Bandla Ganesh | సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన కుమార్తె జనని త్వరలో వివాహ బంధంలో అడుగుపెట్టనుంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్య తేజతో జనని వివాహం ఆగస్టు 16న హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఉదయం 11:58 గంటలకు శుభ ముహూర్తంలో జరగనుంది. ఇప్పటికే నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించిన బండ్ల గణేష్ ప్రస్తుతం సినీ, రాజకీయ ప్రముఖులను స్వయంగా ఆహ్వానిస్తూ వివాహ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. అయితే ఈ పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాధారణంగా సెలబ్రిటీల పెళ్లి పత్రికలు చర్చకు వస్తుంటాయి. కానీ బండ్ల గణేష్ కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికలో ఉన్న ఒక ప్రత్యేక అంశం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
పెళ్లి ఏర్పాట్లలో భాగంగా తొలి వివాహ ఆహ్వాన పత్రికను తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాల వద్ద సమర్పించి కుటుంబ సభ్యులు ఆశీస్సులు పొందారు. అనంతరం రెండో ఆహ్వాన పత్రికను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి స్వయంగా అందించారు. అంతేకాదు, వివాహ ఆహ్వాన పత్రికపై “శ్రీమతి నారా భువనేశ్వరి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో” అని ప్రత్యేకంగా ముద్రించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ వెడ్డింగ్ కార్డు ఫొటోలు వైరల్ కావడంతో నెటిజన్లలో చర్చ మొదలైంది. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్కు వీరాభిమాని అనే విషయం తెలిసిందే. పలు వేదికలపై పవన్ కళ్యాణ్ను “దేవుడు”గా అభివర్ణిస్తూ భావోద్వేగ ప్రసంగాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఆయన కుమార్తె పెళ్లి పత్రికలో పవన్ కళ్యాణ్ పేరు లేకుండా చంద్రబాబు, భువనేశ్వరి దంపతుల ఆశీస్సులతో అని ముద్రించడంపై కొందరు పవన్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
మరోవైపు, బండ్ల గణేష్కు నారా కుటుంబంతో చాలాకాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందుకే వారి పేర్లను ఆహ్వాన పత్రికపై ముద్రించారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. బండ్ల గణేష్ గతంలో అనేక సందర్భాల్లో నారా చంద్రబాబు నాయుడు కుటుంబంపై తన అభిమానాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలై తిరిగి ముఖ్యమంత్రి కావాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మొక్కుకున్నానని ఆయన వెల్లడించారు. ఆ కోరిక నెరవేరిన తర్వాత హైదరాబాద్ నుంచి తిరుమల వరకు కాలినడకన వెళ్లి తన మొక్కు తీర్చుకున్నారు. అలాగే నారా భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా హనుమకొండకు చెందిన అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించి తన అభిమానాన్ని చాటుకున్న విషయం తెలిసిందే.