Naveen Ul Haq : వన్డే వరల్డ్ కప్ అనంతరం వన్డేలకు వీడ్కోలు పలికిన అఫ్గనిస్థాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ (Naveen Ul Haq) టీ20 లీగ్స్లో రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఈ స్పీడ్స్టర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2024) 17వ సీజన్ కోసం ఎదురుచూస్తున్నాడు. మరో పదిహేడు రోజుల్లో సీజన్ మొదలవ్వనుందనగా నవీన్ షాకింగ్ విషయాలు చెప్పాడు. 16వ సీజన్లో విరాట్ కోహ్లీ(Virat Kohli)తో గొడవ గురించి పలు సంచలన విషయాలు వెల్లడించాడు.
జల్మి టీవీ పొడ్కాస్ట్లో మాట్లాడిన నవీన్.. ‘బెంగళూరుతో మా తరహా గేమ్ ఆడాలనుకున్నాం. అనుకున్నట్టే మేము గెలిచాం. అది చాలా క్లోజ్ గేమ్. అందుకని అవేశ్ ఖాన్ విజయోత్సాహంలో తన హెల్మెట్ను నేలకేసి కొట్టాడు. అతడు అలా ప్రవర్తించడం కోహ్లీకి నచ్చలేదనుకుంటా. ఆ తర్వాత ఆర్సీబీ లక్నోకు వచ్చింది. అప్పుడు 9 లేదా 10వ స్థానంలో బ్యాటింగ్కు వెళ్లాను. ఆ మ్యాచ్ను మేము చేజార్చుకున్నాం. అయితే.. ఆ మ్యాచ్లో నన్ను స్లెడ్జింగ్ చేస్తారని ఊహించలేదు. కోహ్లీ, సిరాజ్ నన్ను అనవసరంగా తిట్టారు. ఎవరైనా నన్ను ఏమన్నా అంటే నేను సైలెంట్గా ఉండేరకం కాదు. మ్యాచ్ అనంతరం షేక్హ్యాండ్ సమయంలోనూ ఆ గొడవ కొనసాగింది’ అని వెల్లడించాడు.
అంతేకాదు చిన్నస్వామి స్టేడియంలో లక్నో మెంటార్ గౌతం గంభీర్(Gautam Gambhir) నోటిపై వేలు పెట్టి .. జోక్యం చేసుకోవడంపై కూడా నవీన్ ఉల్ హక్ స్పందించాడు. ‘చివరి బంతికి లక్నో జట్టు విజయం తర్వాత గంభీర్ నోటిపై వేలు పెట్టుకొని నిశబ్దంగా ఉండాలని ఆర్సీబీ అభిమానులకు సూచించాడు. అతడు అలా ఎందుకు చేశాడంటే.. అంతకుముందు మ్యాచ్లో ఆఖరి బంతికి ఒక్క పరుగు కావాలి.
Somebody 🤏 us because WE STILL CANNOT BELIEVE IT 😍#RCBvLSG | #IPL2023 | #LucknowSuperGiants | #LSG | #GazabAndazpic.twitter.com/NC6dJRVZVt
— Lucknow Super Giants (@LucknowIPL) April 10, 2023
అప్పుడు ప్రత్యర్థి బౌలర్ నాన్స్ట్రయికర్ను రనౌట్ చేసేందుకు ప్రయత్నించాడు. దాంతో, గంభీర్ కోపం నశాలానికి పాకింది. అయితే.. ఆ మ్యాచ్ చాలా గొప్ప మ్యాచ్. కానీ, ఆటగాళ్ల పోరాటం కంటే గొడవనే హైలెట్ అయింది. అందుకనే గంభీర్ ఆర్సీబీ ఫ్యాన్స్ను సైలెంట్గా ఉండాలని అలా ప్రవర్తించాడు. అతడు నిజంగా ఆటను ఎంతో ప్రేమిస్తాడు. కోహ్లీ కూడా అంతే’ అని నవీన్ చెప్పుకొచ్చాడు.
నవీన్, కోహ్లీలు మైదానంలోనే గొడవపడడం అప్పట్లో మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత ఈ అఫ్గన్ స్పీడ్స్టర్ ఇన్స్టాగ్రామ్లో ‘స్వీట్ మ్యాంగోస్'(Sweet Mangoes) ఫొటోతో కోహ్లీ అభిమానులు ఆగ్రహానికి గురయ్యాడు. అయితే.. అయితే.. రెండోసారి లక్నో, ఆర్సీబీ ఎదరుపడినప్పుడు కోహ్లీ, నవీన్ నవ్వుతూ పలకరించుకున్నారు. ఇద్దరూ హుందాగా నడుచుకొని మైదానంలో మొదలైన గొడవకు మైదానంలోనే తెరదించారు.
వన్డే వరల్డ్ కప్ అనంతరం నవీన్ వన్డేలకు వీడ్కోలు పలికాడు. ఇకపై టీ20ల్లో మాత్రమే అతడు కనిపించనున్నాడు. ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Gaints)కు ప్రాతినిధ్యం వహించిన అతడు ఆట కంటే వివాదాలతో వార్తల్లో నిలిచాడు. అయినా సరే 17వ సీజన్కు లక్నో రీటైన్ చేసుకుంది.