Shubman Gill | హిట్మ్యాన్ రోహిత్ శర్మ, విధ్వంసక వీరుడు వీరేంద్ర సెహ్వాగ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్.. ఇలా చెప్పుకుంటూ పోతే భారత స్టార్ ఓపెనర్ల జాబితా చాంతాడంత పెద్దది అవడం ఖాయం! పవర్ హిట్టర్ రోహిత్ తర్వాత ఎవరనే ప్రశ్నకు.. నేనున్నాని శుభ్మన్ గిల్ బదులిస్తున్నాడు. అండర్-19 స్థాయిలో మెరుపులు మెరిపించి జాతీయ జట్టుకు ఎంపికైన ఈ 23 ఏండ్ల పంజాబ్ కా పుత్తర్.. ఈ ఏడాది అద్వితీయ ఫామ్ కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్తో తొలి వన్డేలో డబుల్ సెంచరీతో చెలరేగిన గిల్.. ఇండోర్ పోరులో మరో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన శుభ్మన్ భవిష్యత్తు ఆశాకిరణం తానే అని చెప్పకనే చెపుతున్నాడు!
ఇండోర్: టెస్టు క్రికెట్లో ఓపెనర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శుభ్మన్ గిల్ ఏడాది కాలంగా వన్డేల్లోనూ అదరగొడుతున్నాడు. 2019లో న్యూజిలాండ్తో హామిల్టన్ వేదికగా జరిగిన పోరులో అరంగేట్రం చేసిన గిల్.. ఈ ఏడాది భీకర ఫామ్ కొనసాగిస్తున్నాడు. భారత్ తరఫున అత్యంత వేగంగా (19 ఇన్నింగ్స్ల్లో) వెయ్యి పరుగులు చేసిన బ్యాటర్గా చరిత్రకెక్కిన శుభ్మన్.. తానాడిన 20 ఇన్నింగ్స్ల్లో 71.37 సగటుతో 1142 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు. వెయ్యి పరుగులు చేసిన వారిలో ఇదే అత్యుత్తమ సగటు కాగా.. నెమ్మదిగా ఆడతాడన్న అపవాదును ఒక్క సిరీస్తోనే తుడిచిపెట్టాడి ఓపెనర్. హైదరాబాద్ వేదికగా గత బుధవారం న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో డబుల్ సెంచరీతో విజృంభించిన గిల్.. పర్ఫెక్ట్ వన్డే ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో అభిమానులకు పరిచయం చేశాడు. 50, 150, 200 మైలురాళ్లను సిక్సర్లతో పూర్తి చేసుకున్న గిల్.. తానెంత వేగంగా ఆడగలనో ఉప్పల్లో నిరూపించాడు. సహచరులంతా ఒక్కొక్కరుగా వెనుదిరిగుతున్న చోట.. కివీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారించాడు. రాయ్పూర్లో జరిగిన రెండో వన్డేలో అజేయంగా నిలిచిన ఈ ఓపెనర్.. ఇండోర్ మ్యాచ్లో మరోసారి దంచికొట్టాడు.
గత నాలుగు వన్దేల్లో మూడు సార్లు సెంచరీ మార్క్ దాటిన గిల్.. న్యూజిలాండ్తో సిరీస్లో 360 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు. మూడు మ్యాచ్ల్లో వరుసగా 208, 40*, 112 పరుగులు చేసిన గిల్ ఒక సిరీస్ (3 వన్డేల)లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బాబర్ ఆజమ్ (360; వెస్టిండీస్పై)తో సమంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన సిరీస్లో రెండు సెంచరీలతో విరాట్ కోహ్లీ 283 పరుగులు చేసి భారత్ తరఫున ఒకే సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా నిలువగా.. పది రోజుల వ్యవధిలో గిల్.. కింగ్ కోహ్లీని దాటేశాడు. పొద్దంతా ప్రాక్టీస్ చేసే గిల్తో ఆడేందుకు చిన్నారులు అందుబాటులో లేని సమయంలో.. శుభ్మన్ వికెట్ పడగొడితే 100 రూపాయలు ఇస్తానని ఆశ చూపి ప్లేయర్లను సిద్ధం చేసిన అతడి తండ్రి.. కుమారుడి సక్సెస్తో ఫుల్ ఖుష్ అవుతున్నాడు.
– నమస్తే తెలంగాణ క్రీడా విభాగం
IND vs NZ | మూడో వన్డేలో కివీస్ను చిత్తు చేసిన భారత్.. 3-0తో సిరీస్ కైవసం