Breaking news : మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలో కురిసిన కుండపోత వర్షం విషాదం మిగిల్చింది. ఓ భవన నిర్మాణ ప్రాంతంలో రిటెయినింగ్ వాల్ కూలి ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. మృతులంతా ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కూలీలని అధికారులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ జిల్లా బాచుపల్లిలోని రేణకా ఎల్లమ్మ కాలనీలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ జిల్లా బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ కాలనీలోగల సర్వే నెంబర్ 345,406 లలో సుమారు రెండు వేల చదరపు మీటర్లు విస్తీర్ణంలో హరిజన్ రిజ్ కన్స్ట్రక్షన్ కంపెనీ హెచ్ఎండీఏ అనుమతితో సెల్లార్, స్టిల్ట్ +5 అప్పర్ ఫ్లోర్లతో రెసిడెన్షియల్ బిల్డింగ్ నిర్మిస్తున్నది. ఈ భవంతి నిర్మాణంలో ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన పలువురు కార్మికులు పనిచేస్తున్నారు. కార్మికులు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రదేశంలోనే రేకుల షెడ్స్ వేసుకుని జీవిస్తున్నారు.
మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి భవంతి చుట్టూ నిర్మించిన రిటెయినింగ్ వాల్ కార్మికుల రేకుల షెడ్స్ పై కూలింది. భారీ వర్షంలో ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో కార్మికులు హాహాకారాలు పెడుతూ షెడ్స్ నుంచి బయటికి పరుగులు తీశారు. ఏడుగురు శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలతో బయటపడిన వారిలో కొందరు గాయపడగా చికిత్స నిమిత్తం మమత హాస్పిటల్కు తరలించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.
మంగళవారం సాయంత్రం నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకు కూలిన రిటెయినింగ్ వాల్ శిథిలాలను తొలగించారు. ఆ శిథిలాల కింద నుంచి మొత్తం ఏడు మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆ మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులంతా ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో తిరుపతి మాఝీ (20), శంకర్ (22), రాజు (25), రాజు భార్య ఖుషి (25), రామ్ యాదవ్ (34), గీత (32), హిమాన్షు (4) ఉన్నారు.