Wrestlers Vs WFI | రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, ఒలింపియన్ రెజ్లర్ల (Wrestlers) మధ్య వివాదం మరోసారి వేడెక్కింది. బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకోవాలంటూ రెజర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మరోసారి ఆదివారం నిరసన చేపట్టారు. ఒలింపిక్ పతక విజేత రెజ్లర్లు బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్ రెండోసారి నిరసనకు దిగారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI)పై విచారణ కమిటీ నివేదిక వచ్చే వరకు తమ నిరసనను కొనసాగిస్తామని ఈ రెజ్లర్లు స్పష్టం చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్ శక్తివంతమైందని, దాంతో న్యాయం జరుగడం లేదని ఆరోపించారు.
మూడు నెలలు గడుస్తున్నా క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి మాకు ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు. బ్రిజ్ భూషణ్ సింగ్పై లైంగిక వేధింపులకు సంబంధించి మైనర్తో సహా ఏడుగురు బాలికలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని రెజ్లర్లు ఆరోపించారు. వెంటనే పోక్సో చట్టం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. దాదాపు రెండున్నర నెలలుగా ఎదురు చూస్తున్నామని, మూడు నెలల సమయం గడిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెజ్లర్ సాక్షి మాలిక్ మాట్లాడుతూ రెండున్నర నెలలుగా ఎదురుచూస్తున్నామని, నివేదిక సమర్పించారో లేదో తెలియడం లేదని పేర్కొంది. ఇప్పటి వరకు తకు ఎలాంటి నివేదిక అందలేదని, ఇప్పుడు నివేదిక అందరి ముందుకు రావాలని స్పష్టం చేసింది. అందరూ తమను అబద్ధాలు చెబుతున్నామని అంటున్నారని కన్నీటి పర్యంతమైంది.
#WATCH | "We have been going through mental torture, it's about the respect of women athletes…We aren't receiving any response from Sports Ministry, it's been 3 months": Wrestlers protest against then WFI chief and BJP strongman Brijbhushan Singh pic.twitter.com/44qfs8APbs
— ANI (@ANI) April 23, 2023
దీన్ని తాము సహించలేమని, తమ ఫిర్యాదు తప్పు కాదని చెప్పింది. తాము సత్యయుద్ధంలో పోరాడుతున్నామని, ఖచ్చితంగా గెలుస్తామని చెప్పింది. మా డిమాండ్లు ప్రధాని వినాలని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశేష్ పొగట్, భజరంగ్ పూనియా స్పందిస్తూ ఇటీవల తాము పతకాలు సాధించామని, అబద్ధమే అయితే మళ్లీ తాము ఇక్కడికి ఎందుకు వస్తామని ప్రశ్నించారు. తాము ఫిర్యాదు చేసినా ఆ సమయంలో ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదని చెబుతున్నారని, ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఒలింపిక్స్లో పతకాలు తెస్తాం కానీ, మా మాట ఎవరూ వినడం లేదని, తమకే ఇలా జరిగితే సామాన్య ఆడపిల్లల పరిస్థితి ఏంటని వినేశ్ పొగట్ నిలదీసింది.
తాము పోరాటం చేస్తున్నది పలుకుబడి, రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తిపై అని పేర్కొంది. రెండు నెలలుగా చర్యల కోసం ఎదురుచూస్తున్నామని, ఇప్పటి వరకు న్యాయం జరుగకపోవడంతో మళ్లీ మరోసారి నిరసన తెలుపుతున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. ఢిల్లీ మహిళా కమిషన్ (DCW) నిరసనకు మద్దతు తెలిపినందుకు రెజర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా.. బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులపై జనవరిలోనూ క్రీడాకారులు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. రెజ్లింగ్ ఫెడరేషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
#WATCH |Seven girls including a minor gave a complaint at CP PS against Brijbhushan Singh regarding sexual harassment but yet to be filed.There must be POCSO case. We've been waiting for 2.5 months…:Wrestlers protest against then WFI chief & BJP strongman Brij Bhushan Singh pic.twitter.com/SvAvSk9hNz
— ANI (@ANI) April 23, 2023
ఈ వ్యవహారంపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, ఇతర కోచ్లపై వచ్చిన ఆరోపణలను పరిశీలించడానికి క్రీడా మంత్రిత్వ శాఖ ‘ఇన్స్పెక్షన్ కమిటీ’ ఏర్పాటు చేసింది. ఈ అంశంపై నివేదికను మంత్రిత్వ శాఖకు సమర్పించే బాధ్యతను కమిటీకి అప్పగించారు. ఒలింపిక్ పతక విజేత మేరీకోమ్ పర్యవేక్షణ కమిటీకి నేతృత్వం వహిస్తున్నది. మాజీ రెజ్లర్ యోగేశ్వర్ దత్, మాజీ షట్లర్ తృప్తి ముర్గుండే, సాయ్ సభ్యురాలు రాధిక శ్రీమాన్, టార్గెట్ ఒలింపిక్ పోడియం ప్లాన్ మాజీ సీఈవో రాజేశ్ రాజగ్, ఒపాలన్, కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత బబిత పొగట్ సభ్యులుగా ఉన్నారు.