బాగా చితికిపోయిన వ్యాపార కుటుంబం వాళ్లది. బహు సంతానం. వాళ్లమ్మ పేరు యశోదనే గానీ.. పాలు, పెరుగు కొనుక్కునే స్తోమత లేదు. నానమ్మ చల్లజేసే టైంకి కరెక్టుగా ఓ చెంబుతో వీరన్న వచ్చేవాడు. ఏమీ మాట్లాడకుండా అలా మనసాల మధ్య గచ్చులో నిలబడేవాడు. చల్ల చేయడం పూర్తయి నానమ్మ అటు ఇటు తిరుగుతూ.. ఎటుపోతే అటు వెనకే తిరిగేవాడు. నానమ్మ చూసినా చూడనట్టు నటించేది. ఎప్పటికో గానీ.. “యేముడుది? ఏం గావాలె?!” అనడిగేది. ఆ మాటకే అతని మొహం గుమ్మడి పువ్వులా విచ్చుకుని..
“సల్ల.. సల్ల పొయ్యిమన్నది మా అమ్మ!” అనేవాడు.
“సడె చక్కదనం! బర్రెకు గింతంత తవుడు తెచ్చి పెట్టేది లేదుగాని, చల్ల పొయ్యాల్నా? మీ నాయిన గిర్నీలనే పని జేస్తుండె.. తవుడు తెస్తేంది పిలగా?!” అని అతని స్థాయికి మించిన సవాల్ విసిరేది నానమ్మ. కార్యసాధకుల గొప్ప లక్షణం సంయమనం. అది బోలెడంత ఉండేది వీరన్నకు. చిరునవ్వుతో అలాగే నిలబడేవాడు. ఈలోగా నాన్న చూసి.. “పాపం! గింత చల్లనట పొయ్యరాదే ఆ పిల్లగానికి!” అనేవాడు. దానికి నానమ్మ వెంటనే.. “ఆ! పోస్త తియ్! నా చేయి తీరలేదు. తొందరేంది!” అనేది. నాన్న అటు వెళ్లగానే వీరన్నను చూసి.. “నా ఎదురుంగ ఎందుకు నిలబడుడు?! కాస్త పక్కకు నిలబడు!” అనేది చిరాకుగా. వీరన్న చిరు నవ్వును మాత్రం వదలక పోయేవాడు. మొత్తానికి నానమ్మ చల్ల పోసిన తర్వాత తీసుకుని మరీ వెళ్లగలిగేవాడు. ఆ తర్వాత రోజుల్లో బతుకమ్మ పండుగలప్పుడు వాళ్ల చెల్లెలు తంగేడు పువ్వు కోసం మా ఇంటికి వచ్చేది. కానీ, ఆమెకు ఇలాంటి అనుభవం ఎదురయ్యేది కాదు. మేముగానీ నాన్నగానీ వెంటనే ఓ సంచిలో తంగేడు పువ్వులు ఇచ్చి పంపించే వాళ్లం. ఎందుకో మరి నానమ్మ వీరన్నకు మాత్రమే అలాంటి ట్రీట్మెంట్ ఇచ్చేది.
నెల్లుట్ల రమాదేవి ( Nellutla Ramadevi ), రచయిత్రి
Ramaayanam | చెంబులకొద్దీ నీళ్లు ముంచి ఇస్తుంటే.. బడికి పోయినా బాగుండె అని అనిపించింది!
Ramaayanam | తొలి యాత్రా స్పెషల్!
Ramaayanam | బళ్లు తెరిచారంటే..