Suryakumar Yadav : టీమిండియా టీ20 సంచలనం, పొట్టి క్రికెట్లో వరల్డ్ నంబర్ 1 అయిన సూర్యకుమార్ యాదవ్ సతీసమేతంగా ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. మూడో టెస్టుకు వారంపైగా సమయం ఉండడంతో సూర్య, భార్య దేవిషతో కలిసి తిరుమలకు వెళ్లాడు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం గుడి ఆవరణలో ఫొటోలు దిగాడు. ఈ స్టార్ ప్లేయర్ తిరుమల దర్శనం ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. జనవరిలో సూర్య ఉజ్జయిని మమంకాళేశ్వర్ ఆలయానికి వెళ్లాడు. కారు యాక్సిడెంట్లో గాయపడ్డ వికెట్ కీపర్ రిషభ్ పంత్ త్వరగా కోలుకోవాలని పూజలు చేసిన విషయం తెలిసిందే.
వన్డేలు, టీ20ల్లో చెలరేగుతున్న సూర్య బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీతో టెస్టుల్లో ఆరంగేట్రం చేశాడు. అయితే.. నాగ్పూర్లో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లో తక్కువ స్కోర్కే పెవిలియన్ చేరాడు. రెండో టెస్టులో భారీ స్కోర్ చేస్తాడని ఫ్యాన్స్ ఊహించారు. కానీ, గాయం నుంచి కోలుకున్న శ్రేయాస్ అయ్యర్ జట్టులోకి రావడంతో సూర్య రెండో టెస్టుకు బెంచ్కే పరిమితం అయ్యాడు. ఇండోర్లో మార్చి 1న జరిగే మూడో టెస్టులో అతడికి ఛాన్స్ వస్తుందా? లేదా? అనేది చూడాలి. తొలి రెండు మ్యాచ్లు గెలిచిన భారత్ నాలుగు టెస్టుల సిరీస్లో 2-0తో ఆధిక్యంలో ఉంది.