Kasi Majili Kathalu Episode 33 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : రాజ్యం లేకపోయినా భరతఖండంలోనే సాటిలేని చక్రవర్తిగా అదృష్టదీపుడు పేరు తెచ్చుకున్నాడు. తల్లిదండ్రులను, తన తమ్ముణ్ని వెతుక్కుంటూ వెళ్లాడు. తమ్ముణ్ని ఉరిశిక్షనుంచి తప్పించడానికి భువనేశ్వరి ఆలయాన్ని కనిపెట్టాడు. కానీ, చివరి నిమిషంలో ఔషధీలతను చేజార్చుకోవడంతో ఆ వింతైన ఆలయం కనిపించకుండా పోయింది.
అదృష్టదీపునికి తాను చేసిన తప్పేంటో అప్పుడు తెలిసింది. భువనేశ్వరి ఆలయాన్ని కంటికి కనిపించేలా చేసిన ఔషధీలత కోసం ఎంతగానో వెతికాడు కానీ, దొరకలేదు. తన ఉత్తరీయంలో మూటగట్టిన వజ్రవైడూర్యాది నవనిధులు మాత్రం అలాగే ఉన్నాయి.
‘ప్రియంవదకు సమాధానం చెప్పడానికి ఈ ఆధారాలు సరిపోతాయి’ అనుకుని.. అదృష్టదీపుడు కొండదిగి, పట్టణంలోకి వెళ్లాడు.
రాజాస్థానంలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా, రాజభటులు ఎదురొచ్చి అతణ్ని బంధించారు.
“హరిదత్తా! ఎక్కడికి పోతావు? పద చెరసాలలోకి..” అంటూ సంకెళ్లువేసి, అతణ్ని నడిపించ సాగారు.
“హరిదత్తుడు ఏమయ్యాడు? ఎక్కడికైనా పారిపోయాడా?! అతనికేదైనా అపాయం కలిగిందా?!” అంటూ అదృష్టదీపుడు అడిగిన ప్రశ్నలకు రాజభటుల వద్ద సమాధానం లేదు.
“నేను వెంటనే మహారాజుగారిని చూడాలి. దయచేసి నన్ను ఆయన వద్దకు తీసుకుపోండి” అని కోరాడు.
“నువ్వు ఎలాగూ చెరసాలనుంచి తప్పించుకుపోయి తప్పు చేశావు. ఈ నేరానికి విచారణ చేయాల్సి ఉంది” అని చెప్పారు వారు.
మరునాడు విచారణ జరిగింది. రాజవాహనుడు కూడా తన ముందున్నది హరిదత్తుడే అనుకుని శిక్ష విధించబోయాడు. ఆ సమయంలో అదృష్టదీపుడు..
“మహారాజా! నేను భువనేశ్వరి ఆలయాన్ని చూసి వచ్చాను. దానికి ఈ నవరత్నాలే సాక్ష్యం..” అంటూ తన ఉత్తరీయంలో కట్టితెచ్చిన రత్నాలను చూపించాడు.
అంత విలువైన రత్నాలను పొందిన అదృష్టదీపుణ్ని చూసి రాజవాహనుడు అసూయపడ్డాడు. అంతలోనే తన కూతురికి తగిన వరుడు లభించాడని ఆనందించాడు. “నువ్వు ఎవరివైనా మరేమీ పరవాలేదు. భువనేశ్వరి ఆలయాన్ని దర్శించావు కనుక, నా కుమార్తె నిన్నే వరిస్తుంది” అన్నాడు రాజవాహనుడు.
“మన్నించండి మహారాజా! నా అసలు పేరు మీకింతవరకూ చెప్పనే లేదు.. నన్ను అదృష్టదీపుడు అంటారు”.
ఆ మాట వింటూనే రాజవాహనుడు సింహాసనం మీదినుంచి లేచి నిలబడ్డాడు. గబగబా నడుచుకుంటూ అదృష్టదీపుని వద్దకు వచ్చాడు. “మీరు చెబుతున్నది నిజమేనా?” అని అడిగాడు.
అందుకు అదృష్టదీపుడు.. “నిజమే మహారాజా! కొన్ని కారణాల వల్ల నా పేరు గోప్యంగా ఉంచాను. ఈ రత్నాలను మీ కుమార్తెకు చూపించండి. ఆమె తప్పకుండా నేను దేవీ ఆలయాన్ని చూసి వచ్చానని గుర్తించగలదు. అయితే ఆమెను నేను కోరుకోవడం లేదు. ఇంతకుముందు ఉరిశిక్ష పడ్డ హరి దత్తుణ్నే మీ కుమార్తె వరించాల్సి ఉంది” అని చెప్పాడు.
“ఆమె అంగీకరిస్తే.. నాకు అభ్యంతరం లేదు. కానీ, హరిదత్తుడు ఎక్కడున్నాడో తెలియదు కదా! ఇప్పుడు ఏం చెయ్యాలి?” అని ప్రశ్నించాడు రాజవాహనుడు.
“నేను, నా మిత్రుడు బలభద్రుడు కలిసి హరిదత్తుణ్ని వెతికి పట్టుకుంటాం. మీవంతు ప్రయత్నం కూడా మీరు చేయండి” అని అదృష్టదీపుడు అక్కడినుంచి కదిలాడు.
* * *
అదృష్టదీపుడు, బలభద్రుడు చెరో దిక్కుకు వెళ్లారు.
బలభద్రుడు వెళ్లిన దిక్కులో.. ఒకనాటి రాత్రి ఒక సత్రపు గదిలో విడిది చేశాడు. అప్పుడు అతని చెవులకు ఇద్దరు బ్రాహ్మణుల మాటలు వినిపించాయి. వారిలో ఒకరు హరిదత్తుణ్ని పెంచుకున్న తండ్రి. ఆయన తన కథను తోటివాడితో ఇలా చెప్పుకొంటున్నాడు..
“మాకు చాలాకాలంపాటు సంతానం కలగలేదు. దాంతో కాశీవిశ్వనాథుని దర్శనం చేసుకున్నాం. కాశీనుంచి తిరిగి ఇంటికి వస్తుండగా అడవిదారిలో.. ఒక కోతి చిన్నపిల్లవాణ్ని పట్టుకొని వెళ్తూ కనిపించింది. దాన్ని అదిలించి నేనా పిల్లవాణ్ని రక్షించాను. వాడి తల్లిదండ్రుల జాడ తెలుస్తుందేమోనని ప్రయత్నించాను. కానీ, ఎవరూ కనిపించలేదు. దాంతో నాకు దేవుడిచ్చిన పిల్లవాడని భావించి, వాడికి హరిదత్తుడని పేరుపెట్టుకుని పెంచుకోసాగాం.
పిల్లవాడు వచ్చిన వేళావిశేషమో ఏమో కానీ, వాడు దొరికిన మూడేళ్లకు మాకో కొడుకు పుట్టాడు. కన్నకొడుకు వచ్చాక, పెంపుడు కొడుకు మీద నా భార్యకు ప్రేమ తగ్గింది. దాంతో వాణ్ని గురుకులంలో ఉంచి పెంచాను. వాడు అందంలో మన్మథుడు, బుద్ధిలో బృహస్పతి. గొప్ప చదువులు చదివాడు. కానీ, వాణ్ని ఓ అమ్మాయి మోసం చేసింది. దాంతో బతుకు మీద విరక్తి కలిగి, చనిపోవాలని నిశ్చయించుకున్నాడట. ఆత్మహత్య చేసుకుంటే నీచగతులకు పోవాల్సి వస్తుంది కనుక.. బాగా ఆలోచించి పుష్పగిరి వెళ్లాడట. ఆ యువరాణి తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతే ఉరి తీయిస్తుందని తెలిసి, చనిపోవడం కోసమే అక్కడికి వెళ్లాడట. నాకీ సంగతి వాడి స్నేహితుల ద్వారా తెలిసింది. వాడింకా బతికి ఉంటే వాణ్ని కలుసుకోవడం కోసమే అక్కడికి వెళుతున్నాను”.. ఆ మాటలు వింటూనే సత్రంలో మరోవైపు కూర్చుని ఉన్న ముసలి బిచ్చగత్తె ఒకరు బిగ్గరగా రోదించ సాగింది.
దాంతో ఆ ఇద్దరు బ్రాహ్మణులు, బలభద్రుడు కూడా ముసలమ్మ దగ్గరికి వెళ్లారు. ఆమెను అనునయించి..
“ఎందుకవ్వా! రోదిస్తున్నావు?” అని ప్రశ్నించారు.
అప్పుడా ముసలమ్మ..
“బాబూ! మాది కౌశాంబి. నేను ఆ దేశాన్నేలే ధర్మపాలుని పట్టమహిషిని. ఒక యుద్ధంలో మా రాజ్యం శత్రువుల పరమైంది. నా పెద్దకొడుకు తప్పిపోయాడు. రెండో కొడుకును కోతి ఎత్తుకుపోయింది. ఇప్పుడు మీరు చెబుతున్నదాన్ని బట్టి.. మీ హరిదత్తుడే నా కొడుకని అర్థమవుతున్నది” అన్నదామె.
“నిజమేనమ్మా! మా హరిదత్తుడు మీ కుమారుడే కావచ్చు. వాడి పోలికలు కొన్ని మీలో కనిపిస్తున్నాయి” అన్నాడు బ్రాహ్మణుడు.
“అదే నిజమైతే మీ పెద్దకొడుకు కూడా మీకు దక్కినట్లే మహారాణీ!” అన్నాడు బలభద్రుడు.
“ఏమిటి బాబూ! నువ్వు చెప్పేది నిజమేనా?!” కనురెప్పలు ఆనందపు బరువును మోయలేని స్థితిలో కన్నీళ్లు పెట్టుకుంటూ అడిగింది ఆ ముసలితల్లి.
“నిజమేనమ్మా! నీ పెద్దకొడుకు మరెవరో కాదు.. భరతఖండంలో తనకు సాటివచ్చే చక్రవర్తి లేడని కీర్తిపొందిన అదృష్టదీప మహారాజు. ఆయన ప్రస్తుతం తన తమ్ముణ్ని రక్షించుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. వారిద్దరూ త్వరలో మిమ్మల్ని కలుసుకోగలరు. దయచేసి మీరంతా నాతో రండి” అని చెప్పాడు బలభద్రుడు.
వారంతా కలిసి పుష్పగిరికి ప్రయాణమయ్యారు.
మరోవైపున.. హరిదత్తుణ్ని వెతుకుతూ వెళ్లిన అదృష్టదీపుడు విదర్భదేశపు రాజధాని ధర్మాపురానికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడ పరిస్థితి గందరగోళంగా ఉంది.
పుష్పగిరి చెరసాలనుంచి పారిపోయిన హరిదత్తుడు అంతకుముందే ధర్మాపురానికి చేరుకున్నాడు. అతణ్ని చూసిన చతురిక, నిజంగా అదృష్టదీపుడే తిరిగి వచ్చాడనుకుంది. నేరుగా అంతఃపురానికి తీసుకుపోయింది. విదర్భ రాజు ఆనందానికి అవధిలేకుండా పోయింది. అప్పటికే చక్కని కొడుకును కన్న కాంతిమతి ఉబ్బితబ్బిబ్బయింది. కుమారుణ్ని భర్తకు చూపించి, అతనితో సంతోషాన్ని పంచుకోవాలనుకుంది.
కానీ.. ‘నువ్వెవరో నాకు తెలీదు. నీకు కొడుకు పుట్టడానికి నేను కారణం కాదు’ అని గోల పెడుతున్న హరిదత్తుణ్ని చూసి, అంతా గందరగోళానికి లోనయ్యారు. పారిపోయే వీలులేక, తానే అదృష్టదీపుణ్నని ఒప్పుకోలేక హరిదత్తుడు సతమతం అవుతున్నాడు.
అలాంటి సమయంలో అదృష్టదీపుడు అక్కడికి వెళ్లాడు. తమ దగ్గరున్నవాడే అసలు అదృష్టదీపుడని, ఇప్పుడు వచ్చినవాడెవడో నకిలీ అని మహారాజు అనుమానించాడు. అప్పుడు కాంతిమతికి, తనకు మాత్రమే తెలిసిన ప్రణయ రహస్యాలను చతురిక ద్వారా వెల్లడి చేసి, తన ఉనికిని నిరూపించుకున్నాడు అదృష్టదీపుడు. హరిదత్తుడు తన అన్నకు, వదినకు నమస్కరించాడు. కొడుక్కు బారసాల జరిపించిన తరువాత, అదృష్టదీపుడు తమ్మునితోపాటు పుష్పగిరికి పయనమయ్యాడు.
అక్కడ ఆ అన్నదమ్ములు తమ తల్లిని, హరిదత్తుని పెంపుడు తండ్రినీ కలుసుకున్నారు.
అసలు సమస్య ప్రియంవదతో వచ్చింది. ఔషధీలతను పట్టుకుని, తనను దర్శించినవాడే ప్రియంవదకు భర్త కాగలడని భువనేశ్వరి ఆలయంలోని శాసనం చెబుతున్నది. ప్రియంవద భక్తికి మెచ్చిన సిద్ధుడు ఒకడు.. భువనేశ్వరి ఆలయాన్ని ఆమెకు చూపించి, ఆమె జన్మరహస్యాన్ని చెప్పాడు. తనకు తప్ప మరెవ్వరికీ కనిపించని ఆ ఆలయాన్ని ప్రతీ శుక్రవారం తానొక్కతే ఇంతకాలం దర్శిస్తూ వచ్చింది. అదృష్టదీపుడు ఆ ఆలయాన్ని దర్శించాడు కనుక, అతణ్నే వివాహం చేసుకుంటానని ప్రియంవద వాదించింది. తన తమ్ముడికోసం వాగ్దానం చేసిన స్త్రీని, తానెలా పెళ్లి చేసుకోగలనని అదృష్టదీపుడు గట్టిగా ప్రశ్నించాడు.
తాను ప్రియంవదను కోరుకోలేదని, కేవలం చనిపోయేందుకే ఆమె ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఒప్పుకొన్నానని, కనుక ఆమెను కూడా అన్నగారే వివాహం చేసుకున్నా.. తనకు అభ్యంతరం లేదని హరిదత్తుడు చెప్పాడు. కానీ, అదృష్టదీపుడు అంగీకరించలేదు.
తన మాట ఆరునూరైనా నెగ్గి తీరాల్సిందేనన్నాడు.
“ఔషధీలత నాకు దొరికింది. కానీ, ఆ తరువాత చేజారిపోయింది కదా! ఈసారి దాన్ని నా తమ్ముని కోసం సంపాదిస్తాను. దాంతో పాటుగా ఆ నవనిధులూ నా తమ్ముని పరం చేస్తాను. అప్పుడు అతణ్ని వివాహం చేసుకోవడానికి నీకు అభ్యంతరం లేదు కదా?!” అని ప్రియంవదను ప్రశ్నించాడు.
“దేవీ శాసనాన్ని భంగపరచకుండా ఉండేట్లయితే నేను అంగీకరిస్తాను” అని సమాధానం ఇచ్చింది
ప్రియంవద. “సరే!” అన్నాడు అదృష్టదీపుడు.
శుక్రవారం ప్రియంవద దేవీ దర్శనానికి బయల్దేరింది. ఆమె చేతికి కొన్ని మందారపూలు ఇచ్చాడు అదృష్టదీపుడు. తాను ఔషధీలతను పోగొట్టుకున్న చోటు గురించి కొన్ని గుర్తులు ఆమెకు చెప్పాడు. “ఈ మందార పూలను అక్కడ చల్లిరా” అని కోరాడు.
కేళీశైలంపైన ఆమె ఆలయ ప్రవేశం చేస్తున్నప్పుడు ఎప్పటిలాగే.. ఆ ఆలయం, దానిలోకి ప్రవేశిస్తున్న ప్రియంవద ఇద్దరూ కనిపించలేదు. ఆమె పూజ పూర్తి చేసుకుని బయటికి వచ్చింది.
ఆ తరువాత ఆమె నడిచివచ్చిన దారిలో అదృష్టదీపుడు కొండపైకి వెళ్లాడు. అక్కడ దేవికి సమర్పించిన పూజాద్రవ్యాలేమీ కనిపించలేదు. కానీ, దేవికి సమీపంలో తాను గుర్తులు చూపెట్టిన చోట.. ప్రియంవద చల్లిన మందారపూలు మాత్రం యధాతథంగా కనిపించాయి. హరిదత్తుణ్ని తీసుకువచ్చి, ఆ పువ్వులున్న చోట ఏ లతలు కనిపిస్తున్నా.. వాటిని చేత్తో పట్టుకోమని చెప్పాడు. హరిదత్తుడు అలాగే చేశాడు. అసలు లత దొరికిన వెంటనే.. హరిదత్తునికి దేవీ ఆలయం దర్శనమిచ్చింది. అదృష్టదీపుడు తన తమ్ముని చేత భువనేశ్వరి దేవికి అర్చన చేయించాడు. అతనిచేత దేవీ శాసనాన్ని చదివింప చేశాడు. నవనిధులనూ బళ్లకు ఎత్తించి, పట్టణంలోకి తీసుకువెళ్లాడు. ఆ తరువాత దేవీ ఆలయం అందరికీ దర్శనీయం అయ్యింది. ఔషధి సాయం లేకపోయినా ఎవరైనా గుడికి వచ్చే వీలు కలిగింది. తొందరలోనే ప్రియంవదకు, హరిదత్తునికి వివాహం జరిపించడానికి రాజవాహనుడు అంగీకరించాడు.
“అంతకు ముందుగానే నేను మా తండ్రిని రక్షించాల్సి ఉంది. మా తల్లిదండ్రులిద్దరి సమక్షంలోనే మా సోదరుని వివాహం జరుగుతుంది” అన్నాడు అదృష్టదీపుడు.
విహారభద్రుణ్ని, దుర్వినీతుణ్ని తన ప్రతినిధులుగా కౌశాంబిలో ఉంచి.. చోళరాజే మాళవరాజ్యాన్ని కూడా పాలిస్తున్నాడు. అదృష్టదీపుడు ముందుగా సేనలను సమీకరించుకుని చోళరాజ్యంపైకి దండెత్తాడు.
ఉన్నట్లుండి అదృష్టదీపుడు తనపై దండెత్తి రావడానికి కారణమేమిటో తెలియక చోళరాజు కంగారు పడిపోయాడు. సంధికోరుతూ రాయబారం నడిపాడు. సామంతునిగా కప్పం చెల్లించడానికి చోళరాజు అంగీకరించాడు. అక్కడినుంచి నేరుగా కౌశాంబికి వెళ్లి శత్రువులను బంధించి, తండ్రిని చెరసాల నుంచి విడిపించాడు
అదృష్టదీపుడు. తల్లిదండ్రుల సమక్షంలో సోదరునికి వివాహం జరిపించాడు. అదృష్టదీపునికి పట్టాభిషేకం జరిగింది. ప్రజలను కన్నబిడ్డల్లా పాలిస్తూ గొప్ప సామ్రాట్టుగా తనకు ఉన్న పేరును ఆ తరువాత కూడా పదిలంగా కాపాడుకున్నాడు అదృష్టదీపుడు.
(వచ్చేవారం.. అనంగ చంద్రిక)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | అదృష్టదీపుడు – 2
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | అదృష్టదీపుడు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | పాటపాడే చెట్టు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | స్వర్గంలో మానవుడు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | ఎగిరే చెట్లు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) |కాశీ మజిలీ కథలు : దొంగల తప్పిదం
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) |రహస్య స్నేహితుడు