Jasprit Bumrah : పదహారో సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్కు ముందు ముంబై ఇండియన్స్కు పెద్ద షాక్. టీమిండియా స్టార్ పేసర్, ఆ జట్టు ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సీజన్కు దూరం కానున్నాడు. అందుకు కారణం.. పదే పదే తిరగబెడుతున్న వెన్నునొప్పి. దాంతో, ఆ సమస్యకు శాశ్వత పరిష్కారంగా అతడు సర్జరీ చేయించుకోనున్నాడు. సర్జరీ తర్వాత అతను కోలుకునేందుకు దాదాపు రెండు నెలల సమయం పట్టనుంది. అందుకని అతను ఈసారి ఐపీఎల్లో ఆడే అవకాశం లేదు.
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి అందరూ బుమ్రా గురించే మాట్లాడడం మొదలుపెట్టారు. అయితే.. అతను ఈ లీగ్లో ఆడడంపై బీసీసీఐతో పాటు ఎన్సీఏ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. దాంతో, అతను ఆడతాడా? లేదా? అనే సందేహం అభిమానుల్లో నెలకొంది.
యార్కర్ కింగ్ బుమ్రా ఆఖరి మ్యాచ్ ఆడి ఆరు నెలలు కావొస్తోంది. పోయిన ఏడాది సెప్టెంబర్లో చివరిగా మైదానంలోకి దిగాడు. నొప్పితో బాధపడుతున్న బుమ్రాకు ఎన్సీఏలో స్కాన్ తీయిస్తే సమస్య తీవ్రంగా ఉందని తెలిసింది. దాంతో, టీ20 వరల్డ్ కప్లో ఆడలేదు. అయితే.. ఈమధ్యే అతడిని శ్రీలంక వన్డే సిరీస్కు ఎంపిక చేసిన బీసీసీఐ వెంటనే తప్పించింది. ఎందుకంటే..? అతను పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం ఇవ్వాలనుకుంది.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ వరకైనా ఫిట్నెస్ బుమ్రా సాధిస్తాడని అంతా అనుకున్నారు. కానీ, బుమ్రాకు ఎన్సీఏ సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఐపీఎల్ ఆడకున్నా పర్లేదు కానీ, అతను వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్, స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్ కప్ ఆడాతాడా? లేదా? అనేది అనుమానమే. అదే జరిగితే.. భారత్కు పెద్ద దెబ్బే.