IND vs NZ : మూడో వన్డేలో భారత్, న్యూజిలాండ్ను చిత్తు చేసింది. 90 పరుగుల తేడాతో గెలుపొందింది. శాంటర్న్(34)ను చాహల్ ఔట్ చేయడంతో కివీస్ ఇన్నింగ్స్ 295 రన్స్ వద్ద ముగిసింది. డ్వేన్ కాన్వే(138) శతకం బాదడంతో కివీస్ ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. నికోలస్ (42), మిచెల్ (24) మాత్రమే రాణించారు. తొలి వన్డే సెంచరీ హీరో బ్రేస్వెల్ (26) విఫలమయ్యాడు. శార్దూల్ ఠాకూర్ మిచెల్, లాథమ్, గ్లెన్ ఫిలిప్స్ వికెట్లు తీసి న్యూజిలాండ్ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఆ తర్వాత కుల్దీప్ న నికోలస్, బ్రేస్వెల్, ఫెర్గూసన్ వికెట్లు తీసి కివీస్ పతనాన్ని శాసించాడు. దాంతో ఆ జట్టు 295 పరుగులకే కుప్పకూలింది. రెండు వన్డేల్లోనూ గెలిచిన టీమిండియా 3-0తో కివీస్ను వైట్వాష్ చేసింది.
సెంచరీతో ఆదుకున్న కాన్వే
న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్ డ్వేన్ కాన్వే (138) ఒక్కడే రాణించారు. 386 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆ జట్టుకు తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండో బంతికే ఓపెనర్ ఫిన్ అలెన్ను హార్దిక్ పాండ్యా బౌల్డ్ చేశాడు. అయితే.. నికోలస్ (42), కాన్వే రెండో వికెట్కు 106 పరుగులు జోడించారు. నికోలస్ను శార్థూల్ ఔట్ చేసి భారత్కు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత మిచెల్తో కలిసి కాన్వే కీలక భాగస్వామ్యం నిర్మించాడు. మూడో వికెట్కు మిచెల్ (24) తో 68 రన్స్ జోడించాడు. చాహల్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాది కాన్వే వన్డేల్లో మూడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ తర్వాత భారీ షాట్లతో చెలరేగుతున్న అతడిని ఉమ్రాన్ మాలిక్ ఆరో వికెట్గా వెనక్కి పంపాడు. ఆ తర్వాత వచ్చిన బ్రేస్వెల్ (26)ను కుల్దీప్ బోల్తా కొట్టించాడు. చివర్లో శాంటర్న్(34) బ్యాట్ ఝులిపించడంతో కివీస్ 295 రన్స్ చేయగలిగింది. భారత బౌలర్లలో కుల్దీప్, శార్థూల్ తలా మూడు వికెట్లు తీశారు. యజువేంద్ర చాహల్ 2 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్ చెరో వికెట్ దక్కింది.
రోహిత్, గిల్ శతకాలు
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్ల నష్టానికి 385 రన్స్ చేసింది. ఓపెనర్లు శుభ్మన గిల్ (112), రోహిత్ శర్మ (101) సెంచరీలతో చెలరేగారు. వీళ్లిద్దరూ తొలి వికెట్కు న్యూజిలాండ్పై 212 రన్స్ జోడించారు. వీళ్ల జోడీని బ్రేస్వెల్ విడదీశాడు. సెంచరీ తర్వాత భారీ షాట్ ఆడబోయి రోహిత్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే గిల్ కూడా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చి న కోహ్లీ (35), ఇషాన్ (17), సూర్యకుమార్ యాదవ్(14) విఫలమయ్యారు. జాకబ్ డఫీ వెంట వెంటనే కోహ్లీ, సూర్య వికెట్లు తీసి భారత్ను దెబ్బ కొట్టాడు. అయితే.. చివర్లో హార్దిక్ పాండ్యా (54), శార్దూల్ ఠాకూర్(25)మెరుపులు మెరిపించారు. దాంతో, భారత్ 385 స్కోర్ చేసింది. కివీస్ బౌలర్లలో టిక్నర్, జాకబ్ డఫీ తలా మూడు వికెట్లు తీశారు. బ్రేస్వెల్కు ఒక వికెట్ దక్కింది.