Sundar Pichai : గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ 2023 ఆరంభంలో ఏకంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది. అప్పట్లో నెలకొన్న మాంద్యం భయాల నేపథ్యంలో టెక్ దిగ్గజం తీసుకున్న నిర్ణయం మొత్తం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళనలను, అలజడులను రేకెత్తించింది. దీనిపై తాజాగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తాము అప్పుడు అలా చేసి ఉండాల్సింది కాదని అన్నారు. నాడు తాము తీసుకున్న నిర్ణయం తప్పేనని అంగీకరించారు. అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఆ పనిచేయక తప్పలేదని, అయితే మరోలా వ్యవహరిస్తే బాగుండేదని అన్నారు.
బిజినెస్ ఇన్సైడర్ ప్రచురించిన కథనం ప్రకారం.. సీఈవో సుందర్ పిచాయ్ ఇటీవల ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో భారీగా ఎత్తున ఉద్యోగులను తొలగించడం ద్వారా మీరు ఏం సాధించారని ఓ ఉద్యోగి ప్రశ్నించారు. అందుకు పిచాయ్ సమాధానం ఇస్తూ.. అది తప్పేనని అంగీకరించారు. కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా తప్పలేదని చెప్పారు. గూగుల్ తన 25 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ అంత క్లిష్టమైన క్షణాలను ఎదుర్కోలేదని తెలిపారు.
అప్పుడు తాము ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే అది మరింత ప్రతికూల ఫలితాలకు దారితీసేదని పిచాయ్ చెప్పారు. అయితే నాటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఉద్యోగుల తొలగింపు మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తే బాగుండేదంటూ పశ్చాతాపం వ్యక్తంచేశారు. నాటి తొలగింపులు ఉద్యోగుల మానసిక స్థైర్యంపై చాలా ప్రభావం చూపించాయని, ‘గూగుల్జీస్ట్’ లాంటి ఉద్యోగుల ఫీడ్బ్యాక్ ఛానెల్లలో అది స్పష్టంగా కనిపించిందని అన్నారు.