Vijay | తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ నిర్వహించిన తొలి భారీ బహిరంగ సభ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తిరుచిరాపల్లిలో సోమవారం జరిగిన ఈ సభలో ఆయన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ, విపక్షాల విమర్శలకు ఘాటుగా సమాధానమిచ్చారు. అలాగే దివంగత నేత ఎంజీఆర్తో తనను పోలుస్తున్న వ్యాఖ్యలపై కూడా స్పష్టమైన స్పందన ఇచ్చారు. తమిళనాడులో ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే, ఏఐఏడీఎంకే ఆధిపత్య రాజకీయాలకు ముగింపు పలికి, మార్పు కోసం ఓటు వేసిన ప్రజలకు విజయ్ ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి అధికారాన్ని అప్పగించిన ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే తన ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.
సభలో మాట్లాడిన విజయ్ విపక్ష నేతల విమర్శలపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఆరు నెలలు మా పాలనను పరిశీలిస్తామని కొందరు అన్నారు. కానీ ఆరు నెలలు కాదు, ఆరు రోజులు కూడా వేచి చూడకుండా విమర్శలు మొదలుపెట్టారు అంటూ సెటైర్లు వేశారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే విమర్శలు ప్రారంభించడం బాధాకరమని అన్నారు. ప్రజలు మార్పు కోరుకున్నందుకే తమ పార్టీకి భారీ మద్దతు ఇచ్చారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రయాణం అధికారాన్ని ఆస్వాదించేందుకు కాదని, ప్రజలకు సేవ చేయడానికేనని విజయ్ తెలిపారు. నేను ముఖ్యమంత్రిని కాదు. ఈ రాష్ట్ర ప్రజల మొదటి సేవకుడిని. ప్రజల సంక్షేమమే నా లక్ష్యం అంటూ భావోద్వేగంగా మాట్లాడారు.
ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడమే తన ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని, రాజకీయాలకు కొత్త దిశ చూపించే ప్రయత్నం చేస్తామని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీవీకే సాధించిన విజయాన్ని విశ్లేషిస్తూ పలువురు రాజకీయ విశ్లేషకులు ఎంజీఆర్ తొలి ఎన్నికల ప్రదర్శనతో పోల్చిన విషయాన్ని ప్రస్తావించిన విజయ్, ఆ పోలికలపై వినమ్రంగా స్పందించారు.ఎంజీఆర్ గారు ఎప్పటికీ ఎంజీఆరే. ఆయనతో నన్ను పోల్చడం సరైంది కాదు. నేను మీ విజయ్ని. అన్నాదురై, పెరియార్, ఎంజీఆర్ చూపించిన మార్గంలో ప్రజల కోసం పనిచేయడానికి వచ్చిన మీ తమ్ముడిని, మీ అన్నను అని చెప్పారు. తమిళ రాజకీయ చరిత్రలో సినీ నటుడిగా ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రి స్థాయికి చేరిన నాయకుల్లో ఎంజీఆర్ ఒక మహానేత అని కొనియాడారు.