కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్కు ముందు సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. బెంగాల్లో కాషాయ పార్టీ అధికారంలోకి వస్తే బెంగాలీలను రాష్ట్రం నుంచి తరిమేస్తారని దీదీ ఆరోపించారు. నందిగ్రామ్లో సోమవారం ఆమె మాట్లాడుతూ ప్రజలు బీజేపీకి ఓటేస్తే బెంగాల్ను వారు దోచుకుంటారని, బెంగాల్ ఉనికినీ దెబ్బతీస్తారని వ్యాఖ్యానించారు. తృణమూల్కు ఓటు వేస్తే మీ ఇంటి ముందుకే ఉచిత రేషన్ సరఫరా చేస్తామని చెప్పారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన తెలుపుతుంటే నరేంద్ర మోదీ, బీజేపీ పేతలు వారి భూములను గుంజుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
రైతుల భూములను లూటీ చేసేందుకు అంగీకరించవద్దని, పశ్చిమ బెంగాల్ను వారు లూటీ చేసేందుకు అనుమతించరాదని అన్నారు. మన సంస్కృతికి పాతరేసేందుకు వారికి అవకాశం ఇవ్వకూడదని చెప్పారు. తాను తన పేరును మర్చిపోయినా నందిగ్రామ్ను మాత్రం మరువనని ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న దీదీ స్పష్టం చేశారు. మరోవైపు మమతా బెనర్జీ మైనారిటీలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేత, నందిగ్రామ్లో దీదీ ప్రత్యర్ధి సువేందు అధికారి నిప్పులు చెరిగారు. బేగం(మమతా బెనర్జీ)కు ఓటు వేయరాదని, ఆమెకు ఓటు వేస్తే బెంగాల్ మినీ పాకిస్తాన్లా తయారవుతుందని దుయ్యబట్టారు.