Rishabh Pant : కారు యాక్సిడెంట్లో గాయపడిన భారత జట్టు వికెట్కీపర్ రిషభ్ పంత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విషయం తెలిసిందే. ఈమధ్యే సోషల్మీడియాలో కర్రల సాయంతో నడుస్తున్న ఫొటో షేర్ చేసిన అతను తొలిసారి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. యాక్సిడెంట్ అనంతరం తాను జీవితాన్ని ఆస్వాదిస్తున్న తీరే మారిపోయిందని, జీవితాన్ని కొత్తగా చూస్తున్నానని పంత్ చెప్పుకొచ్చాడు. ‘యాక్సిడెంట్ తర్వాత పళ్లు తోముకోవడం, ఎండలో కూర్చోవడం వంటి చిన్న చిన్న పనులు సొంతంగా చేసుకున్నందుకు చాలా సంతోషించాన’ని ఈ వికెట్కీపర్ తెలిపాడు.
అంతేకాదు తాను త్వరలోనే మైదానంలోకి దిగుతానని, తన మార్క్ షాట్లతో అభిమానులను అలరిస్తానని పంత్ వెల్లడించాడు. ‘ఇప్పుడు నేను మెరుగ్గా ఉన్నా. చక్కగా కోలుకుంటున్నా. దేవుడి దయ, వైద్యబృందం సాయంతో మరికొద్ది రోజుల్లో ఫిట్గా అవుతాను. నా విషయంలో అంతా మంచి జరిగిందా? లేదా చెడు జరిగిందా? అనేది చెప్పడం చాలా కష్టం’ అని పంత్ వివరించాడు.
‘సర్జరీ అనంతంర నా రొటీన్ పూర్తిగా మారిపోయింది. రోజూ షెడ్యూల్ ప్రకారం రోజూవారీ పనులు చేస్తున్నా. రోజుకు మూడుసార్లు ఫిజియోథెరపీ చేయించుకుంటున్నా ఉదయాన్నే లేచిన తర్వాత మొదటి ఫిజియోథెరపీ సెషన్ తీసుకుంటున్నా. ఆ తర్వాత కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని రెండో సెషన్కు సిద్ధమవుతున్నా. ఎంత నొప్పిని భరించగలను? అనే దాన్ని బట్టి ఫిజియోథెరపీ చేయించుకుంటున్నా. సాయంత్రం పూట మరొక సెషన్ ఉంటుంది. వైద్యులు సూచించిన పండ్లు, పానీయాలు తీసుకుంటున్నా’ అని పంత్ వెల్లడించాడు.
పోయిన ఏడాది డిసెంబర్ 30న ఉదయం 5 గంటల సమయంలో పంత్ కారు యాక్సిడెంట్కు గురైన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందిన అతడికి ముంబైలోని కోకిలా బెన్ హాస్పత్రిలో సర్జరీ అయింది. దాంతో, పంత్ కోలుకునేందుకు మరింత సమయం పట్టనుంది. ఈ ఏడాది అతను క్రికెట్ ఆడే అవకాశం చాలా తక్కువ. ఇప్పటికే ఈ స్టార్ ప్లేయర్ బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ, ఐపీఎల్ 2023కు దూరం అయ్యాడు. అతని ప్లేస్లో ఆస్ట్రేలియా సిరీస్కు కేఎస్ భరత్, ఇషాన్ కిషన్లను బీసీసీఐ ఎంపిక చేసింది.
ఈఏడాది ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ వంటి మెగా టోర్నమెంట్లు ఉన్నాయి. ఆలోపు పంత్ పూర్తిగా కోలుకుంటాడా? ఫిట్నెస్ సాధిస్తాడా? అనేది ఇప్పుడే చెప్పలేం. ఎటాకింగ్ గేమ్ ఆడే పంత్ లాంటి హిట్టర్ లేకపోవడం భారత జట్టుకు పెద్ద లోటే. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సిరీస్లో పంత్ ఎంతలా చెలరేగి ఆడాడో అందరికి తెలిసిందే.