ఛండీగఢ్, మే 7: లోక్సభ ఎన్నికల వేళ హర్యానా రాజకీయాల్లో వేగంగా పరిణామాలు మారుతున్నాయి. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కష్టాల్లో పడింది. ఇంతకాలం బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల్లో ముగ్గురు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు హర్యానా గవర్నర్కు లేఖ రాశారు.
తాము లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్టు స్వతంత్ర ఎమ్మెల్యేలు సోంబిర్ సంగ్వాన్, రణ్ధీర్ గొల్లెన్, ధరమ్పాల్ గొండెర్ ప్రకటించారు. ఈ మేరకు వారు రోహ్తక్లో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హూడా, హర్యానా పీసీసీ అధ్యక్షుడు ఉదయ్ భాన్తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ సర్కార్ విఫలమైందని, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలు తీవ్రమయ్యాయని వీరు ఆరోపించారు.
పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేలు
2019లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 40 సీట్లు గెలుచుకుంది. 10 సీట్లు గెలిచిన జన్నాయక్ జనతా పార్టీ(జేజేపీ), ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఒక హర్యానా లోకిత్ పార్టీ ఎమ్మెల్యే మద్దతుతో ఆ పార్టీ అధికారం చేపట్టింది. ఎన్నికల సీట్ల పంపకాల్లో తేడాలు రావడంతో బీజేపీతో జేజేపీ తెగదెంపులు చేసుకుంది.
ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు సైతం బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్నారు. అయితే, 10 మంది జేజేపీ ఎమ్మెల్యేల్లో ఇద్దరు బీజేపీకి మద్దతు తెలిపారు. ప్రస్తుతం 88 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రభుత్వం కొనసాగాలంటే ప్రభుత్వానికి 45 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. 40 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు జేజేపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్రులు, ఒక హర్యానా లోకిత్ పార్టీ ఎమ్మెల్యే మద్దతు ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వానికి ఉంది.
ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి: కాంగ్రెస్
బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని, ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు నాయబ్ సింగ్ సైనీకి లేదని హర్యానా పీసీసీ అధ్యక్షుడు ఉదయ్ భాన్ తెలిపారు. వెంటనే ఆయన రాజీనామా చేయాలని, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాగా, బీజేపీ ప్రభుత్వాన్ని దింపేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. జేజేపీ సెక్రటరీ జనరల్ దిగ్విజయ్ సింగ్ చౌతాలా కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హూడాతో చర్యలు జరిపారు.