లక్నో : నిన్న మొన్నటి వరకు అధికారం చలాయించిన ఓ ఐపీఎస్.. రాజకీయంగా ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పైనే పోటీ చేస్తానంటూ గొప్పలకు పోయిన రిటైర్డ్ ఐపీఎస్ అమితాబ్ ఠాకూర్ను ఇంటి నుంచి కదలనిచ్చేది లేదంటూ పోలీసులు ఇంటి గుమ్మం ముందు అడ్డావేశారు. మిమ్మల్ని గృహనిర్బంధంలో ఉంచుతున్నట్లు తెలిపే ఉత్తర్వులును ఏసీపీ స్థాయి అధికారి ఆయన ఇంటికి వచ్చి మరీ తెలుపడంతో ఆశ్చర్యపోవడం ఆయన వంతైంది. వివరాల్లోకెళితే..
ఉత్తరప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ ఇటీవల ముందస్తు రిటైర్మెంట్ తీసుకున్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాలుచేస్తున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై గోరఖ్పూర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అలా ప్రకటించి వారం గడించిందో లేదో.. ‘ఒక సీరియస్ కేసులో మీ పేరు బయటకు వచ్చింది. అందుకే మిమ్మల్ని గృహనిర్బంధంలో ఉంచుతున్నాం’ అని పోలీసు ఉన్నతాధికారులు ఆయనకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులను కాపలాగా పెట్టారు. ఆయనను విచారణ కూడా చేస్తున్నారు.
లైంగికదాడి కేసులో బీఎస్పీ ఎంపీ అతుల్రాయ్కు మద్దతుగా ఐపీఎస్ అమితాబ్ ఠాకూర్ సహకరించినట్లు అభియోగాలు మోపారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి రెండు రోజుల క్రితం బాధితురాలు విడుదల చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన ద్వారం వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించిన విషయాలు కూడా ఈ వీడియోలో ఉన్నట్లు తెలుస్తున్నది.
గోరఖ్పూర్ వెళ్లేందుకు ప్రయత్నించిన తనను పోలీసులు అడ్డుకున్నారని, ఇది పౌరుల హక్కులను కాలరాయడమే అని సోషల్ మీడియా వేదికగా రిటైర్డ్ ఐపీఎస్ అమితాబ్ ఠాకూర్ ఆరోపించారు. ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి బయల్దేరిన తనను గోమతినగర్లోని రేల్ విహార్ కాలనీలో ఉన్న తన స్నేహితుడి ఇంటి వద్ద పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. తనను చూసి యోగి ఆదిత్యనాథ్ భయపడుతున్నందునే ఇలా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
కాగా, లైంగిక దాడి బాధితురాలు సుప్రీంకోర్టు వద్ద ఆత్మహత్యాయత్నం చేస్తూ చేసిన అమితాబ్ ఠాకూర్పై తీవ్ర ఆరోపణలు చేసినందునే ఆయనను గృహనిర్బంధంలో ఉంచాల్సి వచ్చిందని ఏసీపీ శ్వేత శ్రీవాత్సవ తెలిపారు. బాధితురాలు, ఎంపీ అతుల్ రాయ్ ఇద్దరూ గోరఖ్పూర్ ప్రాంతానికి చెందిన వారైనందున, అమితాబ్ ఠాకూర్ పర్యటనతో అక్కడ శాంతి భద్రతల సమస్య ఎదురయ్యే అవకాశం ఉన్నందున ఆయన పర్యటనకు అడ్డుచెప్పినట్లు శ్వేత శ్రీవత్సవ వెల్లడించారు.
110 ఏండ్ల క్రితం మోనాలిసా పెయింటింగ్ దొంగతనం
తోటగా మారిన క్రికెట్ స్టేడియం.. ఎక్కడంటే..?
మసకబారుతున్న జో బైడెన్ గ్రాఫ్.. ఎందుకో తెలుసా?
తొలిసారి రూపాయి నాణెం ఎప్పుడు వచ్చిందో తెలుసా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..