నిరుపేద రోగులకు ఆశా జోత్యిగా పేరున్న నిలోఫర్ దవాఖాన కొంత మంది అవినీతి అధికారులు, సిబ్బంది కారణంగా అబాసు పాలవుతున్నది. నిష్ణాతులైన, అనుభవజ్ఞులైన వైద్య సిబ్బంది పనిచేసే ఈ వైద్యశాలలో కొందరు అవినీతి, అక్రమార్కులు కలంకంగా మారారు. వీరి కారణంగా దవాఖాన పేరు ప్రతిష్టలు మంటగలుస్తున్నాయని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయానికి వస్తే ప్రభుత్వ దవాఖాన అయిన నిలోఫర్లో రోగులకు వైద్య సేవలతో పాటు వైద్య పరీక్షలు, మందులు అన్నీ పూర్తి ఉచితంగానే అందిస్తారు. కానీ కొందరు దళారులు, అక్రమార్కులు రోగుల అవసరాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వారి నుంచి వివిధ కారణాలతో డబ్బులు దండుకుంటున్నారు. నిలోఫర్తో పాటు గాంధీ, సుల్తాన్బజార్, పేట్లబుర్జ్ ప్రసూతి దవాఖానల్లో ఆడ బిడ్డ జన్మిస్తే రూ.3వేలు, మగ బిడ్డ జన్మిస్తే రూ.5వేల చొప్పున వసూలు చేస్తున్నారంటూ గత కొంత కాలంగా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.
– సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ)
దవాఖానలో ఉచితంగా ఇవ్వాల్సిన మందులను సైతం కొందరు పేషెంట్ కేర్ సిబ్బంది అమ్ముకుంటున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా ఏ ప్రభుత్వ దవాఖానలోనైనా రోగులు డిశ్చార్జ్ అయినప్పుడు తదనంతర చికిత్సలో భాగంగా అవసరమైన మందులను ఉచితంగా అందిస్తారు. ఈ క్రమంలోనే నిలోఫర్లో సైతం ప్రసవించిన బాలింతలకు డిశ్చార్జ్ సమయంలో మందులను ఉచితంగా అందిస్తారు. అయితే కొందరు పేషెంట్ కేర్ సిబ్బంది డబ్బులు ఇస్తేనే మందులు ఇస్తున్నారని, డబ్బులు ఇవ్వకపోతే డిశ్చార్జ్ కార్డు చేతిలో పెట్టి వెళ్లమంటున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి డిశ్చార్జ్ కార్డు రోగులకు ఇచ్చిన తరువాత రోగి అటెండెంట్ ఆ కార్డును తీసుకెళ్లి ఫార్మసీ కౌంటర్లో ఉచితంగా అందజేసే మందులను తీసుకోవాల్సి ఉంటుంది.
కానీ నిలోఫర్లో డిశ్చార్జ్ అయిన రోగులకు వెంటనే డిశ్చార్జ్ కార్డు ఇవ్వకుండా కొందరు పేషెంట్ కేర్ సిబ్బంది కార్డులను తమ వద్దే పెట్టుకుని, డబ్బులు ఇస్తే మందులు కూడా తామే ఇస్తామని లేకపోతే మందులు ఇవ్వడం కుదరదని చెబుతున్నట్లు బాధిత రోగులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే రోగి సహాయకులు డిశ్చార్జ్ కార్డు తీసుకుని నేరుగా ఫార్మసీకి వెళితే వారు మందులు ఇవ్వడం లేదని, పేషెంట్ కేర్ ద్వారా రావాలని చెప్పడం మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది. మందులకు డబ్బులు వసూలు చేసే వ్యవహారంలో ఫార్మసీ సిబ్బందికి ఏమైన సంబంధాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా గతంలో కూడా ఒక పేషెంట్ కేర్ పెద్ద మొత్తంలో మందులను తరలిస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది పట్టుకోవడం, ఆ ఘటనపై పోలీసు కేసు కూడా నమోదైన విషయం తెలిసిందే.
నిలోఫర్లో జరుగుతున్న ఉదంతాలపై ఉన్నతాధికారులు కేవలం విచారణ పేరుతో కాలం వెల్లదీస్తూ కమిటీలతో సరిపెడుతున్నారని రోగులు, వారి సహాయకులు ఆరోపిస్తున్నారు. లేబర్ రూమ్ల వద్ద ప్రసవించిన బాలింతల కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు వసూలు చేయడం, డిశ్చార్జ్ సమయంలో ఉచితంగా అందించాల్సిన మందులకు డబ్బులు వసూలు చేయడం తదితర ఘటనలపై ఏవైనా ఫిర్యాదులు అందినప్పుడు లేదా మీడియాలో కథనలు వచ్చినప్పుడు మాత్రమే ఉన్నతాధికారులు స్పందించడం, ఆగమేఘాల మీద హడావుడి చేసి, చేతులు దులుపుకోవడం సర్వసాధారణమైపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న అవినీతి, అక్రమాలు ఇప్పుడు కొత్తగా జరుగుతున్నవి కాదు. గత కొంత కాలంగా జరుగుతున్నా వాటి నివారణకు శాశ్వత పరిష్కారం చూపకుండా విచారణ, కమిటీల పేరుతో అటు ప్రభుత్వం, ఇటు ఉన్నతాధికారులు కాలం వెల్లదీస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా జరిగిన ఘటనలపై గురువారం డీఎంఈ డా.వాణి, ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.రాజారావు నిలోఫర్ దవాఖానకు చేరుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో మందులకు డబ్బులు వసూలు చేసిన పేషెంట్కేర్ను విధుల నుంచి తొలగించడంతో పాటు దవాఖానలో జరుగుతున్న అక్రమాలపై ప్రొఫెసర్ నరహరి ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.