ఢిల్లీ: భారత జట్టు ఐసీసీ ట్రోఫీ కరువును తీర్చే సత్తా టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మకు ఉందని మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. వచ్చే నెల యూఎస్ఎ, వెస్టిండీస్ సంయుక్త వేదికలుగా జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్నకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న యువీ ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘టీ20 ప్రపంచకప్ జట్టులో రోహిత్శర్మ ఉండటం చాలా కీలకం. అతడు చాలా తెలివైన కెప్టెన్. ఒత్తిడిలో మంచి నిర్ణయాలు తీసుకునే సారథి మనకు (టీమ్ఇండియాకు) కావాలి.
రోహిత్ ఆ కోవకు చెందినవాడే. 2023 వన్డే వరల్డ్కప్లో అతడు భారత్ను ఫైనల్కు చేర్చాడు. ఐపీఎల్లో ఐదు ట్రోఫీలు సాధించాడు’ అని చెప్పాడు. 2007లో టీ20 వరల్డ్ కప్ నెగ్గిన భారత జట్టులో యువీ, రోహిత్ సభ్యులు. ఈ సందర్భంగా యువరాజ్.. రోహిత్తో జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. ఇన్నేండ్లలో అతడు ఆటగాడిగా, సారథిగా ఎంతో ఎత్తుకు ఎదిగినా రోహిత్ వ్యక్తిత్వంలో మాత్రం మార్పు రాలేదని, జట్టులో అందరితోనూ కలిసిపోతాడని ప్రశంసలు కురిపించాడు. వరల్డ్కప్ ట్రోఫీ, పతాకంతో రోహిత్శర్మను చూడాలని ఉందని యువీ ఆశాభావం వ్యక్తం చేశాడు.