హుజూర్నగర్, జూలై 25 : హుజూర్ నగర్ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డు నందు గల శ్రీలక్ష్మి నరసింహ గణేష్ ఫార్ బాయిల్డ్ మోడ్రన్ రైస్ మిల్లు నుండి విపరీతమైన బూడిద, పొట్టు, కాలుష్యం ఉత్పన్నమౌతుందని, యజమాన్యం నింబంధనలకు వ్యతిరేకంగా పొట్టు గది, సరైన బూడిద గది లేకుండా బహిరంగంగా వదులుతూ ప్రజల ఆరోగ్యలతో చెలగాటంతో ఆడుతుందని పరిసరాల కాలనీ వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హుజూర్ నగర్ -మిర్యాలగూడ రాకపోకలు చేసే వివిధ వాహనదారులు కూడా కళ్లల్లో బూడిద పడి ఇబ్బందులు పడటమే కాకుండా అనేక సార్లు రోడ్డు ప్రమాదాల భారిన సైతం పడుతున్నట్లు చెప్పారు. మిల్లుకు కనీసం ప్రహరీ కూడా లేదన్నారు. 15 రోజుల క్రితం బాధిత ప్రాంతాల ప్రజలు పురపాలక సంఘం కమిషనర్ సతీష్ కు ఫిర్యాదు చేస్తే ఆయన మిల్లును సందర్శించి పలు సూచనలు చేసి చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
అయినా మిల్లు యజమాని ఆ సూచనలను ఏమాత్రం లెక్క చేయకుండా తన ఇష్టానుసారంగా మిల్లును నడుపుతూ కాలుష్యం వెదజల్లుతున్నట్లు తెలిపారు. ఈ విషయమై శనివారం పరిసరాల కాలనీ వాసులు మిల్లు జయమానిని నిలదీశారు. మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలిశెట్టి నరసింహారావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గెల్లి రవి వచ్చి నింబంధనలకు విరుద్దంగా మిల్లు నడపటం సరైంది కాదని, 15 రోజుల్లో అన్నీ నివారణ చర్యలు తీసుకోవాలని మిల్లు యజమాని చెప్పి కాలుష్య బాధితులను శాంతపరిచి అక్కడనుండి పంపించారు. ఈ కార్యక్రమంలో శ్రీమన్నారాయణ, నాగేశ్వరరావు, ఆంజనేయులు, లాలయ్య, నరసింహ, శంకర్ రావు, బుజ్జి పాల్గొన్నారు.