కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్ వశం చేసుకోవడంతో ఆఫ్ఘాన్లో ప్రజల ప్రశాంత జీవనం ప్రశ్నార్థకంగా మారింది. మహిళలు బయటకు రాకుండా నిషేధాజ్ఞలు విధించారు. గతంలో తమకు వ్యతిరేకంగా వార్తలు రాసిన జర్నలిస్టులను టార్గెట్ చేస్తున్నారు. తమను ధిక్కరించేవారిపై తుపాకులతో విరుచుకుపడుతున్నారు. వినోదానికి సంబంధించిన అంశాలపై దృష్టి సారిస్తుండటంతో.. ఇప్పుడు ఆఫ్ఘాన్లో క్రికెట్ భవితవ్యం (Afghanistan Cricket) ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నో ఇబ్బందులు పడి మౌలిక సదుపాయాలు లేకపోయినా ఎందరో మెరికల్లాంటి క్రికెటర్లుగా తయారయ్యారు. వీరంతా ఇప్పుడు వన్డే వరల్డ్ కప్, ఐపీఎల్ పోటీలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
పాకిస్తాన్లో పుట్టి భారతదేశంలో అభివృద్ధికి నోచుకున్న ఆఫ్ఘానిస్తాన్ క్రికెట్.. తాలిబాన్ రాకతో ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో పడిపోయింది. గతంలో ఐపీఎల్లో తామేంటో ప్రపంచానికి చాటిని రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ, ముజీబ్ ఉర రహ్మాన్ వంటి ఆటగాళ్లు ఇక క్రికెట్కు దూరంగా ఉండాల్సిందేనా..? వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఐపీఎల్ రెండో సీజన్లో ఆఫ్ఘాన్ నుంచి వీరు పాల్గొనే అవకాశం ఉన్నదా..? అక్టోబర్లో నిర్వహించనున్న టీ20 ప్రపంచ కప్లో ఆఫ్ఘాన్ జట్టు పాల్గొంటుందా..? వంటి అనేక ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. ఆఫ్ఘాన్ను తమ గుప్పిట్లోకి తీసుకోవడానికి రెండు, మూడు రోజుల ముందు వరకు కూడా ఆఫ్ఘాన్ క్రికెటర్లు ఇదేమీ పట్టించుకోకుండా అక్టోబర్లో జరిగే టీ20 వరల్డ్ కప్ కోసం సాధన చేశారు. ప్రస్తుతం సీనియర్ ఆటగాళ్లు రషీద్ ఖాన్, మహమ్మద్ నబీతోపాటు మరో నలుగురు క్రికెటర్లు బ్రిటన్లో ఉన్నారు.
గతంలో ఆఫ్ఘాన్ను తమ గుప్పిట్లోకి తీసుకున్న కాలం 1996-2001 మధ్య క్రీడలను తాలిబాన్ నిషేధించింది. ఆ సమయంలో కనీసం చిన్నారులు పతంగులు కూడా ఎగురవేయనిచ్చేవారు కాదు. కాగా, ఇప్పటివరకు 2008, 2012 ఒలింపిక్స్లో మాత్రమే కాంస్య పతకాలు గెలుచుకున్న ఆఫ్ఘనిస్తాన్లో ఆటలు ప్రాంతాలు, వర్గాల ఆధారంగా అభివృద్ధి చెందాయి. తాజిక్లు ఫుట్బాల్ను ఇష్టపడగా, పస్టూన్స్ క్రికెట్ను అభిమానించారు. ఉద్యమకారులైన పాస్తోలు తాలిబాన్లో ప్రముఖంగా ఉండటంతో.. క్రికెటర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో పలువురు క్రికెటర్లు కాబూల్లో ప్రాక్టీస్ చేసుకున్నారు.
పస్టూన్లు ఎక్కువగా పాకిస్తాన్ సరిహద్దులో నివసించడంతో వారిపై క్రికెట్ ప్రభావం ఎక్కువగా ఉన్నది. 1980 లో పస్టూన్ శరణార్ధులు పొరుగునే ఉన్న పాకిస్తాన్లో క్రికెట్ ఆడటం మొదలెట్టారు. 1995 లో పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డును ఏర్పాటుచేశారు. 2001 లో ఆఫ్ఘానిస్తాన్ను క్రికెట్ ఆడే దేశంగా ఐసీసీ గుర్తించింది. 2014 లో ఆప్ఘాన్ జట్టు తొలిసారిగా టీ20 వరల్డ్ కప్లో పాల్గొన్నది. 2015 లో తొలిసారిగా వన్డే వరల్డ్ కప్ పోటీల్లో పాల్గొనేందుకు ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు అవకాశం కల్పించారు. అనంతరం 2017 లో ఆఫ్ఘనిస్తాన్ను టెస్ట్ జట్టుగా గుర్తించడంతోపాటు పూర్తికాలం సభ్యుడిగా ఐసీసీ గుర్తింపునిచ్చింది.
ఈ నెలాఖరులో ఆఫ్ఘాన్ క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటించాల్సి ఉన్నది. అలాగే, సెప్టెంబర్లో పాకిస్తాన్తో మూడు మ్యాచుల వన్డే సిరీస్ను ఆడాల్సి ఉన్నది. అదేవిధంగా అక్టోబర్లో నిర్వహిస్తున్న టీ20 వరల్డ్ కప్లో కూడా పాల్గొనాల్సి ఉన్నది. ఈ పోటీల్లో భారతదేశం, పాకిస్తాన్తో కలిసి గ్రూప్ 2 లో ఆఫ్ఘనిస్తాన్ ఉన్నది. వీటి కోసం జట్టు కాబూల్లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. అయితే, ఆఫ్ఘాన్లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలు నడవకపోవడంతో ఆఫ్ఘాన్ క్రికెటర్లు శ్రీలంకకు పోవడం ప్రశ్నార్థకంగానే తయారైంది. శ్రీలంకతోపాటు పాకిస్తాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్తో ఆడే సిరీస్లను వాయిదా వేసుకుంటాయనే చర్చ కూడా కొనసాగుతున్నది.
మంటలతో విన్యాసాలు.. కరాటే కోచ్ మృతి
ఆస్ట్రేలియాలో లాక్డౌన్ పొడగింపు
యోగిపై పోటీకి సిద్ధమైన ఐపీఎస్కు గృహనిర్బంధం
110 ఏండ్ల క్రితం మోనాలిసా పెయింటింగ్ దొంగతనం
తోటగా మారిన క్రికెట్ స్టేడియం.. ఎక్కడంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..