హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): రైతుబంధుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుట్ర చేసిండని, రాష్ట్రంలో ఇక రైతుబంధు కథ వొడ్సినట్టేనని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో డబ్బులు వేస్తామని చెప్పి మళ్లీ ఆయనే ఎన్నికల కమిషన్కు చెప్పి బ్యాన్ చేయించిండని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. బస్సుయాత్రల్లో భాగంగా కామారెడ్డి, మెదక్లో నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 9వ తారీఖు లోపల రైతుబంధు వేస్తామని ముఖ్యమంత్రి చెప్పాడని, మరి అందరికీ వచ్చిందా? అని ప్రశ్నించగా రాలేదని ప్రజలు సమాధానం చెప్పారు. స్పందించిన కేసీఆర్ ‘ఇక రైతుబంధు రాదు. ముఖ్యమంత్రే కుట్రచేసి ఎలక్షన్ కమిషన్కు తెలియజేసి, దాన్ని మళ్లీ ఆయనే బ్యాన్ చేసిండు. అందుకే రైతుబంధు రాదు. దాని కథ ఒడ్సిపోయింది’ అని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత మిగతా రైతులకు వేస్తామని చెప్తున్నారని, వారు ఏం తప్పు చేశారని, రైతుబంధును ఎందుకు ముంచుతుండ్రని ప్రశ్నించారు. తాము రూ.15 వేలు వేస్తామని చెప్పి ఇప్పుడు పాత రైతుబంధు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. పంటలు కోసే టైం వచ్చినా రైతుబంధు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి రూ. 30 వేల కోట్ల రుణాలను మాఫీ చేశామని గుర్తుచేశారు. సీఎం రేవంత్ డిసెంబర్ 9న రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పాడని, మరి చేశాడా? అని ప్రశ్నించగా ‘లేదు’ అని ప్రజలు బదులిచ్చారు.
రాష్ర్టాన్ని సాధించుకొని వ్యవసాయాన్ని బాగుచేసుకున్నామని, వృద్ధులకు రూ. 2 వేల పింఛన్ ఇచ్చామని, బీడీ కార్మికులకు కూడా ఇచ్చామని కేసీఆర్ గుర్తుచేశారు. తామిచ్చిన కరెంటు పోయిందని, తాగునీళ్లు పోయాయని, రైతుబంధు పోయిందని పేర్కొన్న కేసీఆర్.. రైతుబీమా కూడా ఉంటదో, పోతదో తెల్వదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇస్తామన్న నిరుద్యోగ భృతి, యువవికాసం పేరుతో రూ. 5 లక్షలతో బ్యాంకుకార్డు ఎక్కడైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు దవాఖానల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ. 2 వేల పింఛన్ను రూ. 4 వేలు చేస్తామన్నారని, జనవరి నెల పింఛను కూడా ఇవ్వకుండా మోసం చేశారని కేసీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో పరిశ్రమలు, ఐటీరంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చామని చెప్పారు. ఇప్పుడు కరెంటు కోతలు వల్ల పెట్టుబడులు అన్నీ వాపస్ పోయే పరిస్థితి ఏర్పడిందని, రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టే పరిశ్రమ చెన్నైకి తరలిపోయిందని తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో కామారెడ్డి చాలా చైతన్యవంతంగా వ్యవహరించిందని, బ్రహ్మాండంగా పోరాటం చేసిన గడ్డ అని కేసీఆర్ కొనియాడారు. కామారెడ్డి పట్టణంలో పోలీసు కిష్టయ్య పిస్టల్తో కాల్చుకొని అమరుడయ్యాడని గుర్తుచేశారు. ‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కామారెడ్డి జిల్లాను తీసేస్తానంటుండు. మీ ఇష్టం. కాపాడుకుంటరా? పోగొట్టుకుంటరా?’ అని ప్రశ్నించగానే ‘కాపాడుకుంటాం.. కాపాడుకుంటాం’ అని కామారెడ్డి ప్రజలు నినదించారు.‘కామారెడ్డి జిల్లాగా ఉండాలంటే ఈ ఎన్నికల్లో గాలి అనిల్కుమార్ గెలవాలని, మనవాళ్ల అయితే పార్లమెంట్లో పేగులు తెగేదాకా మన భవిష్యత్ కోసం కొట్లాడతారని పేర్కొన్నారు.
‘నేను ఇదే జిల్లా బిడ్డను. మీకోసం ఎంత పనిచేశానో తెలుసు. మెదక్ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేశామో తెలుసు’ అని కేసీఆర్ తెలిపారు. ‘నేను కూడా ఉమ్మడి జిల్లాలో పుట్టినవాడినే. మెదక్ ప్రత్యేక జిల్లా కావాలని ఎప్పటి నుంచో కోరిక ఉన్నది కాబట్టి ప్రత్యేక జిల్లా చేసుకున్నం. ఇక్కడ మెడికల్ కాలేజీ తెచ్చుకున్నం. రామాయంపేట డివిజన్ తెచ్చుకున్నం’ అని పేర్కొన్నారు. జిల్లాలు తీసేస్తానని సీఎం అంటున్నారని, అందులో మెదక్ జిల్లా కూడా ఉన్నదని అంటున్నారని చెప్పారు. ‘మెదక్ జిల్లా ఉండాల్నా? పోవాల్నా?’ అని అడగ్గానే ‘ఉండాలె’ అంటూ పెద్ద ఎత్తున జనం స్పందించారు. మెదక్ జిల్లా ఉండాలంటే పార్లమెంట్ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి గెలవాలని కేసీఆర్ పేర్కొన్నారు. వెంకట్రామిరెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అని, ఇదే జిల్లాలో పనిచేశారని గుర్తుచేశారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు వందకు వందశాతం అబద్ధాలు మాట్లాడతారని విమర్శించారు. దుబ్బాకలో అసెంబ్లీకే చెల్లని రూపాయి మెదక్ పార్లమెంట్లో చెల్లుతదా? అని ప్రశ్నించారు. డిపాజిట్లు దక్కకుండా తుక్కుతుక్కుగా ఓడగొట్టాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్, టీడీపీ హయాంలో ఘనపురం ఆనకట్టను ఎలా నాశనం చేశారో అందరికీ తెలుసని కేసీఆర్ తెలిపారు. దాదాపు రూ.150 కోట్లతో ఘనపురం ఆనకట్టను బాగుచేసి, ఎత్తుపెంచి ప్రజలకు అందించామని గుర్తుచేశారు. మెదక్కు 100 పడకల దవాఖాన తెచ్చిపెటామని పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఎమ్మెల్యే దానిని 50 పడకలకు కుదించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏడుపాయల దుర్గాభవానీ జాతర బ్రహ్మాండంగా జరగాలని రూ.100 కోట్లు మంజూరు చేస్తే దానిని కూడా వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. మెదక్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.50 కోట్లు, రామాయంపేట మున్సిపాలిటీ కోసం రూ.25 కోట్లు మంజూరు చేస్తే రద్దు చేశారని మండిపడ్డారు. కొత్త హామీలు అమలు చేయకపోగా, పాత ప్రభుత్వంలో చేసిన మంజూరీలను కూడా రద్దు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. హరీశ్రావు నీటిపారుదలశాఖ మంత్రిగా ఉన్నప్పుడే హల్దీవాగును మల్లన్నసాగర్కు లింక్ చేసుకున్నామని, వాగుపై బోలెడు చెక్ డ్యాంలు కట్టుకున్నామని తెలిపారు. కాళేశ్వరం నీళ్లతో కలుపుకొని ఎప్పుడూ మంజీరనదిగానీ, హల్దీవాగుగానీ ఎండిపోకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇప్పుడు దాన్ని మునగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
పదేండ్లుగా ప్రధానిగా ఉన్న నరేంద్రమోదీ 150కిగాపై హామీలు ఇచ్చినా ఒక్కటి కూడా నెరవేరలేదని కేసీఆర్ విమర్శించారు. ‘దేశం పూర్తిగా దెబ్బతిన్నది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి విలువ 84 రూపాయిలైంది. ఎగుమతులు బందయ్యాయి. దిగుమతులు పెరిగాయి. దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చేదిన్ రాలేదు కానీ, సచ్చేదిన్ గ్యారెంటీగా వచ్చిందని ఎద్దేవా చేశారు. ‘భారతదేశం మొత్తం జన్ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తే, కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యేను గెలిపించిన మీకు మోదీ రూ.30 లక్షలు వేసిండ్రటగదా? నిజమేనా? వచ్చినయా?’ అని కేసీఆర్ ప్రశ్నించగా లేదని ఖాళీ చేతులు ఊపుకుంటూ సమాధానం చెప్పారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని మోదీ అన్నారని, మరి అయిందా? అని ప్రశ్నించారు. అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్ఠ మంటగలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మనకు రావల్సిన నవోదయ స్కూళ్లు, మెడికల్ కాలేజీలు రాలేదని తెలిపారు. మన సీలేరు విద్యుత్ ప్రాజెక్టును, ఏడు మండలాలను ఆంధ్రాకు అప్పగించారని మండిపడ్డారు.
‘కేసీఆర్ కల్యాణ లక్ష్మికి లక్ష రూపాయలే ఇస్తున్నడు, మేం తులం బంగారం కలిపి ఇస్తామన్నడు. ఎక్కడైనా వచ్చిందా తులం బంగారం’ అని కేసీఆర్ ప్రశ్నించగా.. ‘రాలేదు.. రాలేదు’ అని ప్రజలు ప్రతిస్పందించారు.‘కామారెడ్డిలో పొలాలు బాగా ఎండినయని అన్నారు. నిజమేనా?’ అని అడిగితే దానికి కూడా అవునంటూ సమాధానం వచ్చింది. ‘ఏమైంది కరెంటుకు? కేసీఆర్ ఉన్నప్పుడు 9 ఏండ్లు రెప్పపాటున కూడా కరెంటు పోకుండా వచ్చింది. ఇప్పుడు ఏం మాయ రోగం వచ్చింది? మన కరెంటు ఎక్కడికి పోయింది?’ అని ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ రైతులపాలిట శాపంగా తయారైంది. రైతుబంధు రాదు, కరెంటు రాదు, సాగునీళ్లు రావు, పండించిన వడ్లకు ధర రాదు, బోనస్ ఇయ్యరు. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఎవరి కోసం పనిచేస్తున్నట్టు?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు లక్షల రుణమాఫీ కోసం ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లినా దేవుళ్లపై ఒట్లు పెడుతున్నాడని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎవడైనా పనిచేసే సిపాయి ఒట్లు పెడతడా? అయితే ఒట్లు పెట్టుడు.. లేకపోతే కేసీఆర్ను తిట్టుడు. ఈ రెండు తప్ప ఇంకో ముచ్చట లేదు. ఐదునెలల నుంచి ఇదే దుకాణం’ అంటూ రేవంత్ తీరును ఎండగట్టారు. ఆడబిడ్డలకు ఇస్తామన్న రూ.2,500 ఇవ్వకపోగా, ఇస్తున్నట్టు రాహుల్గాంధీతో చెప్పిస్తున్నారని మండిపడ్డారు.
మెదక్ కోసం నిలబడాలని, మెదక్ను బాగుచేయాలని తాను అడగడంతోనే వెంకట్రామిరెడ్డి బరిలోకి దిగారని కేసీఆర్ తెలిపారు. ‘కేసీఆర్ వెంబడి ఉండి, తెలంగాణ అభివృద్ధి చేయాలె, ఉమ్మడి మెదక్లోని మూడు జిల్లాల్లో కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉన్నది కాబట్టి నా తెలివి తేటలు ఉపయోగించి ఈ జిల్లాకు ఉపయోగపడాలె, హరీశ్రావుకు అండదండగా ఉండాలె అని వెంకట్రామిరెడ్డి వచ్చారు తప్ప స్వార్థం కోసం కాదు’ అని స్పష్టం చేశారు. ఆయనను అభ్యర్థిగా ప్రకటించగానే రూ.100 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేసి, పేద విద్యార్థులకు సాయం చేస్తానని ప్రకటించారని గుర్తుచేశారు. ప్రతి నియోజకవర్గానికి ఒక కల్యాణమండపాన్ని కట్టిస్తానని మాట ఇచ్చారని తెలిపారు. మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉన్నదని, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉన్నదని వివరించారు. ముస్లింలు పొరబాటున కాంగ్రెస్కు ఓటేస్తే బీజేపీ గెలుస్తుందని హెచ్చరించారు.
తెలంగాణకు మోదీ ఒక్కనాడు కూడా ఒక్క మంచిపని చేయలేదని కేసీఆర్ చెప్పారు. ‘తెలంగాణ ముచ్చట ఎప్పుడు వచ్చినా ‘తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రని మోదీ దిక్కుమాలిన మాట మాట్లాడతడు. మనకు ఉన్న కృష్ణా, గోదావరి నీళ్లను తీస్కపోయి వేరేవాళ్లకు ఇస్తామని అంటుండు. బీజేపీ దోపిడీ దారుల పార్టీ, పెట్టుబడిదారుల పార్టీ తప్ప.. అది పేదల పార్టీ కాదు. ఇక్కడే కాదు, దేశం నలుమూలలా ఎక్కడా కూడా మంచి చేసిన దాఖలా లేవు. ఎంతసేపూ మత విద్వేషం పెట్టాలె, ప్రజల మధ్య చిచ్చు పెట్టాలె, గందరగోళం చేసుడే తప్ప ఏ ఒక్క మంచి పనీ చేసింది లేదు. బీజేపీకి ఓటు వేసినా వృథా’ అని కేసీఆర్ కామారెడ్డి ప్రజలకు దిశానిర్దేశం చేశారు.
మోదీ గోదావరిని తమిళనాడుకు అప్పజెపాలని చూస్తున్నారని, కాంగ్రె స్ ప్రభుత్వం కృష్ణాను ఇప్పటికే కేఆర్ఎంబీకి అప్పగించిందని కేసీఆర్ గుర్తు చేశారు. ‘గోదావరి మాయమైతే, తమిళనాడు, కర్ణాటకకు తరలిపోతే మన రాష్ట్రం గతి ఏం కావాలె. ఇన్నేండ్లు చేసుకున్న పనులన్నీ ఎటుపోవాలె. మనం కట్టుకున్న ప్రాజెక్టులన్నీ ఎటుపోవాలె? మొత్తం నష్టపోదామా? బీఆర్ఎస్ను కాపాడుకొని మన అస్థిత్వాన్ని రక్షించుకుందాం’ అని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మోసపూరిత హామీలు నమ్మి ప్రజలు దెబ్బతిన్నారని, మరోసారి నమ్మవద్దని హెచ్చరించారు. కాంగ్రెస్ నుంచి రాష్ర్టాన్ని కాపాడాలన్నా? మన నదుల నీళ్లు కాపాడుకోవాలన్నా, కాంగ్రెస్ గ్యారెంటీలు అమలు చేయించాలన్నా, తెలంగాణ ఆత్మగౌరవం కాపాడుకోవాలన్నా కచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉన్నదని కేసీఆర్ వివరించారు.
బీజేపీ వాళ్లు ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ అని చెబుతున్నారని.. మోదీ మళ్లీ గెలిస్తే మాత్రం పెట్రోల్, డీజిల్ ధర చార్ సౌ పార్ అవుతుందని కేసీఆర్ హెచ్చరించారు. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని, బీజేపీకి 200 సీట్లు కూడా దాటవని జోస్యం చెప్పారు. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ మూడోస్థానంలో ఉన్నదని, 12-13 మంది బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే కాంగ్రెస్ మెడలు వంచగలమని, హామీలన్నీ అమలు చేయించగలుగుతామని, నదులను, తెలంగాణ హక్కులను కాపాడగలుగుతామని తెలిపారు. విజ్ఞతతో ఆలోచించి బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.