Kasi Majili Kathalu Episode 24 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : రాజ్యం పోగొట్టుకున్న విశాలాక్షి భర్త తప్పిపోయాడు. అతణ్ని వెతుక్కుంటూ వెళ్లిన ఇంద్రద్యుమ్న మహారాజు మలయాళదేశంలో శక్తి ఆరాధకులకు బందీగా చిక్కాడు. అక్కడ అతనికి విశాలాక్షి భర్త మదనుడు కలిశాడు. మలయాళ దేశ మహారాజు సింహకేతుడి సాయంతో బయటపడ్డారు. అప్పుడే విశాలాక్షినీ కలుసుకున్నారు. తనకు కలలో లభించిన వస్తువుల గురించి చెప్పసాగింది విశాలాక్షి.
“దివ్యవనంలోని ఆ అద్భుత ఫలం, పుష్పం నాకు లభించిన వేళావిశేషమేమిటో కానీ, నా మనసులో చింతలన్నీ తెలియకుండానే మటుమాయం అయ్యాయి. మునుపటికన్నా ఉల్లాసంగా మారాను. గుర్రమెక్కి పశ్చిమాభిముఖంగా ప్రయాణించాను. ఆ సాయంకాలానికి ఓ అగ్రహారం పొలిమేరల్లోకి చేరుకున్నాను. అక్కడ ఓ ఇరవై ఏళ్ల బ్రాహ్మణ యువకుడు చెట్టుకొమ్మకు ఉరి వేసుకోబోతున్నాడు. నా గుర్రాన్ని వేగంగా అతని వైపు పోనిచ్చాను. ఆ ప్రయత్నాన్ని విరమింప చేశాను.
ఆ యువకుడు.. తన పేరు భీమశర్మ అని చెప్పాడు. అన్న, వదినలు పెట్టే కష్టాలకు తట్టుకోలేక, బతికేందుకు మరోదారి కనిపించక చావుకు తెగించానని చెప్పాడు.
అప్పుడు నేను..
“మిత్రమా! ఈ పండు మహిమ కలిగినది. దీన్ని తిన్నవారికి ఆకలి దప్పికలుండవు. మీ దేశపురాజుకు దీన్ని సమర్పించు. తగిన బహుమానం ఇవ్వగలడు. దాంతో నీ పేదరికం వదిలిపోతుంది” అని ఆ పండును అతడికిచ్చి, అక్కడినుంచి వెళ్లిపోయాను.
ఆ తరువాత నేను మగవాడిగా వేషం మార్చుకున్నాను. ఆ రాత్రికి అగ్రహారంలో బసచేశాను. ఉదయాన్నే లేచి మరో తోవలో ముందుకు సాగాను. రెండురోజుల ప్రయాణం తరువాత ఒక అడవికి చేరుకొని.. చెట్టు నీడలో విశ్రమించాను.
ఆ సమయంలో ఒక ముసలి బ్రాహ్మణుడు తన పదిమంది పిల్లలతో అక్కడికి వచ్చాడు. నాతో మాట కలిపాడు. అతడి మాటల్లో.. తన పేరు కృష్ణశర్మ అని, వారిది విదర్భ దేశమని తెలిసింది. ఆ దేశంలో వానలు పడక కరువు పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాడు. బిచ్చమెత్తుకున్నా కుటుంబాన్ని పోషించుకోడానికి తగినంత ధనం లభించడం లేదని వాపోయాడు. తన భార్య కానుపు కష్టమై కొంతకాలం కిందట చనిపోయిందని విచారంగా చెప్పాడు. రెండు రోజులనుంచి పిల్లలు కూడా తిండిలేక బాధపడుతున్నారని వివరించాడు.
అతని జీవితం బాగుచేయడం కంటే పుణ్యం లేదనిపించింది. నా దగ్గర మిగిలిన అద్భుత పుష్పాన్ని అతడి చేతిలో పెట్టాను.
“ఇది పారిజాతం వంటిది. దీని పరిమళం యోజనదూరం వరకూ వ్యాపిస్తుంది. ఎన్నిరోజులైనా వాడిపోదు. భూలోకంలో దొరికేది కాదు. దీనిని తీసుకుపోయి, నీ కుటుంబాన్ని ఎల్లకాలం పోషించేవారికి మాత్రమే ఇచ్చుకో” అని చెప్పాను. ఆ తరువాత ఉత్తరానికి మరలిపోయాను.
* * *
అటువైపు అరణ్యమే కానీ, గ్రామాలు లేవు. ఎక్కడికి పోవాలో తెలిసింది కాదు. ఆ రాత్రి నివసించడానికి తగిన స్థలం కోసం వెతుకుతూ ఉండగా పశువుల అరుపులు వినిపించాయి. సమీపంలో ఒక కోయపల్లె దర్శనమిచ్చింది. నా గుర్రాన్ని ఒక చెట్టుకు కట్టివేసి నేను పల్లెలోకి ప్రవేశించాను. చావడిలో దీపంపెట్టి అడవి ప్రజలంతా వింతైన వాయిద్యాలు వాయిస్తూ నృత్యం చేస్తున్నారు. తప్పతాగుతున్నారు. వారిని చూడటంతోనే నా గుండెలు అవిసిపోయాయి. వారికి కనిపించకుండా దూరంగా ఉన్న ఒక గుడిసె తిన్నెమీద కూర్చున్నాను.
కొంతసేపటికి ఒక మహిళ తన గుడిసెకు వచ్చింది. అరుగుమీద కూర్చున్న నన్ను చూసి ‘ఎవరు మీరు?’ అని కోయభాషలో అడిగింది. నాకు ఆ భాష రాకపోవడం వల్ల తెలుగులోనే..
“అవ్వా! నేను పరదేశిని. దారితప్పి ఇలా వచ్చాను. ఈ రాత్రికి నిద్రపోయి, పొద్దున్నే వెళ్లిపోతాను” అని చెప్పాను. ఆ కోయవనిత నా మాటలను అర్థం చేసుకోలేకపోయింది.
“అమ్మయ్యో! మా అరుగుమీదికి కొండదేవత వచ్చిందిరో!” అని పెద్దపెట్టున అరుస్తూ చావడి వద్దకు వచ్చింది.
ఏం జరుగుతున్నదో తెలుసుకునేలోపు కోయవాళ్లందరూ నెత్తిమీద గండదీపాలు పెట్టుకుని, వాద్యాలు మోగిస్తూ నా దగ్గరికి వచ్చారు. నా పైప్రాణాలు పైనే పోయాయి. ఆటపాటల మధ్య నన్ను చావడి వద్దకు తీసుకుపోయి, గద్దెమీద కూర్చోపెట్టారు.
నాకు అనేక నైవేద్యాలు పెట్టి సంతోషపెట్టారు. పొద్దుపోయేవరకూ నాముందు ఆడిపాడారు. వాళ్లను ఎలా తప్పించుకోవాలో తెలిసింది కాదు. చివరికి బాగా ఆలోచించి, గద్దెమీదనే మేను వాల్చి నిద్ర నటించసాగాను. కోయ ప్రజలందరూ ఆటపాటలు కట్టిపెట్టి అక్కడే నిద్రలకు ఉపక్రమించారు. కొద్దిసేపటికి నాకు దగ్గరలో కూర్చుని ఉన్న ఇద్దరు ఆడవాళ్లు నా గురించి మాట్లాడుకోసాగారు.
“అమ్మవారి ఒళ్లు చూశావా? బంగారంలా మెరిసిపోతున్నది. ఎంతగొప్ప చీరకట్టింది?!” అన్నది ఒకామె.
అందుకు రెండో ఆమె..
“అవును. జడచూశావా ఎంత పొడవుగా ఉన్నదో!? కిందటేడాది అమ్మవారు పులిరూపంలో వచ్చింది. ఈసారి మనమీద దయతో ఇంతమంచి రూపంలో వచ్చినట్లుంది” అన్నది.
“నిజమే! కిందటేడాది తెల్లవారకుండానే మనల్ని విడిచిపెట్టిపోయింది. ఈసారి మనమీద జాలి తలచి రెండురోజులైనా మన గూడెంలో ఉండిపోతే ఎంత బాగుణ్ను” అన్నది మొదటి స్త్రీ.
వారిమాటలను బట్టి తెల్లవారకముందే నేను వెళ్లిపోవడానికి ఆటంకమేమీ ఉండదని అర్థం చేసుకున్నాను. వేగుచుక్క పొడిచే సమయానికి నిద్రలేచి, నా గుర్రాన్ని చేరుకున్నాను. ఎవ్వరూ నన్ను నిర్బంధించలేదు. వారికి శక్తి ఉన్నంతమేరకు నా గుర్రం వెనుక పరుగెత్తారు. చివరికి ఆగిపోయారు. నేను అడవిదారుల్లో అనేక కష్టాలు పడుతూ చాలారోజుల ప్రయాణం తరువాత కోటప్పకొండ క్షేత్రానికి చేరుకున్నాను. స్నానం చేసి, స్వామిని దర్శించడానికి వెళ్లాను. ఆనాడు శివరాత్రి కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఆవేళ నా కలలో అద్భుతంగా వీణ వాయించిన వీణావతి కనిపించింది.
నేను ఆశ్చర్యపోతూ ఆమెను సమీపించాను. నా అవస్థను గమనించినట్లుగా..
“అమ్మా! ఆనాడు నీవు తోటనుంచి ఒక పువ్వు, పండు తెచ్చుకున్నావు. వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకున్నావా?” అని ప్రశ్నించిందామె.
“లేదమ్మా! నేను వాటిని ఇద్దరు నిరుపేద బ్రాహ్మణులకు దానం చేశాను” అని చెప్పాను.
అప్పుడామె ముక్కుమీద వేలేసుకుని.. “ఎంత పనిచేశావు?! అమ్మవారు నీకోసం ఇచ్చిన వాటిని నీవు దానం చేయవచ్చా? సరే.. నీయందు దైవకృప ఉంటే నీ వస్తువులు నీకు మళ్లీ దక్కగలవు. నేను స్వామిని దర్శించుకుని వస్తాను” అంటూ గుళ్లోకి వెళ్లిన వీణావతి ఎంతసేపటికీ తిరిగిరాలేదు.
చూస్తుండగానే తెల్లవారిపోయింది. ఆమె జాడ తెలియలేదు. సరే, పరోక్షంగా కూడా దేవి నన్ను కాపాడుతున్నదని సంతోషించి అక్కడినుంచి కదిలాను.
* * *
ఆ మరునాటి సాయంత్రానికి నేను ధర్మాంగద మహారాజు ఏలుబడిలోని ధర్మపురికి చేరుకున్నాను. అక్కడో పెద్దసభ జరుగుతుంటే.. పురుషవేషం ధరించి, పౌరులందరితోపాటు నేను కూడా వెళ్లాను.
ఆ సభామంటపంలో.. అద్భుత ఫలాన్ని, పుష్పాన్ని వేలాడగట్టారు. ధర్మాంగద మహారాజు ఆ రెండిటి మహాత్మ్యాన్ని గురించి చెప్పాడు. అదే వేదిక మీదున్న మలయాళదేశపు మహారాజు చండవర్మను ప్రజలకు పరిచయం చేశాడు. ఆ అద్భుతపుష్పం వృద్ధ బ్రాహ్మణుని వల్ల మలయాళ రాజుకు చేరింది. ఆ వైనాన్ని ఆయన ఆ వృద్ధుని చేతనే ఇలా చెప్పించాడు.
“నా పేదరికాన్ని చూసి ఓ ఆగంతకుడు నాకీ పుష్పాన్నిచ్చాడు. నన్ను జీవితాంతం పోషించగలిగిన వారికే దీన్ని ఇమ్మని చెప్పాడు. కానీ, చూశారు కదా.. ఆ పువ్వు పరిమళం దాస్తే దాచేది కాదు. దారిలో ఎదురుపడ్డ ఇద్దరు యువకులు ఆ పువ్వు గురించి ఆరా తీశారు. తామిద్దరూ కలిసి, మా కుటుంబాన్ని పోషిస్తామని మాటిచ్చారు. కొంతకాలం మాకు బాగానే సాగింది. నా దురదృష్టమో మరొకటో తెలియదు కానీ, ఒకరోజున.. వాళ్లిద్దరూ ఉమ్మడిగా ఉంచుకున్న ఒకానొక సానికోసం తగువులాడుకుని.. ఒకరినొకరు పొడుచుకుని చచ్చారు. ఆ వేశ్యమాత నా పువ్వు నాకివ్వలేదు. నేను మహారాజుగారికి ఫిర్యాదు చేయగా, వారే ఈ పువ్వును స్వాధీనం చేసుకున్నారు” అని చెప్పాడతను.
ఆ తరువాత, అద్భుతఫలం కథను భీమశర్మ చెప్పాడు.
“ఈ పండును నాకు ఒక దివ్యస్త్రీ ఇచ్చింది. రాజుగారికి ఇచ్చి బహుమానం పొందమని సెలవిచ్చింది. నేను రాజుగారి వద్దకు వెళుతుంటే దారిమధ్యలో కుబేరదత్తుడనే వ్యాపారి అద్భుతఫలాన్ని చూశాడు. లక్ష వరహాలకు బేరంచేశాడు. మహారాజులైనా అంతకంటే ఇవ్వలేరని అనుకుని, నేనతనికే ఇచ్చాను. కుబేరదత్తుడు పండు తీసుకున్నాడు కానీ, రొక్కమివ్వలేదు. ‘రేపు రా..
మాపు రా!’ అంటూ నన్ను నెలనాళ్లు తిప్పుకొన్నాడు. చివరికి ఒకరోజున నా చేతిలో పది వరహాలు పెట్టి పొమ్మన్నాడు. నేనా డబ్బు తిరస్కరించి, నా పండు నాకు తిరిగిఇచ్చేయమని ఎదురు తిరిగాను. అప్పుడు కుబేరదత్తుడు.. ‘అయ్యవారూ! ఆ పండు నేను తినేశానయ్యా!! చాలా చేదుగా ఉంది. దానికింతకంటే డబ్బక్కర్లేదు’ అన్నాడు. మరునాడే నేను గ్రామాధికారులకు ఫిర్యాదు చేశాను. అధికారులు వాని ఇల్లు సోదా చేయించారు. కానీ, అంతకుముందు రోజు రాత్రే దొంగలు పడి అతని సొత్తంతా దోచుకుపోయినట్లు తేలింది. ఇల్లు దోచుకున్న దొంగలు దొరికిన బంగారాన్నంతా నిపుణికుడనే వ్యక్తికి అమ్మేశారు. వాడికి పెట్టెల్లో అద్భుతఫలం దొరికింది. ఆ ఫలాన్ని అతను తారావళి అనే వేశ్యకిచ్చాడు. తారావళి ఆ పండును అంగడిలో అమ్మబోతుంటే.. రాజభటులు నిర్బంధించారు. అలా ఈ అద్భుతఫలం చివరికి ధర్మాంగద మహారాజుగారికి చేరింది” అని వివరించాడు.
అప్పుడు మలయాళదేశపు రాజైన చండవర్మ నిలబడి.. “ఈ పండును, పువ్వును ఒకే పురుషుడు వీళ్లిద్దరికీ ఇచ్చి ఉండాలి. కానీ వీరిలో ఒకరు తమకా వస్తువులను ఇచ్చింది స్త్రీ అని, వేరొకరు పురుషుడని చెబుతున్నారు. ఇంతకూ వారెవరో తెలిస్తే బాగుంటుంది” అన్నాడు.
నేను కూడా తొందరపడి ఆ వస్తువులు నావేనని చెప్పదలుచుకోలేదు. చాలాసేపు సభలోని వక్తలంతా తలోరకంగా మాట్లాడారు. చివరగా సభను రంజింప చేయడం కోసం మణిమంజరి అనే వీణా విద్వాంసురాలు కొద్దిసేపు కచేరీ చేసింది. కచేరీ ముగింపులో ఉండగా నేను బయటికి వచ్చి.. “మహారాజా! నాపేరు సింహకేతుడు. నాకు కూడా వీణావాదనంలో ప్రవేశముంది. మీరు అనుమతిస్తే కొద్దిసేపు నా విద్యను ప్రదర్శించి, మిమ్మల్ని ఆనందింపచేస్తాను” అన్నాను.
ధర్మాంగద మహారాజు అంగీకార సూచకంగా తల పంకించాడు. కలలో వినిపించిన దివ్యనాదాన్ని అనుసరించి నేను కొంతసేపు వీణపై కొన్ని రాగాలను పలికించాను. సభంతా సమ్మోహనమైంది. మహారాజులిద్దరూ ఎంతగా ఆనందించారో.. సంతృప్తినిండిన వారి కన్నులే చెబుతున్నాయి.
చివరికి ధర్మాంగదుడు నన్ను చేరి..
“రాజకుమారా! నీవు అతిమానుష ప్రభావం కలవాడవు. నీ సంగీతం ముల్లోకాలనూ పరవశింప చేయగలదు. నీకు పారితోషికంగా ఇవ్వదగిన వస్తువులు మా వద్ద ఏమీలేవు. ఈ అద్భుత ఫలాన్ని, పుష్పాన్ని గ్రహించు. నీ విద్యలకు ఈ రెండూ.. బంగారానికి తావి అబ్బినట్లుగా ఉంటాయి” అంటూ వాటిని నాకు బహుమానంగా ఇచ్చాడు.
అప్పుడు నేను ఆ పండు, పువ్వు నిజంగా నావేనని రాజుకు చెప్పాను. ధర్మాంగదుడు సంతోషించాడు. చండవర్మ మహారాజు తనతోపాటు తన రాజ్యానికి రమ్మని, కొంతకాలం తమను వినోదింప చేయమని కోరాడు.
ఆయన వెంట ఈ మలయాళ దేశానికి వచ్చాను. చండవర్మ పుత్రిక అయిన వసంత లతిక నా గానం విని పరవశించింది. నన్ను వరించింది. చండవర్మ సైతం అంగీకరించి, తన పుత్రికను నాకిచ్చి పాణిగ్రహణం జరిపించాడు. స్త్రీనైన నేను, మరో స్త్రీని ఎందుకు పెళ్లి చేసుకున్నానో అప్పటికి నాకే తెలియదు. మా పెళ్లి జరిగిన తొలిరాత్రినాడు వసంతలతికతో.. ‘వివాహమైన ఏడాదిలోపుగా నేను భార్యాసంగమం చేస్తే మరణిస్తానని ఒక రుషి శాపం పెట్టాడు’ అని చెప్పాను. పాపం ఆమె నా మాటలు నిజమేనని నమ్మింది. ఇప్పుడు ఆ ఏడాది గడువు తీరిపోయింది. దైవవశాత్తూ మీ అందరినీ కలుసుకోగలిగాను”.. అని విశాలాక్షి తన కథను పూర్తిచేసింది.
(వచ్చేవారం.. జగన్నాథ స్వామి)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu Episode 23 ( కాశీ మజిలీ కథలు ) | విశాలాక్షి కల”
Kasi Majili Kathalu Episode 22 | మలయాళ దేశం
Kasi Majili Kathalu Episode 20 ( కాశీ మజిలీ కథలు ) | చేప ఊరికే నవ్వదు – 2
Kasi Majili Kathalu Episode 19 ( కాశీ మజిలీ కథలు ) | చేప ఊరికే నవ్వదు
Kasi Majili Kathalu Episode 17 ( కాశీ మజిలీ కథలు ) | చిత్రసేన
Kasi Majili Kathalu Episode 16 ( కాశీ మజిలీ కథలు ) | శరభసాళువం
Kasi Majili Kathalu Episode 15 ( కాశీ మజిలీ కథలు ) | దైవమిచ్చిన భార్య