BCCI Central Contracts: ఏడాదికాలంగా భారత క్రికెట్లో అంచనాలకు మించి రాణిస్తున్న యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్, శివమ్ దూబేలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గుడ్ న్యూస్ చెప్పనుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. గతేడాది ఐపీఎల్తో పాటు భారత జాతీయ జట్టు తరఫున ఆడుతూ నిలకడగా రాణించిన ఈ ఇద్దరికీ ఈ ఏడాది నుంచి బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే విడుదల కాబోతున్న సెంట్రల్ కాంట్రాక్టుల లిస్ట్లో ఈ ఇద్దరి పేరు చేర్చినట్టు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
జైస్వాల్ గతేడాది వెస్టిండీస్తో జులైలో ముగిసిన టూర్లో మూడు ఫార్మాట్లలోనూ ఎంట్రీ ఇచ్చాడు. అప్పట్నుంచి అతడు భారత్ ఆడుతున్న టీ20, టెస్టు జట్టులో రెగ్యులర్ ప్లేయర్గా మారిపోయాడు. ముఖ్యంగా టీ20లలో అతడు భారత భవిష్యత్ స్టార్గా ఎదుగుతున్నాడు. స్వదేశంలో అఫ్గాన్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో ఆడలేకపోయిన అతడు.. రెండో మ్యాచ్లో బరిలోకి దిగి వీరవిహారం చేశాడు. 34 బంతుల్లోనే 68 పరుగులుచేసిన జైస్వాల్.. భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
Jaiswal & Dube set to receive BCCI contract for their fantastic performance. [Gaurav Gupta by TOI] pic.twitter.com/93jx7vOesm
— Johns. (@CricCrazyJohns) January 16, 2024
ఇక దూబే విషయానికొస్తే 2019లోనే ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడు. కానీ గత రెండు సీజన్లుగా ఐపీఎల్లో హిట్టర్గా నిలకడగా రాణిస్తున్న అతడు గతేడాది టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. అఫ్గాన్తో సిరీస్లో అతడు ఆల్రౌండర్గా సమర్థవంతమైన పాత్రను పోషిస్తున్నాడు. రెండు మ్యాచ్లలోనూ రెండు అర్థ సెంచరీలు చేసిన దూబే.. బౌలర్గా కూడా రెండు వికెట్లు పడగొట్టాడు. హార్ధిక్ పాండ్యా బ్యాకప్గా ఉన్న అతడు.. యూఎస్ఎలో వచ్చే ఏడాది జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్ కప్లో భారత్కు కీలకంగా మారతాడని భారత క్రికెట్ మాజీలు అభిప్రాయపడుతున్నారు.
బీసీసీఐ కాంట్రాక్టులు నాలుగు గ్రేడ్లుగా ఉంటాయన్న విషయం తెలిసిందే. A+, A, B, C కేటగిరీలుగా ఉన్న కాంట్రాక్టులలో ఏ+ గ్రేడ్ ఆటగాళ్లు యేటా రూ. 7 కోట్లు పొందుతారు. ఏ, బీ, సీ గ్రేడ్ ఆటగాళ్లకు వరుసగా రూ. 5 కోట్లు, రూ. 3 కోట్లు, కోటి రూపాయల వార్షిక వేతనం లభిస్తుంది. మరి ఈ నాలుగు గ్రేడ్స్లో జైస్వాల్, దూబేలకు ఏ గ్రేడ్లో ఛాన్స్ దక్కేనో..!