Kasi Majili Kathalu Episode 41 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : యువరాజు కందర్పుడు ఎగిరే జింకను ఎక్కి, ఒకసారి హిమాలయాలకు ఆవలి దేశానికి వెళ్లాడు. చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా.. చివరి నిమిషంలో మరణదండన నుంచి తప్పించుకున్నాడు. అక్కడినుంచి తిరిగివస్తూ మహారాష్ట్ర దేశపు యువరాణి మనోరమను చూశాడు. ఆమె నిద్రపోతుండగా ఆమె ఒంటిపై గంధపు పూతలు పూసి, ఆమెను తికమక పెట్టాడు.
మనోరమ ఆదమరిచి నిద్రపోతున్నది. ఆమెకు సమీపంలోనే నేలపైన చెలికత్తెలు నిద్రిస్తున్నారు. ఏమాత్రం సవ్వడి కాకుండా కందర్పుడు గదిలో ప్రవేశించాడు. మనోరమ చెంతకు చేరి, ముందురోజు రాత్రిలాగే కొంతసేపు ఆమె ఒంటిపై గంధపు పూతలు పూశాడు. పక్కనే ఒక తాంబూలం సిద్ధంచేసి ఉండటం చూసి.. అబ్బురపడుతూనే నోట పెట్టుకున్నాడు. ‘ఓహో! ఈ తాంబూలంలో కస్తూరికంటే కర్పూరం ఎక్కువగా ఉంది. ఇది మగవాళ్లు వేసుకోదగినది. బహుశా దీన్ని నా కోసమే ఇక్కడ పెట్టి ఉంటారు’ అనుకున్నాడు. కొద్దిసేపు నమిలిన తరువాత మనోరమ బుగ్గ మీద.. తాంబూల రసంతో ఒక పువ్వు బొమ్మ గీశాడు.
అనంతరం తన పేరు చెక్కి ఉన్న ఉంగరాన్ని మనోరమ వేలికి ధరింపజేసి, ఆమె ఉంగరాన్ని తాను గ్రహించాడు. మనోరమతో కలిసి తాను విహరిస్తున్నట్లుగా ముందే గీసి ఉంచిన చిత్రపటాన్ని ఆమె తలగడ పక్కనే పెట్టేసి, అక్కడినుంచి నిష్క్రమించాడు.
అంతలో తెల్లవారింది. యువరాణి మందిరం కోలాహలంగా మారింది. చెలికత్తెలందరూ చేరి, మనోరమను ఆట పట్టించసాగారు. బుగ్గపై పూసిన తాంబూల రసాన్ని, ఒంటిపై వేసిన చందన ముద్రలను, వేలికి పెట్టిన ఉంగరాన్ని పరిశీలిస్తూ రకరకాల వ్యాఖ్యలు చేశారు. కొంతసేపటికి దిండుపక్కనే ఉంచిన కందర్పుని బొమ్మను చెలికత్తె మధులిక ముందుగా గమనించింది.
“ఇతడెవరో నిజంగా దివ్యపురుషుడే. మనుషులలో ఇంతటి అందగాడు ఉంటాడంటే నేను నమ్మను” అన్నది మధులిక.
“మన యువరాణికి మాత్రం ఏం తక్కువ?! ఆయనకు సరిజోడీగానే ఉంది కదా!” అన్నది మరో చెలికత్తె.
వారి మాటలతో మనోరమ సిగ్గుల మొగ్గయింది.
“సరే.. ఈవేళైనా మెలకువగా ఉండి, ఆ మన్మథుల వారిని పట్టుకోవాలి. పగటిపూట కాస్త ఎక్కువ నిద్రపో!” అని సలహా ఇచ్చింది మధులిక.
ఆ రాత్రికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మధులిక ఆజ్ఞ ప్రకారం ఆవేళ రాత్రి మందిరంలో మిగిలిన వాళ్లెవరూ లేరు. యువరాణి మనోరమ తన హంసతూలికా తల్పంపై నిద్ర నటిస్తున్నది. దూరంగా తెరలమాటున మధులిక వేచి ఉన్నది. సరిగ్గా నాలుగు జాముల రాత్రివేళకు గవాక్షం నుంచి తన ఎగిరే జింకతో సరాసరిగా మందిరంలోకి వచ్చి వాలాడు కందర్పుడు. మనోరమ తల్పంపై కూర్చుని, ఆమె అందాన్ని చూస్తూ కొద్దిసేపు ఆనందించాడు. ఆ తరువాత యథాప్రకారం చందనపు గిన్నెను అందుకుని, ఆమె మేనికి పూత పూయబోయాడు.
మనోరమ చటుక్కున చేయి పట్టుకుని.. “మధులికా! దొంగ దొరికాడు” అన్నది. వెంటనే మధులిక వచ్చింది. కందర్పుడు కొద్దిగా వెనక్కు తగ్గాడు. మధులిక అతనికి నమస్కరించి..
“అయ్యా! మీరెవరు?! మీది ఏ దేశం?! ఇక్కడికెలా వచ్చారు?” అని సౌమ్యంగా ప్రశ్నించబోయింది. కానీ, మనోరమ మాత్రం కోపం నటించింది.
“ఈ సాహసం ఏమిటో కనుక్కో! నిజం చెప్పకపోతే బంధించి చెరసాలలో పెడతామని చెప్పు” అన్నది.
ఆమె మనోభావాలను పసిగట్టి మధులిక..
“అయ్యా! మీ వేషధారణను బట్టి గుణశీల గౌరవాలు కలిగిన వారని అర్థమవుతున్నది. కానీ, ఎదుటివారి మనోగతం తెలియకుండా ఇలా చేయవచ్చా?! మూడురోజుల నుంచి మీరు చేసిన పనులతో నిద్ర చెడగొట్టుకుని, మా చెలి ఎంత విరహ బాధను.. కాదు కాదు! మనోవేదనను అనుభవిస్తున్నదో తెలుసా?!” అని కళ్లు పెద్దవి చేసి అడిగింది.
అందుకు కందర్పుడు అంతే మాటకారితనంతో.. “కామినీ! నేనేం చేయగలను? మన్మథుని శాసనాన్ని ఉల్లంఘించడం ఎంతవారికైనా సాధ్యం కాదు కదా! అయినా నీ సఖురాలికి ఇంత సౌందర్యమేల ఉండవలె? ఉన్నది పో.. ఆ సౌందర్యంతో నా మనసును దోచుకోవడం తగునా?! తప్పు మీ వద్ద పెట్టుకుని నన్ను నిందించడం న్యాయమేనా?!” అని ప్రశ్నించాడు.
ఆ మాటలు విని మనోరమ, మధులిక ఇద్దరూ పెదవులు బిగపట్టి కళ్లతోనే నవ్వుకున్నారు.
“మంచి తప్పే పట్టుకున్నారు. ముందు మీరెవరో చెప్పండి?” అని మళ్లీ గద్దించింది మధులిక.
కందర్పుడు తన వృత్తాంతమంతా ఆమెకు వివరించి చెప్పాడు. మనోరమ తన హృదయాన్ని దోచుకున్న విధానాన్ని రసికత ఉట్టిపడేలా వర్ణించి చెబుతుంటే.. ఆమెకు విపరీతమైన సిగ్గు ముంచుకొచ్చింది. దూరంగా వెళ్లి, ఒక తెరమాటున నిలుచుండిపోయింది. అప్పుడు మధులిక.. “సఖీ! సిగ్గు పడతావెందుకు?! పాపం ఆయన దాచిపెట్టకుండా తన కథనంతా చెప్పాడు కదా! చేసిన తప్పునకు ఏ శిక్ష వేయాలో చెప్పు” అన్నది.
“తప్పు ఒప్పుకొన్నవారిని కాపాడటం మంచివాళ్ల లక్షణం” అన్నాడు కందర్పుడు.
“కుదరదు! తమరు చేసింది క్షమించే తప్పు కాదు. రాజపుత్రీ! నేనొక్కమాట చెబుతా విను. ఏ తప్పులు చేసి వీరు మిమ్మల్ని బాధించారో.. వాటినే మీరు కూడా వీరిపట్ల చేయడం ఈ నేరానికి తగిన శిక్ష” అంటూ చందనపు గిన్నెను మనోరమ చేతికి అందించింది.
కందర్పుణ్ని మంచంపై కూర్చోబెట్టి, అతడి మేనికి చందనసేవ చేసింది మనోరమ. పూలమాలను మెడలో వేసి నమస్కరించింది. మధులిక మరో పూలమాలను కందర్పునికి అందించింది. దానిని అతడు మనోరమ మెడలో వేశాడు. అలా వారిద్దరి గాంధర్వ వివాహానికి సాక్ష్యంగా నిలిచిన మధులిక ఆ తరువాత అక్కడినుంచి తొలగిపోయింది. ఆ రేయి ఆ జంట ముచ్చట్లలో మన్మథుడు కృతార్థుడయ్యాడు.
* * *
తెల్లవారిన తరువాత మధులిక వచ్చేసరికి ఇద్దరూ గాఢనిద్రలో ఉన్నారు. అప్పుడే చెలికత్తెలందరూ యువరాణి మందిరానికి వస్తున్నారు. వారిని ఆపడం ఎలాగో తోచక..
“యువరాణీ వారికి అస్వస్థతగా ఉంది. ఈవేళ మీకందరికీ సెలవిచ్చారు” అని చెప్పింది మధులిక.
ఆ వార్త ఎలాగో మహారాణికి తెలిసింది. ఆమె పరుగు పరుగున కూతురిని చూడటానికి వచ్చింది. మహారాణి రాక ముందుగా తెలుసుకున్న మధులిక యువరాణిని నిద్రలేపింది. ఆమె తడబడుతూ నిద్రలేచి, తల్లికి ఎదురువెళ్లింది. తనకు తేలికగానే ఉన్నదని, రాత్రి సరిగా నిద్రపట్టకపోవడం వల్ల కొంచెం ఎక్కువసేపు నిద్రపోయానని సమయోచితంగా చెప్పి.. తల్లిని వెనక్కు పంపేసింది మనోరమ.
కందర్పుణ్ని నిద్రలేపి, రహస్యంగా జలకాలాడించి.. మధుర పదార్థాలతో భోజనం పెట్టింది. ఆనాటి నుంచి ఆరుమాసాల పాటు ప్రతిరాత్రీ కందర్పుడు రహస్యంగా యువరాణి మందిరానికి రాకపోకలు సాగించాడు. ఎవరో అపరిచితుని వల్ల యువరాణి గర్భవతి అయిందనే వార్త అంతఃపురం అంతా వ్యాపించింది. ఆ వార్త వినగానే మహారాజు వీరసేనుడు ఆగ్రహోదగ్రుడు అయ్యాడు. అతికష్టం మీద మహారాణి ఆయన కోపాన్ని నిలువరించింది.
“ఇందులో నిజం ఉండకపోవచ్చు. శత్రువులెవరైనా కక్షకొద్దీ ఇలాంటి నీలివార్తలు వ్యాప్తి చేస్తూ ఉండవచ్చు. అమ్మాయిని నేను కనుక్కుంటాను” అన్నది మహారాణి.
“వద్దు! నేను చెప్పినట్లు చేయి” అంటూ వీరసేనుడు ఆమెకొక సలహా చెప్పాడు. దాని ప్రకారం బంగారపు రేకులు తెచ్చి, నువ్వుగింజలంత పరిమాణంలోకి చితక కొట్టించింది మహారాణి. వాటిని యువరాణి మనోరమ ఒంటికి పూసుకునే చందనంలో కలిపించింది. ఆ రహస్యాన్ని మనోరమ కానీ, కందర్పుడు కానీ గుర్తించలేదు. ఆ రాత్రంతా యువరాణితో గడిపిన కందర్పుడు తెల్లవారకముందే అక్కడినుంచి నిష్క్రమించాడు. రాజధాని నగరానికి పొలిమేర వరకు తన జింకపై ఎగిరి వెళ్లాడు. ఒక చెరువు గట్టున దిగి, దంతధావనం చేసుకోసాగాడు.
అతను ఆకాశంలో ఎగురుతున్నప్పుడే, ఎండలో మెరిసే బంగారపు రేకుల ఆనవాళ్లను రాజభటులు గుర్తించారు. తెలివిగా అతణ్ని అనుసరించి వెళ్లి, చుట్టుముట్టారు. కానీ, బంధించేలోగా కందర్పుడు ఒడుపుగా ఎగిరిపోయాడు. చేసేదేమీ లేక విషయాన్ని మహారాజుతో విన్నవించుకున్నారు భటులు. నేరస్థుడు పట్టుబడక పోయినా, నేరం జరుగుతున్న సంగతి రూఢి అయింది. దాంతో రాజదంపతులు యువరాణిని తమ మందిరంలోనే కట్టడి చేశారు.
‘త్వరలోనే వచ్చి కలుసుకుంటాను’ అని మధులిక ద్వారా కందర్పుడు సందేశం పంపాడు. ఆ దేశం నుంచి నేరుగా కుంభకోణానికి వెళ్లిపోయాడు.
తల్లిదండ్రులతో తన వృత్తాంతమంతా వివరంగా చెప్పాడు. కందర్పుడు – మనోరమ గాంధర్వ వివాహానికి పెద్దల మద్దతు లభించింది. తొలినాటి ప్రేయసి అయిన సుభద్రను కందర్పుడు రెండోభార్యగా స్వీకరించాడు. మణివర్మ నుంచి ఎగిరే జింకను పెళ్లికానుకగా పొందాడు. మనోరమ చక్కని పిల్లవాణ్ని కన్నది. అతనికి నాగదత్తుడు అని పేరుపెట్టారు. కందర్పునికి పట్టాభిషేకం జరిగింది.
కొంతకాలం తరువాత.. మళ్లీ ఎగిరేజింక సాయంతో దేశవిదేశాలు చుట్టిరావాలనే కోరిక కందర్పునిలో మొగ్గ తొడిగింది. మొదట్లో రాత్రిపూట మాత్రమే తన దేశాన్నంతా చూసుకుని, తెల్లవారేసరికి వచ్చేసేవాడు. ఆ తరువాత మెల్లిగా వారం, పదిరోజులపాటు ఇతర దేశాలకు కూడా యాత్రలు చేయడం మొదలుపెట్టాడు. కుంభకోణానికి నాలుగు దిక్కుల్లోనూ భరతఖండంలోని అన్ని దేశాల విశేషాలు కందర్పుడు తెలుసుకో గలిగేవాడు. ఆయా దేశాల్లోని మంచిని గ్రహించి, వాటిని తన పాలనకు ఉపయోగించుకునేవాడు. అలా రాజ్యక్షేమం, దేశాటన చేయాలనే కందర్పుని కోరిక ఒకేసారి నెరవేరుతూ ఉండేవి.
* * *
కందర్పుడు ఒకనాడు ఎగిరే జింకతో గుర్తుతెలియని రాజ్యంలో దిగాడు. నగరంలోని వింతలన్నీ చూసుకుంటూ నడుస్తూ, అనుకోకుండా వేశ్యావాటికలోకి వెళ్లాడు. అక్కడ ఒక తగాదా కందర్పుని దృష్టిని ఆకర్షించింది. ఒక వేశ్యమాతను ఒక విటుడు బతిమాలుకుంటున్నాడు. ఆమేమో వాణ్ని ఛీ కొడుతూ, అసహ్యకరంగా తిడుతున్నది.
“ఏరా దరిద్రచూడామణీ! మళ్లీ వచ్చావూ? ఎన్నిసార్లు తోలినా కుక్కలా తోకాడించుకుంటూ మళ్లీ మా గుమ్మంలోకే వస్తావేం?!” అంటున్నది.
“ఒక్కసారి విద్యావతిని పలకరించి పోతాను” అని బతిమాలుకుంటూ లోపలికి వెళ్లాలని ప్రయత్నించాడా రసికుడు. వాణ్ని మెడబట్టి వీధిలోకి తోస్తూ..
“నక్క ఎక్కడ? నాకలోకం ఎక్కడ? విద్యావతి నీలాంటి దరిద్రుల ముఖమైనా చూడదు. పో ఇంటికి పో” అని తలుపేసుకుంది వేశ్యమాత.
“ఇంకా ఇల్లెక్కడుంది వల్లకాడు!? ఏట్లోకి పోవాల్సిందే!” అని గొణుక్కున్నాడు రసికుడు.
కందర్పునికి అతనిపై జాలి కలిగింది.
“మిత్రమా! ఏం జరిగింది?” అంటూ ఆరా తీశాడు.
అతడు అక్కడికి దగ్గరిలోని ఒక జనపదానికి అధికారి. ఒకనాడు దేవాలయంలో నాట్యం చేస్తుండగా విద్యావతిని చూసి, మనసు పారేసుకున్నాడు. తనకు కన్నెరికం చేయమని వేశ్యమాత అయిన రత్నావతిని బతిమాలుకున్నాడు. అలాగే చేస్తానని మాటిచ్చి, రోజూ ఇంటిచుట్టూ తిప్పించుకుంది. క్రమంగా ఆస్తిపాస్తులు, వస్తువాహనాలు లాగేసింది. కానీ, ఎన్నడూ విద్యావతి ముఖమైనా చూడనివ్వలేదు. తానామె కాలివేలైనా ముట్టుకుని ఎరగడు. తీరాచేసి ఇప్పుడేమో ఇంట్లోకి కూడా రానివ్వడం లేదు.
“దీనిమూలంగా దరిద్రుడినై చెడిపోయాను. మీరైనా కాస్త బుద్ధిచెప్పి పుణ్యం కట్టుకోండి!” అని కోరాడతను.
కందర్పుడు అతణ్ని ఓదార్చి.. “వేశ్యలు ఎంతకైనా తగినవారు. ఎంతటి పాపానికైనా ఒడిగడుతారు. వాళ్లనేం చేసినా పాపం లేదు. సరే! నేనామెకు బుద్ధి చెబుతాను. కొద్దిరోజులు ఓపిక పట్టు. నీ డబ్బంతా ముక్కుపిండి వసూలు చేస్తాను” అన్నాడు.
అతడు నమస్కరించి వెళ్లిపోయాడు. ఆ తరువాత కందర్పుడు నగరంలోని ఒక కళాకారుని ఇంటికి వెళ్లాడు. తన జింకకు రంగు మార్చి, గరుత్మంతునిలా రెక్కలు కుట్టించాడు. శంఖు చక్రాలు, పద్మం, గద తయారు చేయించుకున్నాడు. ఒంటినిండా తిరునామాలు దిద్దుకుని అచ్చంగా విష్ణుమూర్తిలా వేషం వేసుకున్నాడు. రెండుజాముల రాత్రివేళ జింకను పూరించి.. విద్యావతి శయన మందిరపు కిటికీ వద్ద ఆకాశంలో ఎగర సాగాడు.
(వచ్చేవారం.. ఎగిరే జింక-4)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | ఎగిరే జింక-2
Kasi Majili Kathalu | ఎగిరే జింక
Kasi Majili Kathalu | జయభద్రుని తెలివి
Kasi Majili Kathalu | నీతిమంతురాలు
Kasi Majili Kathalu | అనంగ చంద్రిక
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | అదృష్టదీపుడు – 2
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | అదృష్టదీపుడు