New Zealand Test | టెస్టు క్రికెట్ అంటే బోరింగ్.. సుదీర్ఘ ఫార్మాట్కు ఇక కాలం చెల్లినట్లే.. ఐదు రోజుల ఆటను ఎవురు చూస్తారు.. అనే వాళ్లకు న్యూజిలాండ్ జట్టు గట్టి జవాబిచ్చింది. బజ్ బాల్ క్రికెట్తో పట్టపగ్గాలు లేకుండా దూసుకెళ్తున్న ఇంగ్లండ్ జట్టుకు.. సొంతగడ్డపై కివీస్ ముకుతాడు వేసింది. అతి విశ్వాసానికి, ఆత్మవిశ్వాసానికి మధ్య సన్నని గీత ఉంటుందని.. ఇంగ్లిష్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్కు గుర్తుచేసింది. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో ఫాలోఆన్ నుంచి కోలుకొని విజయం సాధించిన మూడో జట్టుగా రికార్డుల్లోకెక్కింది. గతంలో ఇంగ్లండ్, భారత్ మాత్రమే ఈ ఘనత సాధించగా.. ఇప్పుడా జాబితాలో న్యూజిలాండ్ చోటు దక్కించుకుంది. 146 ఏండ్ల సంప్రదాయ క్రికెట్లో ఓ జట్టు 1 పరుగు తేడాతో టెస్టు మ్యాచ్ గెలువడం ఇది రెండోసారి మాత్రమే కావడం మరో విశేషం!
వెల్లింగ్టన్: పోరాటానికి మారుపేరైన న్యూజిలాండ్ టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్ నమోదు చేసింది. ఇంగ్లండ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా మంగళవారం ముగిసిన రెండో టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ అద్వితీయ విజయం సాధించింది. క్రీడాభిమానులకు పసందైన విందు పంచిన పోరులో కివీస్ ఒక పరుగు తేడాతో ఇంగ్లిష్ జట్టును చిత్తు చేసింది.
ఐదు రోజుల పాటు ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో ఇంగ్లండ్ 435/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన న్యూజిలాండ్ 209 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారీ ఆధిక్యం మూటగట్టుకున్న ఇంగ్లండ్.. ప్రత్యర్థిని ఫాలోఆన్కు ఆహ్వానించింది. ఇక్కడే అద్భుతం ఆవిష్కృతమైంది. తొలి ఇన్నింగ్స్లో తేలిపోయిన కివీస్ టాపార్డర్.. ఈసారి బలంగా పోరాడింది. మాజీ సారథి కేన్ విలియమ్సన్ జట్టును ముందుండి నడపగా.. మిగిలినవాళ్లు చక్కటి ప్రదర్శన కనబర్చారు. ఫలితంగా న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 483 పరుగులు చేసింది.
ఇక 258 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. చివరకు 256 పరుగులు చేసి ఆలౌటైంది. మాజీ కెప్టెన్ జో రూట్ ( 113 బంతుల్లో 95; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయగా.. బెన్ స్టోక్స్ (116 బంతుల్లో 33; 6 ఫోర్లు), బెన్ ఫోక్స్ (35), బెన్ డకెట్ (33), క్రాలీ (24) పర్వాలేదనిపించారు. న్యూజిలాండ్ బౌలర్లలో బౌన్సర్లతో బెంబేలెత్తించిన నీల్ వాగ్నర్ 4, కెప్టెన్ టిమ్ సౌథీ 3 వికెట్లు పడగొట్టారు. క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్ చేస్తూ రెండో ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగిన కేన్ విలియమ్సన్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కగా.. ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు సొంతం చేసుకున్నాడు. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ 1-1తో సమమైంది.
-టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ జట్టు ఒక పరుగు తేడాతో విజయం సాధించడం ఇది రెండోసారి మాత్రమే. గతంలో 1993లో అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ పరుగు తేడాతో గెలుపొందింది.
-ఫాలోఆన్లో పడిన జట్టు టెస్టు నెగ్గడం 146 ఏండ్ల క్రికెట్ చరిత్రలో ఇది నాలుగోసారి మాత్రమే. గత మూడు సందర్భాల్లోనూ ప్రత్యర్థి ఆస్ట్రేలియానే కావడం మరో విశేషం. 1894 సిడ్నీ టెస్టులో ఫాలోఆన్ నుంచి బయటపడి కంగారూలను చిత్తుచేసిన ఇంగ్లండ్.. 1981 లీడ్స్లో సేమ్ సీన్ రిపీట్ చేసింది. ఇక ఆ తర్వాత భారత జట్టు 2001 కోల్కతా టెస్టులో ఫాలోఆన్ ఆడి ఆసీస్ను ఓడించిన విషయం తెలిసిందే.
అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా రారాజుగా వెలుగొందుతున్న దశలో.. ఆ జట్టుకు టీమిండియా భారీ షాక్ ఇచ్చింది. వేదికతో సంబంధం లేకుండా.. ప్రత్యర్థి ఎవరైనా లెక్కచేయకుండా.. తమకు తిరుగులేదని విర్రవీగుతున్న కంగారూలను గంగూలీ సేన నేలకు దించింది. 2001 పర్యటనలో భాగంగా భారత్లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా.. మూడు మ్యాచ్ల సిరీస్లో తొలి టెస్టు నెగ్గి కోల్కతా టెస్టుకు రెడీ అయింది.
ఈడెన్ గార్డెన్స్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 445 పరుగులు చేసింది. అప్పటి కంగారూ కెప్టెన్ స్టీవ్ వా (110) సెంచరీతో చెలరేగగా.. హెడెన్ (97), లాంగర్ (58), సాల్టర్ (42), గెలెస్పి (46) రాణించారు. భారత బౌలర్లలో హర్భజన్ సింగ్ హ్యాట్రిక్ సహా ఏడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 171 పరుగులకే కుప్పకూలింది.
వీవీఎస్ లక్ష్మణ్ (59) టాప్ స్కోరర్ కాగా.. శివ్ సుందర్ దాస్ (20), శడగోపన్ రమేశ్ (0), రాహుల్ ద్రవిడ్ (25), సచిన్ టెండూల్కర్ (10), సౌరవ్ గంగూలీ (23), నయన్ మోంగియా (2) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో గ్లెన్ మెక్గ్రాత్ 4, గెలెస్పీ, వార్న్, కాస్పోవిచ్ తలా రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. తొలి ఇన్నింగ్స్లో 274 పరుగుల ఆధిక్యం దక్కడంతో మరో ఆలోచన లేకుండా.. ఆసీస్ కెప్టెన్ స్టీవ్వా.. టీమిండియాను ఫాలోఆన్ ఆడేందుకు ఆహ్వానించాడు.
అక్కడే భారత క్రికెట్ చరిత్రకు కొత్త పునాది పడినైట్లెంది. తొలి ఇన్నింగ్స్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన మనవాళ్లు.. రెండో ఇన్నింగ్స్లో గొప్ప పోరాట పటిమ కనబర్చారు. వీవీఎస్ లక్ష్మణ్ (452 బంతుల్లో 281; 44 ఫోర్లు) భారీ డబుల్సెంచరీతో కదంతొక్కగా.. రాహుల్ ద్రవిడ్ (353 బంతుల్లో 180; 20 ఫోర్లు) వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి ధాటితో భారత్ 657/7 వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. అప్పటి వరకు భారత క్రికెట్ చరిత్రలో లక్ష్మణ్దే అత్యధిక స్కోరు కావడం విశేషం.
భారత బ్యాటర్ల జోరుతో బేజారైన ఆసీస్ కెప్టెన్ స్టీవ్వా.. 9 మంది బౌలర్లతో బౌలింగ్ చేయించినా ఫలితం లేకపోయింది. అనంతరం 384 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 212 పరుగులకు ఆలౌటైంది. హెడెన్ (67) టాప్ స్కోరర్ కాగా.. హర్భజన్ 6 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. దీంతో భారత చరిత్ర తిరగరాసింది.
ఇక అక్కడి నుంచి ప్రారంభమైన టీమ్ఇండియా జైత్రయాత్ర ఇప్పటి వరకు అదే రేంజ్లో కొనసాగుతోంది. టీమ్ఇండియా ప్రదర్శన.. ఫాలోఆన్ ఇచ్చే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునేలా చేసిందని మ్యాచ్ అనంతరం ఆసీస్ సారథి స్టీవ్వా పేర్కొనడం గమనార్హం.