యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలోని భువనగిరి, చౌటుప్పల్, ఆలేరు, భూదాన్పోచంపల్లి, మోత్కూరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల పరిధిలో ఈ ఏడాది 12.77కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. ఏండ్ల తరబడిగా పన్నుదారులు బకాయిలను కట్టకపోవడంతో మున్సిపాలిటీల్లో బకాయిలు పెద్ద మొత్తంలో పేరుకుపోయాయి. వాటిని వసూలు చేయడం కూడా మున్సిపల్ అధికారులకు కష్టతరమైంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పన్నుదారులకు ఊరట గొలిపే నిర్ణయాన్ని తీసుకున్నది. గత ఏడాది లాక్డౌన్లో ‘వన్టైం సెటిల్మెంట్ స్కీం’ను అందుబాటులోకి తీసుకొచ్చి బకాయిపడ్డ ఆస్తి పన్నుపై 90 శాతం రాయితీని ప్రకటించింది. అప్పట్లో మున్సిపల్ అధికారులు దీనిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు బకాయిదారుల నుంచి కూడా విశేష స్పందన వచ్చింది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో ‘వన్టైం సెటిలెమెంట్ స్కీం’లో భాగంగా పెద్దమొత్తంలో మొండి బకాయిలు వసూలయ్యాయి. 90శాతం రాయితీతో ఆస్తిపన్ను చెల్లింపుదారులు సైతం ప్రయోజనం పొందారు. ఈ క్రమంలోనే.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం గత మార్చి మొదటి వారంలో మరోసారి 90శాతం వడ్డీ మాఫీని ప్రకటించింది. ఆస్తి పన్నును ఒకేసారి కడితే వడ్డీలో 10 శాతం మాత్రమే చెల్లించే వీలును ప్రభుత్వం కల్పించింది. చివరి సారిగా కల్పించిన ఈ గడువు మార్చి 31తో ముగిసింది. ప్రభుత్వం ఆశించినట్లుగానే పన్నులు సైతం వసూలయ్యాయి.
రూ.11.21కోట్ల ఆస్తి పన్ను వసూలు
భువనగిరి మున్సిపాలిటీలో 13,672 నిర్మాణాలకు సంబంధించి రూ.4.79 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. స్పెషల్డ్రైవ్లో రూ.4.74కోట్ల బకాయిలు వసూలయ్యాయి. చౌటుప్పల్ మున్సిపాలిటీలో రూ.2.51కోట్ల వరకు ఉన్న ఇంటి పన్నులో రూ.2.02కోట్ల వరకు బకాయి వసూలైంది. అలాగే ఆలేరు మున్సిపాలిటీలో రూ.2.02కోట్ల బకాయిలకు గాను రూ.1.49కోట్ల బకాయిలు వసూలయ్యాయి. పోచంపల్లి మున్సిపాలిటీలో రూ.1.53కోట్లకుగాను రూ.1.40కోట్లు, మోత్కూరు మున్సిపాలిటీలో రూ.1.05కోట్లకుగాను రూ.82.06కోట్ల బకాయిలు వసూలయ్యాయి. ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ మాఫీతోపాటు పన్నులను రాబట్టేందుకు అధికారులు ప్రత్యేక దృష్టిసారించడంతో రికార్డుస్థాయిలో పన్నులు వసూలయ్యాయి. ప్రతీ వార్డుకు ఒక అధికారిని నియమించడంతోపాటు మున్సిపల్ కమిషనర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆరంభంలో కొంత నత్తనడకన సాగినప్పటికీ గడువు ముగిసేనాటికి పన్ను చెల్లింపులు ఊపందుకోవడంతో ఆశించిన స్థాయిల్లో మున్సిపాలిటీలు పన్ను బకాయిలను రాబట్టగలిగాయి.