Actor | తెలుగులో తెరకెక్కిన యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ ‘హుషార్ పిట్టలు’ విడుదలకు సిద్ధమైంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అయితే తాజాగా నిర్వహించిన ప్రెస్మీట్లో జరిగిన ఓ అనూహ్య సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమాలో నటించిన పుట్టా భాను స్టేజీపైనే భావోద్వేగానికి గురై చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రెస్మీట్లో చిత్రబృందం తమ అనుభవాలను పంచుకుంటుండగా, మైక్ అందుకున్న పుట్టా భాను ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. మాట్లాడుతూనే “ఒక్క నిమిషం” అంటూ తన చెంపలపై తానే పలుమార్లు గట్టిగా కొట్టుకోవడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. హీరో, హీరోయిన్తో పాటు వేదికపై ఉన్నవారంతా కంగారుపడగా, ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
అయితే తన భావోద్వేగానికి కారణాన్ని వెల్లడిస్తూ భాను ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నా పేరు పుట్టా భాను. సినిమాలో కూడా నా పాత్ర పేరు అదే. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ప్రాణం. మా ఊర్లో ఏ సినిమా వచ్చినా ఫస్ట్ షో చూసేవాడిని. తెరపై కామెడీ సీన్లు వస్తే మనసారా నవ్వేవాడిని. కానీ ఈసారి అదే పెద్ద తెరపై నా సన్నివేశాలకు ప్రేక్షకులు నవ్వడం చూసినప్పుడు అది కలలా అనిపించింది అని చెప్పాడు.అంతేకాకుండా, “ఇది కలా? నిజమా? ఇంకా నమ్మలేకపోతున్నా. అందుకే ఇలా చేశాను. ఎనిమిదేళ్లుగా ఎన్నో కష్టాలు పడినా సినిమానే నా జీవితం అనుకుని ముందుకు వచ్చాను. ఒక మంచి నటుడిగా నిరూపించుకోవడమే నా లక్ష్యం అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.
భాను మాటలు విన్న చిత్రబృందం అతడిని ఓదార్చగా, అక్కడున్నవారు చప్పట్లతో అభినందించారు.’హుషార్ పిట్టలు’ చిత్రాన్ని దర్శకుడు భిక్షు యూత్ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు. ఇందులో అన్ష్, వాసవి గణేష్ హీరో హీరోయిన్లుగా నటించగా, గోవర్ధన్, సునీత మనోహర్, రమేష్, అంజి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 15న విడుదల కానున్న ఈ సినిమాపై చిత్రబృందం మంచి అంచనాలు పెట్టుకుంది. ఇక ప్రెస్మీట్లో పుట్టా భాను చూపించిన భావోద్వేగం, సినిమాపై ఆయనకున్న అంకితభావాన్ని ప్రతిబింబించిందని సోషల్ మీడియాలో పలువురు ప్రశంసిస్తున్నారు.