FIFA Best Footballer : లెజెండరీ ఫుట్బాలర్, వరల్డ్ కప్ విజేత లియోనల్ మెస్సీ మరో అవార్డు సాధించాడు. 2022 ఫిఫా బెస్ట్ మెన్స్ ప్లేయర్ అవార్డు అందుకున్నాడు. అతను ఈ అవార్డు గెలవడం ఇది రెండోసారి. ప్యారిస్లో నిన్న రాత్రి ఫిఫా ఫుట్బాల్ అవార్డుల వేడుక కన్నులపండువగా జరిగింది. ఫుట్బాల్ ఆటలో అత్యుత్తమ ఆటగాళ్లను సన్మానించి గౌరవించడమే ఉద్దేశంగా ఈ ఫంక్షన్ నిర్వహించారు.
పోయిన ఏడాది వరల్డ్ కప్ కలను నిజం చేసుకున్న మెస్సీని బెస్ట్ మెన్స్ ప్లేయర్గా ఎంపిక చేశారు. దాంతో రెండు సార్లు ఈ అవార్డు అందుకున్న అతను పోర్చుగల్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో, రాబర్ట్ లెవండోవిస్కీ (పోలాండ్) తో సమానంగా నిలిచాడు.
ఫుట్బాల్లో దిగ్గజ ఆటగాళ్లు అయిన మెస్సీ, క్రిస్టియన్ రొనాల్డో ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించారు. పలు క్లబ్స్ తరఫున ఎన్నో ట్రోఫీలు సాధించారు. అంతేకాదు వీళ్లిద్దరూ పోటాపోటీగా ఫిఫా అవార్డులు గెలిచారు. ప్రస్తుతం మెస్సీ ఖాతాలో 17 ఉన్నాయి. 16 అవార్డులతో రొనాల్డో రెండో స్థానంలో ఉన్నాడు.
మెస్సీ, రొనాల్డో మైదానంలో ఎదురుపడితే చూడాలని ప్రతి అభిమాని కోరుకుంటారు. అందరి కోరికన నిజం చేస్తూ.. ఫిఫా వరల్డ్ కప్ అనంతరం ఈ స్టార్ ప్లేయర్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్లో తలపడ్డారు. అల్ నస్రీ క్లబ్ (సౌదీ అరేబియా) కెప్టెన్గా రొనాల్డో, పీఎస్జీ క్లబ్ సారథిగా మెస్సీ బరిలోకి దిగారు. ఈ మ్యాచ్లో పీఎస్జీ క్లబ్ విజేతగా నిలిచింది. ఫిఫా వరల్డ్ కప్ సమయంలోనే మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ రొనాల్డతో కాంట్రాక్టు రద్దు చేసుకుంది. దాంతో, ఈ స్టార్ ప్లేయర్ను సౌదీ అరేబియాకు చెందిన అల్ నస్రీ క్లబ్ భారీ ధరకు సొంతం చేసుకుంది. రెండున్నరేళ్లకు గానూ రూ.4400 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది.