Narayana Murthy | పాల్ జీ హెవిట్ రాసిన ‘కాన్సెప్చువల్ ఫిజిక్స్’ అనే పుస్తకాన్ని భారత్లోని ప్రతి విద్యార్థి చదవాలని ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎన్ఆర్ నారాయణమూర్తి తెలిపారు. రచయిత ఈ పుస్తకాన్ని అద్భుతంగా రాశారని, భారతీయ భాషల్లోకి అనువదించాల్సిన అవసరం ఉందని ఓ టీవీ చానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
‘ప్రస్తుతం నేను కాన్సెప్చువల్ ఫిజిక్స్ అనే పుస్తకం చదువుతున్నా, హైస్కూల్ విద్యార్థులను ద్రుష్టిలో పెట్టుకుని హైస్కూల్ టీచర్ పాల్ జీ హెవిట్ ఈ పుస్తకం రాశారు. ఫిజిక్స్ ఎలా బోధించాలో అద్భుతంగా విశ్లేషించారు. రచయిత అనుమతి లభిస్తే, దీన్ని అన్ని భారతీయ భాషల్లోకి అనువదించాలి. ఇందులో అద్భుతమైన ఎక్సర్సైజ్లు ఉన్నాయి. క్లిష్టమైన ఐడియాలను చాలా చక్కగా వివరించారు. ప్రతి భారతీయ విద్యార్థి దీన్ని చదవడం వల్ల సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో మంచి అవగాహన ఏర్పడుతుంది’ అని అన్నారు.
ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతాయన్న భయాలను ఆయన కొట్టి పారేశారు. దీని ప్రభావం మరింత ఎక్కువ చేసి చూపుతున్నారని వ్యాఖ్యానించారు. కొత్త అవకాశాల సృష్టి, మనుషుల ఉత్పాదకత పెంచే సామర్థ్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ఉందన్నారు. 1970ల్లోనూ ఇదే తరహా అపోహలు వచ్చాయని గుర్తు చేశారు. ప్రపంచంలో జరిగిన ప్రతి ఆవిష్కరణను అందిపుచ్చుకునే సామర్థ్యం భారత్’కు ఉంది అని చెప్పారు. పాత తరాల వారితో పోలిస్తే యువత చురుగ్గా ఉన్నారన్నారు.