ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలి
జడ్పీ సర్వసభ్య సమావేశంలో చైర్పర్సన్ కోవ లక్ష్మి
హాజరైన కలెక్టర్ రాహుల్రాజ్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు
సమస్యలపై తక్షణమే స్పందించాలని ఆదేశాలు
ఆసిఫాబాద్, ఏప్రిల్ 3 : జిల్లా అభివృద్ధిలో పోటీపడాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి సూచించారు. సమన్వయంతో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని వొడ్డపల్లి గార్డెన్లో శనివారం ఆమె అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కలెక్టర్ రాహుల్రాజ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, డీఎఫ్వో శాంతారాం, జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. వేసవిని దృష్టిలో పెట్టుకొని బోరుబావులకు మరమ్మతులు చేయించాలని డీపీవోను ఆదేశించారు. కుమ్రం భీం చౌక్ నుంచి ఆదిలాబాద్ క్రాస్రోడ్డు వరకు డివైడర్ల కోసం నివేదికలు తయారుచేయాలని సూచించారు. జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న గుండి గ్రామానికి వంతెన నిర్మాణంలో అధికారుల అలసత్వం ఎక్కువగా ఉన్నదన్నారు. త్వరగా టెండర్ ప్రక్రియ పూర్తిచేసి, పనులు ప్రారంభించాలని పీఆర్ఈఈని ఆదేశించారు. కెరమెరి-శంకర్లొద్ది రోడ్డు నిర్మాణం పూర్తిచేయాలన్నారు. జడ్పీ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని కలెక్టర్ను కోరారు. స్థానిక సంస్థల బలోపేతానికి బడ్జెట్లో జిల్లా పరిషత్కు రూ.10 కోట్లు, మండల పరిషత్కు రూ.1కోటి కేటాయించడంపై సభలో సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో 998 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి పీఎంవై కింద మంజూరు కోసం తీర్మానించినట్లు తెలిపారు. ఎనీఈజీఎస్ జిల్లా అభివృద్ధి కోసం రూ.266 కోట్లు అవసరం ఉన్నట్లు తీర్మానించామన్నారు.
పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ రాహుల్రాజ్
అనంతరం కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. వానకాలం సమీపించేలోగా వంతెనలు, రోడ్డు నిర్మాణాలు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అత్యవసరమైన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలన్నారు. ప్రభుత్వ స్థలాలను గుర్తించి, ఫెన్షింగ్ వేస్తామన్నారు. కలెక్టరేట్ నూతన భవనం ఎప్పుడు పూర్తిచేస్తారని ఆర్అండ్బీ ఈఈని ప్రశ్నించారు. అన్ని పీహెచ్సీల్లో బయోమెట్రిక్ను అమలు చేయాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు.
నీటి సమస్య లేకుండా చూడాలి : ఎమ్మెల్యే సక్కు
ఆ తర్వాత ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడు తూ.. నియోజకవర్గ ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ ద్వారా నీరందని గ్రామాలకు ప్రత్యామ్నాయంగా చర్యలు తీసుకుంటున్నారా.. అని అధికారులను నిలదీశారు. లింగాపూర్, తిర్యాణి మండలాల్లోని కొన్ని గ్రామాలకు నీరు అందడంలేదని, వెంటనే తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి రికార్డు చేయడం లేదని, కొత్త పనులకు ఎస్టిమేషన్ వేయడంలో అలసత్వం చేస్తున్నారని మండిపడ్డారు.
సమస్యలను సభ దృష్టికి తెచ్చిన ప్రజాప్రతినిధులు..
ఈ సందర్భంగా ఆయా చోట్ల నెలకొన్న సమస్యలను ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తెచ్చారు. వాంకిడి మండలం నుంచి కాగజ్నగర్కు కనర్గాం మీదుగా వచ్చే రోడ్డు పనులు పూర్తయినప్పటికీ బ్రిడ్జి పనుల్లో జాప్యం జరుగుతున్నదని జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు అన్నారు. ఆసిఫాబాద్ ఎంపీపీ మల్లికార్జున్ మాట్లాడుతూ.. మండలంలోని 12 గ్రామాలకు తాగునీటి సమస్య ఉందని, పరిష్కరించాలని కోరారు. గుండి వంతెన, ఆసిఫాబాద్-తిర్యాణి రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరారు. రెబ్బెన జడ్పీటీసీ సంతోష్ మాట్లాడుతూ.. బుద్ధనగర్, తక్కలపల్లి తదితర గ్రామాల్లో నీటి సమస్య ఉన్నదన్నారు. సర్పంచ్లు అభివృద్ధి పనులు చేస్తే బిల్లుల మంజూరుకు ట్రెజరరీ, ఇతరశాఖల అధికారులు పర్సెంటేజీలు అడుగుతున్నారని డీపీవోకు తెలిపారు. వెంచర్లు వేస్తున్న వారి భూములకు కొలతలు పెట్టేందుకు వస్తున్న అధికారులు, ప్రజల భూముల కొలతల్లో అలసత్వం వహిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రెబ్బెనలోని ప్రభుత్వ స్థలంలో క్రీడామైదానం ఏర్పాటు చేయాలని కోరారు. వాంకిడి జడ్పీటీసీ అజయ్ మాట్లాడుతూ.. మండలంలోని గోయడం పంచాయతీ పరిధిలోని గణేశ్పూర్ వారసంత పశువుల అక్రమ రవాణాకు అడ్డాగా మారిందని, అడ్డుకోవాలని కలెక్టర్, డీపీవోను కోరారు. ఖీర్డి గ్రామానికి రోడ్డు మంజూరు చేయాలన్నారు. రెబ్బెన ఎంపీపీ సౌందర్య మాట్లాడుతూ.. పీహెచ్సీలో వైద్యుడు అందుబాటులో ఉండడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి శాంతారాం, జడ్పీ సీఈవో సాయా గౌడ్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చూడండి..
ముంబైలో బస్సులు నడిపే సిబ్బందికి నాణేల్లో జీతం
ఫిక్స్డ్ డిపాజిట్లపై టీడీఎస్.. ఎలా నివారించుకోవాలంటే..?