నీట్ పరీక్ష పత్రాల లీకేజీపై ఉవ్వెత్తున ఎగిసిన జెన్ జీ పోరాటాన్ని ముందుండి నడిపిన వాళ్ల కంటే రియా అనే అమ్మాయి తన సాహసంతో పాపులర్ అయింది! మనం పుస్తకాల్లో చదివింది పరీక్షల్లో రాసి మర్చిపోతాం. రియా అలా కాదు. పుస్తకాల్లో ఏం చదివిందో అదే బయట అమలు కావాలంటుంది. ‘అందుకే ముంబైలో పోలీసుల చట్ట విరుద్ధమైన అరెస్ట్ని ప్రశ్నించాను. వాళ్లు వినకుంటే ఎదిరించాను’ అంటుందామె. 27 ఏండ్ల రియా మాడల్గా, నటిగా, ఆంత్రప్రెన్యూర్గా రాణిస్తున్నది. ముంబైలోని దాదర్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులకు భయపడి ఎవరూ అరెస్టులను ప్రతిఘటించలేదు. పోలీసుల తీరుని నిరసిస్తూ నినాదాలు చేస్తూ, వీడియోలు తీస్తూ ఉండిపోయారు. ఆ జనంలోంచి హఠాత్తుగా పోలీసుల వైపు దూసుకుపోయింది రియా. ‘మీ దగ్గర అరెస్ట్కు ఆదేశాలు ఉన్నాయా? ఆర్డర్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు?’ అంటూ ప్రశ్నించింది. రియా అడిగిన ప్రశ్నకు పోలీసుల నుంచి సమాధానం లేదు. పోలీస్ వ్యాన్ కదలబోతుంటే వెంటనే ముందు నిలుచుని నిలువరించింది. 40 నిమిషాల పాటు పోలీసుల్ని ముందడుగు వేయకుండా అడ్డు నిలిచింది రియా.
ప్రాణాలకు తెగించిన రియాను చూసి ఆందోళనాకారులు పోలీస్ వ్యాన్ని ముట్టడించారు. విద్యార్థుల్ని విడిపించుకున్నారు. రియా ఒంటి చేత్తో పోలీసు వ్యాన్ని నిలువరించిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ మరుసటి రోజు నుంచి విద్యార్థులు పోలీసుల్ని ‘నేమ్ ప్లేట్ ఏది? నువ్వు ఎవరు? పోలీసువేనా?’ అంటూ జంతర్ మంతర్లో ప్రశ్నించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘పోలీసులు అరెస్ట్ చేస్తే’ పుస్తకం నిన్నటి తరాన్ని మేల్కొలిపితే, జంతర్ మంతర్ దగ్గర జెన్ జీ వీడియోలు నేటి సమాజాన్ని మేల్కొలిపాయి. ఇప్పుడు పోలీసులు రోడ్డు మీద వాహనాలు ఆపి డబ్బులు అడిగితే..
‘నీ నేమ్ ప్లేట్ ఏది?’ అని అడుగుతున్నారు. ధైర్యంగా వీడియోలు తీసి ప్రజల ముందు పెడుతున్నారు. కామారెడ్డి జిల్లా, సలాబత్పూర్లో చెక్ పోస్ట్ దగ్గర ఆపిన పోలీసుల్ని లారీ డ్రైవర్ ప్రశ్నించిన వీడియో వైరల్ కావడమే కాదు తెలంగాణ అధికారుల్నీ కదిలించింది. జంతర్ మంతర్లో జెన్ జీ దెబ్బ ఢిల్లీ ప్రభుత్వానికే కాదు మన ప్రభుత్వాలకు, అధికారులకు కూడా తగులుతున్నది.