మంచిర్యాల, మే 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎన్నో ఆశలతో ఎవుసం చేసి తీరా పండిన వడ్లను అమ్మబోతే రైతులు కొనుగోలు కేంద్రాల్లో నిలువుదోపిడీకి గురవుతున్నరు. తాలు, దుబ్బ అంటూ సెంటర్ల నిర్వాహకులు 40కిలోలకు 42 కిలోల దాకా జోకుతున్నరు. చచ్చీచెడి మిల్లులకు వెళ్లాక ఒక్కో లారీ లోడ్కు పది బస్తాల దాకా మిల్లర్లు కోత పెడుతున్నరు. మిల్లరే పది బస్తాల దాకా దోచుకుంటే మరోవైపు కేంద్రాల నిర్వాహకులు తమ చేతివాటంతో మరిన్ని బస్తాలు మింగేస్తున్నరు. ఇంకా విషాదమేమిటంటే గ్రేడ్-ఏ ర కం ధాన్యం అమ్మిన రైతులకు కామన్ గ్రేడ్ డబ్బులే కట్టిస్తున్నరు. ఇవన్నీపోను క్వింటాల్ వడ్లపై రూ.50 చొప్పున హమాలీ చార్జీలు అదనంగా పడుతున్నాయి. మంచిర్యాల జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ‘నమస్తే తెలంగాణ’ మంగళవారం పరిశీలించగా ఈ దోపిడీ తంతు బయటపడింది. అధికారుల పర్యవేక్షణ లేకనే ఇలా జరుగుతున్నట్టు తెలుస్తున్నది.
వడ్లలో తాలు, మట్టి ఉందని చెప్పి కొనుగోలు కేంద్రాల్లో 40 కిలోలు జోకాల్సిన బస్తాను 42 కిలోల దాకా జోకుతున్నారు. కేంద్రం నుం చి మిల్లుకు వెళ్లాక ఒక్క లారీ లోడ్లో పది బస్తాల వరకు మిల్లర్లు కోత పెడుతున్నారు. 283 బస్తాలు మిల్లుకు తీసుకెళ్లిన ఓ రైతుకు 278 బస్తాలకే డబ్బులు చెల్లించారు. ఇదే లారీలో పోయిన మరో రైతు 230 బస్తాలు తీసుకెళ్తే 226 బస్తాలకే డబ్బులు పడ్డాయి. ఒక లారీలో మంచిర్యాల జిల్లా సమీపంలోని గాయ త్రి మిల్లుకు 685 బస్తాలు తీసుకెళ్లిన ఇద్దరు రైతులకు 9 బస్తాలు కోతపెట్టి 674 బస్తాలకే ట్రక్ షీట్ ఇచ్చారు.
సాధారణంగా యాసింగిలో గ్రేడ్-ఏ 1010 ధాన్యాన్నే రైతులు పండిస్తారు. ఈ రకం ధాన్యం క్వింటాలుకు రూ.2,203 చెల్లించాలి. కానీ, కామన్ గ్రేడ్కు ఇచ్చే రూ.2,183 మాత్రమే చెల్లిస్తున్నారు. 100 క్వింటాళ్లు అమ్మిన రైతు రూ.2వేల వరకు నష్టపోవాల్సి వస్తున్నది. రైతు బోర్లకుంట శంకరయ్య 283 బస్తాల ఏ గ్రేడ్ ధాన్యం అమ్మగా 278 బస్తాలే కొన్నట్లు రసీదు ఇచ్చారు. ఈ 278 బస్తాల్లో 111.2 క్వింటాళ్లకు గాను రూ.2203 చొప్పు న రూ.2,44,973 రావాలి. కానీ కామన్ గ్రేడ్గా చూపించి క్వింటాల్కు రూ.2183 చొప్పున రూ.2,42,749 చెల్లించారు.
భీమారం మండలం బూర్గుపల్లి డీఆర్డీకే కొనుగోలు కేంద్రంలో ఇటీవల ఓ రైతుకు చెం దిన వడ్లను 607 బస్తాలుగా తూకం వేశారు. తాలు, మట్టి ఉందని చెప్పి మిల్లర్ 24 బస్తాలు కోత పెట్టి 583 బస్తాలకు రసీదు ఇచ్చాడు. ఇక కేంద్రం నిర్వాహకుడు 576 బస్తాలకే కుదించి కొనుగోలు పత్రం ఇచ్చాడు.
కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యానికి కోత పెడుతున్న మిల్లర్లు, ఆ ధాన్యాన్ని ఎఫ్సీఐకి అప్పగించే సమయంలోనూ అదే స్థాయిలో లబ్ధిపొందుతున్నారు. ఎఫ్సీఐకి ధాన్యం అప్పగించే సమయంలో క్వింటాలుకు 63 కిలోల ధాన్యం, ఐదు కిలోల నూకలు అప్పగిస్తున్నారు. మిల్లర్లు అటు రైతుల పొట్ట కొట్టడంతో పాటు ఇటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని తేలిపోతున్నది.
జిల్లాలో ఏ మిల్లర్ కూడా ధాన్యం కట్టింగ్ పెట్టొద్దని చాలా సీరియస్గా చెప్పాం. నేను రోజూ కొనుగోలు కేంద్రాలు, మిల్లులను తనిఖీ చేస్తున్నా. ఎక్కడా ఇబ్బందులున్నట్లు మా దృష్టికి రాలేదు. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరిస్తున్నాం. అక్రమాలు జరిగినట్లు మా దృష్టికి వస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం.
– మోతీలాల్, అదనపు కలెక్టర్, మంచిర్యాల జిల్లా
నేను ఏగ్రేడ్ ధా న్యం తెచ్చిన. తాలు, మట్టి లేకుండా చూసి తీసుకచ్చిన. తేమశా తం మంచిగనే వ చ్చింది. హమాలీలు లోడ్ చేసేటప్పుడు ఇలాంటి నంబర్ వన్ వడ్లను ఎక్కడా చూడలేదన్నరు. ఏ గ్రేడ్ ధాన్యం తెచ్చినట్లు చీటీ రాసిచ్చిండ్రు. మిల్లుకు 283 బస్తాలు తీస్కపోతే 278 బస్తాలేనని తీసుకున్నరు. ఎందుకు కోత పెట్టిండ్రు అంటే ఎవ్వరూ సమాధానం చెప్పలే.
– బోర్లకుంట శంకరయ్య, దోనబండ, హాజీపూర్ మండలం, మంచిర్యాల జిల్లా
నేను 132 బస్తాల ధాన్యం తెస్తే నలబై ఒకటిన్నర కిలోల చొప్పుల తూకం వేసిండ్రు. మిల్లుకు పోయినంక రెండు బస్తాలు కోతపెట్టి 130 బస్తాలకే ట్రక్ షీట్ ఇచ్చిండ్రు. ఏ గ్రేడ్ ధాన్యం తెస్తే కామన్ గ్రేడ్ డబ్బులే వేసిండ్రు. మా బావకు కూ డా రెండు బస్తాలు కట్టింగ్ పెట్టి, కామన్ గ్రేడ్ డబ్బులే వేసిండ్రు. ఒక్క మాట కూడా చెప్పకుండా కంటింగ్ ఎట్ల పెడుతరు? మధ్యల మిల్లర్ల దోపిడీ ఏంది?.
– రాగంశెట్టి చంద్రయ్య, దొనబండ