PCB : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మరో మెగా టోర్నీ ఆతిథ్యానికి సిద్దమవుతోంది. షెడ్యూల్ ప్రకారం ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025) హక్కులు దక్కించుకున్న పాక్.. తాజాగా టోర్నీ వేదికలను ఖరారు చేసింది. కరాచీ, లాహోర్, రావల్పిండిలో మ్యాచ్లు నిర్వహించనున్నామని సోమవారం పాక్ క్రికెట్ బోర్డు(PCB) వెల్లడించింది.
‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ షెడ్యూల్ను ఖరారు చేశాం. ఐసీసీ భద్రతా బృందంతో సమావేశం గొప్పగా జరిగింది. పాక్లో టోర్నీ ఏర్పాట్లను వాళ్లు పరిశీలించారు. స్టేడియం పురోగతి ప్రణాళికలను మేము వాళ్లతో పంచుకుంటాం. ఈసారి మేము విజయవంతంగా టోర్నీని నిర్వహిస్తామని అనుకుంటున్నాం’ అని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ(Mohsin Naqvi) తెలిపాడు.
చివరిసారిగా 2017లో నిర్వహించిన చాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లండ్ వేదికైంది. ఈసారి ఆతిథ్య హక్కులను పాక్ దక్కించుకుంది. అయితే.. ఆసియా కప్(Asia Cup 2023) సమయంలోనే భద్రతా కారణాలతో పాక్లో ఆడమని బీసీసీఐ తేల్చి చెప్పేసింది. దాంతో, మరోదారి లేక హైబ్రిడ్ మోడల్ (Hybrid Model)లో టోర్నీని నిర్వహించారు. అయితే.. భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే వరల్డ్ కప్లో పాక్ జట్టు ఆడింది. దాంతో, మేము మా జట్టును పంపాం కాబట్టి ఈసారి బీసీసీఐ కూడా తమ జట్టును మా దేశానికి పంపాలి అని పీసీబీ వాదిస్తోంది.
కానీ, ఈ విషయంపై బీసీసీఐ సెక్రటరీ జై షా మాత్రం ఇంకా స్పందించలేదు. దాంతో, టోర్నీ నిర్వహణపై సందిగ్దం నెలకొంది. ఆసియా కప్ మాదిరిగానే చాంపియన్స్ ట్రోఫీ కూడా హైబ్రిడ్ మోడల్లో జరుగనుందా? అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. ఈ మెగా టోర్నీ కంటే ముందు టీ20 వరల్డ్ కప్లో భారత్, పాక్లు తలపడనున్నాయి. జూన్ 9న న్యూయార్క్లో చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ కోట్లాది మంది ఫ్యాన్స్ను మునివేళ్లపై నిలబెట్టనుంది.