ఇంగ్లండ్ పర్యటన తర్వాత భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ సిరీస్లో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీనిపై మాజీ లెజెండ్, ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఇలా సిరీస్, సిరీస్ మధ్యలో సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడంపై కొందరు క్రీడాభిమానులు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకుముందు జరిగిన సౌతాఫ్రికా సిరీస్లో కూడా రోహిత్, విరాట్, బుమ్రా వంటి సీనియర్లు ఆడలేదు. కరోనా కారణంగా ఇంగ్లండ్తో టెస్టుకు కూడా రోహిత్ దూరమయ్యాడు. ఇప్పుడు అదే జట్టుతో పరిమిత ఓవర్ల సిరీస్కు జట్టు సన్నద్ధం అవుతోంది. ఈ సిరీస్లో కూడా తొలి టీ20లో రోహిత్ మినహా సీనియర్లకు రెస్ట్ ఇవ్వడం జరిగింది.
అనంతరం వెస్టిండీస్ పర్యటనలో కూడా సీనియర్లు ఆడబోవడం లేదు. దీనిపై స్పందించిన ఇర్ఫాన్ పఠాన్.. ‘‘విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఎవరూ ఫామ్లోకి తిరిగి రాలేరు’’ అంటూ ట్వీట్ చేశాడు. ఐపీఎల్ తర్వాత ఇంగ్లండ్ పర్యటనలో బ్యాటు పట్టుకున్న కోహ్లీ.. పరుగులు పెద్దగా చెయ్యకపోయినా మంచి టచ్లో కనిపించాడు.
రెండు ఇన్నింగ్సుల్లోనూ దురదృష్టవశాత్తూ అవుటయ్యాడు. అలాంటి ఆటగాడిని ఆడిస్తుంటేనే త్వరగా ఫామ్లోకి వస్తాడని క్రీడాభిమానులు అంటున్నారు. రోహిత్ విషయంలోనూ ఇదే అభిప్రాయం వినపడుతోంది. కానీ బీసీసీఐ మాత్రం వాళ్లకు ప్రతిసారీ రెస్ట్ ఇస్తూ కుర్రాళ్లకు అవకాశాలు కల్పిస్తోంది.
No one comes back to form while resting…
— Irfan Pathan (@IrfanPathan) July 6, 2022