హాలియా, మే 5 : నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన నోముల భగత్ బుధవారం హైదరాబాద్లో పలువురు రాష్ట్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 10రోజుల పాటు సాగర్ నియోజకవర్గంలో మకాం వేసి తన విజయం కోసం కృషి చేసిన రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ను ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసి సన్మానించారు. రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డిని కలిసి తన విజయానికి కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని, బాల్క సుమన్ మాట్లాడుతూ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మాదిరి ప్రజల కోసం పనిచేసి నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి తమవంతు సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. భగత్ వెంట టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బొల్లేపల్లి శ్రీనివాస్రాజు ఉన్నారు.