నమస్తే తెలంగాణ, న్యూస్నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో అన్నదాతకు అపారనష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు, నింపిన ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. పండ్లు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మామిడి కాయలు నేలరాలాయి. ఈదురుగాలులకు పలుచోట్ల ఇండ్ల పైకప్పు రేకులు ఎరిగిపడ్డాయి. విద్యుత్తు స్తంభాలు, భారీ వృక్షాలు నేలకూలాయి. పలుచోట్ల పిడుగులు పడటంతో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. రహదారులపై భారీ వృక్షాలు నేలకూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకుగురయ్యారు. సిద్దిపేట జిల్లా రాయపోల్, మిరుదొడ్డి, కుకునూరుపల్లి, కొండపాక, గజ్వేల్ మండలాల్లో మంగళవారం కురిసిన వానకు ధాన్యం తడిసింది. సిద్దిపేట మార్కెట్ యార్డులో పోసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. చేర్యాల, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో బలమైన ఈదురుగాలులకు విద్యుత్తు స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. పిట్టలగూడెంలో గాలివానకు రేకుల ఇండ్లు ధ్వంసమయ్యాయి. చేర్యాల మండలంలోని వీరన్నపేటలో కమ్మకోలు రాజు రేకుల ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో మామిడి కాయలు రాలి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పర్ణశాలలో ఈదురు గాలులకు పలు షాపులు, ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయి పాక్షికంగా దెబ్బతిన్నాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల చెట్లు కూలగా, విద్యుత్తు స్తంభాలు విరిగాయి. గణపురం, మహదేవపూర్, పలిమెల మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ములుగు, ఏటూరునాగారం, మంగపేట, గోవిందరావుపేట, వెంకటాపూర్, వెంకటాపురం మండలాల్లో ధాన్యం రాశులు తడిశాయి. ఖానాపురం, ఆత్మకూరు, చెన్నారావుపేట, వర్ధన్నపేట మండలాల్లో ఈదురుగాలులకు పలువురి ఇంటిపై కప్పులు ఎగిరిపడ్డాయి. జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల, రఘునాథపల్లి, స్టేషన్ఘన్పూర్, చిల్పూరు మండలాల్లో మామిడి కాయలు రాలడం, కూరగాయలు, పండ్ల తోటలకు స్వల్పంగా నష్టం వాటిల్లింది.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లోనే ఆరబోసిన ధాన్యం తడిసిముద్దయింది. చొప్పదండి, గంగాధరలోని మార్కెట్లోనూ ధాన్యం తడిసింది. రేకొండలో చందవేని పద్మ, అల్లెపు రాములు ఇండ్లు నేలకూలాయి. సీతారాంపూర్లో విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. లంబాడి పల్లె గాగిరెడ్డిపల్లి రహదారి మధ్య చెట్టు విరగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం తడిసిపోగా, పలువురి ధాన్యం నీటిలో కొట్టుకపోయింది. ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లోని పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. ధర్మారం, సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిముద్దయింది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని కొనుగోలు కేంద్రాల్లోనూ ధాన్యం తడిసి ముద్దయింది. ఆరవల్లికి చెందిన రైతు కట్ల రాజేందర్ రెండెకరాల మక్క నేలవాలింది. మల్లాపూర్లో గాలికి మామిడికాయలు పూర్తిగా నేలరాలాయి. కరీంనగర్ జిల్లా రెబల్లెలో నాలుగు ఎకరాలల్లోని బొప్పాయి చెట్లు నెలకొరిగాయి.
సంగారెడ్డి జిల్లా జోగిపేట వ్యవసాయ మార్కెట్తోపాటు చింతకుంట కొనుగోలు కేంద్రాలు, రంసాన్పల్లి, దానంపల్లి, మాసన్పల్లి, ఎర్రారం శివారుల్లో రైతులు రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసిసోయింది. హత్నూర, మాధుర గ్రామాల్లో ధాన్యం బస్తాలు తడిశాయి. పెద్దమందడి మండలం అల్వాల గ్రామ శివారులో పిడుగుపాటుకు 48 గొర్రెలు మృతి చెందాయి.