జెరుసలాం: ఇజ్రాయెల్లో జరిగిన యాంటీ ట్యాంక్ మిస్సైల్ అటాక్(Missile Attack)లో ఓ భారతీయుడు మృతిచెందాడు. నార్తర్ బోర్డర్ మార్గలియట్ వద్ద లెబనాన్ జరిపిన దాడిలో భారతీయ వ్యక్తి మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. బాధితులు ముగ్గురూ కేరళకు చెందినవారిగా గుర్తించారు. మార్గలియట్లో ఉన్న వ్యవసాయక్షేత్రంపై మిస్సైల్ అటాక్ జరిగింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. కొల్లాంకు చెందిన పత్నిబిన్ మ్యాక్స్వెల్ అనే వ్యక్తి ఆ దాడిలోప్రాణాలు కోల్పోయాడు. జివ్ ఆస్పత్రిలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. క్షిపణి దాడిలో బుష్ జోసెఫ్ జార్జ్, పౌల్ మెల్విన్ అనే వ్యక్తులు గాయపడ్డారు. చికిత్స కోసం వాళ్లను ఆస్పత్రికి తీసుకెళ్లారు.
జార్జ్ అనే వ్యక్తిని బెలిన్సన్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అతని ముఖం, శరీరానికి గాయాలు అయ్యాయి. అతనికి సర్జరీ చేశారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నట్లు డాక్టర్లు చెప్పారు. భారత్లో ఉన్న కుటుంబీకులతో అతను మాట్లాడినట్లు తెలుస్తోంది. మెల్విన్ అనే వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. జివ్ ఆస్పత్రిలో అతన్నిచేర్పించారు. కేరళలోని ఇదుక్కి జిల్లా అతనిది.
లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా దళం ఆ అటాక్ చేసి ఉంటుందని భావిస్తున్నారు. ఆ గ్రూపు ఇటీవల రాకెట్లు, మిస్సైల్స్, డ్రోన్లతో దాడి చేస్తున్నది. అక్టోబర్ 8వ తేదీ నుంచి హమాస్కు మద్దతుగా హిజ్బుల్లా ఆ దాడులు చేస్తోంది.