Rohit Sharma: సుమారు ఏడాదిన్నర తర్వాత టీ20 క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా సారథి రోహిత్ శర్మ.. ఈ ఏడాది జూన్లో జరుగనున్న టీ20 వరల్డ్ కప్లో కచ్చితంగా ఆడాలనే పట్టుదలతో ఉన్నా అతడి ఫామ్ మాత్రం ఆందోళనగా ఉంది. అఫ్గానిస్తాన్తో తొలి టీ20లో గిల్ తప్పిదంతో రనౌట్ అయిన రోహిత్.. రెండో మ్యాచ్లో ఫజల్హక్ ఫరూఖీ వేసిన తొలి ఓవర్లోనే ముందుకొచ్చి ఆడబోయి బంతి మిస్ కావడంతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రెండు మ్యాచ్లలోనూ డకౌట్ అవడంతో రోహిత్ ఫామ్పై అతడి ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే రోహిత్కు టీ20 వరల్డ్ కప్లో చోటు దక్కుతుందా..? అనేది అనుమానంగానే మారింది.
2022 నవంబర్లో ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన టీ20 వరల్డ్ కప్ సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో టీ20లకు దూరమైన హిట్మ్యాన్.. అప్పట్నుంచీ పొట్టి క్రికెట్ ఫార్మాట్కు దూరంగా ఉన్నాడు. దీంతో సెలక్టర్లు హార్ధిక్ పాండ్యాను సారథిగా ప్రమోట్ చేశారు. హార్ధిక్ సారథ్యంలో యువ భారత్ అద్భుత విజయాలతో దూసుకుపోతోంది. యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, శివమ్ దూబే, తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్లు అంచనాలకు మించి రాణిస్తున్నారు. దీంతో సెలక్టర్లు ఈ యువ భారత్కు హార్ధిక్ను సారథిగా కొనసాగిస్తూ వచ్చే టీ20 వరల్డ్ కప్లో అతడి హయాంలోనే బరిలోకి దించాలని భావించారు. అయితే వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓడిన నేపథ్యంలో సెలక్టర్లు.. రోహిత్, కోహ్లీలకు ఆఖరి అవకాశమిచ్చారు.
Rohit Sharma has won most T20I series as a captain for India. ⭐
– Captain Rohit. 🇮🇳 pic.twitter.com/xbYWh3S9p0
— Johns. (@CricCrazyJohns) January 14, 2024
జూన్లో జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్ కప్కు ముందు భారత్ ఆడనున్న ఆఖరి పొట్టి సిరీస్ ఇదే. ఈ నేపథ్యంలో రోహిత్కు ఈ సిరీస్ కీలకమని క్రికెట్ విశ్లేషకులు భావించినా హిట్మ్యాన్ మాత్రం రెండు మ్యాచ్లలోనూ నిరాశపరిచాడు. ఈనెల 17న బెంగళూరు వేదికగా చివరి మ్యాచ్లో అయినా రోహిత్ రాణించాల్సి ఉంది. ఈ సిరీస్ ముగిశాక భారత్ ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఐపీఎల్ మొదలవనుంది. ఐపీఎల్లో రోహిత్ ఫామ్ను బట్టి టీ20 వరల్డ్ కప్లో రోహిత్ ను ఆడించాలా..? లేదా..? అనేది సెలక్టర్లు తుది నిర్ణయం తీసుకునే అవకాశముంటుంది.