Tanmay Agarwal : రంజీ ట్రోఫీలో మరో రికార్డు బద్ధలైంది. హైదరాబాదీ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్(Tanmay Agarwal) వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ(Triple Century) కొట్టాడు. శుక్రవారం అరుణాచల్ ప్రదేశ్పై 28 ఏండ్ల తన్మయ్ 147 బంతుల్లోనే మూడొందలు బాదాడు. దాంతో, ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా క్రికెటర్ మార్కో మరైస్(Marco Marais) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.
మార్కో 2017లో 191 బంతుల్లో ట్రిపుల్ సెంచరీతో రికార్డు నెలకొల్పాడు. దాంతో, ఆ రికార్డు బద్ధలు కొట్టడం సాధ్యం కాకపోవచ్చని అనుకున్నారంతా. కానీ, తన్మయ్ ఆకలిగొన్న పులిలా.. అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లపై విరుచుకుపడి అసాధ్యాన్ని ఆవిష్కరించాడు.
Tanmay Agarwal has set a new record by scoring the fastest triple hundred in First-Class cricket 🔥#TanmayAgawal #RanjiTrophy #Cricket #HYDvsARP pic.twitter.com/HS3CV6ZVo0
— Wisden India (@WisdenIndia) January 26, 2024
తొలి రోజు ఆట ముగిసే సరికి 323 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో 33 ఫోర్లు, 21 సిక్సర్లు ఉన్నాయంటే తన్మయ్ విధ్వంసం ఏ రేంజ్లో సాగిందో ఊహించొచ్చు. దాంతో, హైదరాబాద్ ఒక వికెట్ నష్టానికి 529 పరుగులు చేసింది. ఫస్ట్ క్లాస్లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ బాదిన వాళ్లలో వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్(Vivian Richards) కూడా ఉన్నాడు. 1985లో రిచర్డ్స్ కేవలం 244 బంతుల్లోనే 300 కొట్టాడు.
వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్
కానీ ఆ మరుసటి ఏడాదే న్యూజిలాండ్ ఆటగాడు కెన్ రూథర్ఫర్డ్(Kein Rutherford) 234 బంతుల్లోనే మూడొందల మార్క్ అందుకున్నాడు. ఫస్ట్ క్లాస్ ట్రిపుల్ సెంచరీ వీరుల జాబితాలో శ్రీలంక క్రికెటర్ కుశాల్ పెరీరా ఒకడు. 2012-13 సీజన్లో కొలంబో వేదికగా సరాసేన్స్ స్పోర్ట్స్ క్లబ్పై పెరీరా 244 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ బాదేశాడు.