IND vs RSA : దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు(Team India) రెండో సిరీస్కు సిద్దమవుతోంది. పొట్టి సిరీస్ను సమం చేసిన టీమిండియా ఆదివారం జొయన్నెస్బర్గ్(Johannesburg)లో సఫారీలతో తొలి వన్డే ఆడనుంది. వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023)లో ప్రొటిస్ జట్టును చిత్తుగా ఓడించిన భారత్.. మర్క్రమ్ సేనకు స్వదేశంలో మరోసారి ఓటమిని రుచి చూపించాలనే కసితో ఉంది. కానీ, సొంతగడ్డపై దక్షిణాఫ్రికాను తేలిగ్గా తీసుకోవడానికి లేదు.
ఎందుకంటే… నిరుడు జనవరిలో మూడు వన్డేల సిరీస్ను తెంబా బవుమా(Temba Bavuma) సారథ్యంలోని దక్షిణాఫ్రికా 3-0తో క్వీన్స్లీప్ చేసింది. ఈసారి ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. కానీ, స్వదేశంలో భారత్పై సఫారీలకు మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటిరకూ జరిగిన 37 వన్డేల్లో దక్షిణాఫ్రికా 25 విజయాలు సాధించగా.. భారత్ మాత్రం 10 మ్యాచుల్లో గెలిచిందంతే.
వన్డే సిరీస్ ట్రోఫీతో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు
ఇప్పటి వరకూ భారత్, దక్షిణాఫ్రికా 91 వన్డేల్లో తలపడ్డాయి. వాటిలో సఫారీ జట్టు 50 మ్యాచుల్లో గెలిస్తే.. భారత్ మాత్రం 38 విజయాలకే పరిమితమైంది. మరో మూడు మ్యాచుల్లో ఫలితం తేలలేదు. నిరుడు అక్టోబర్లో సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను భారత్ 2-1తో ఛేజిక్కించుకుంది.
వరల్డ్ కప్లో సఫారీలను ఓడించిన రోహిత్ సేన
ఇక ఈ మధ్యే ముగిసిన వన్డే వరల్డ్ కప్లో టీమిండియా సఫారీలను 243 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఈడెన్ గార్డెన్స్(Eden Gardens)లో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీతో కదం తొక్కగా.. రవీంద్ర జడేజా 5 వికెట్లతో విజృంభించాడు. దాంతో తెంబా బవుమా బృందం 83 పరుగులకే కుప్పకూలింది.
తొలి వన్డేలో భారత జట్టు సీనియర్లు లేకుండానే బరిలోకి దిగుతుంది. అయితే.. సఫారీ గడ్డపై ఆడిన అనుభవం ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, పేసర్ షమీ, బుమ్రాలు జట్టులో లేరు. పైగా రాహుల్ ద్రవిడ్ బృందం స్థానంలో కొత్త కోచింగ్ సిబ్బంది సలహాలు ఇవ్వనున్నారు. దాంతో, కేఎల్ రాహుల్ సారథ్యంలోని యువ భారత్ ఏమేరకు రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మధ్యాహ్నం 1ః30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.