ICC : కాలానికి అనుగుణంగా క్రికెట్లో మార్పులకు శ్రీకారం చుడుతూ వస్తోంది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC). వరల్డ్ కప్లో మహిళా క్రికెటర్లకు ప్రైజ్మనీ పెంచడం, పురుషులతో పాటు సమానంగా వేతనం ఇవ్వడం వంటివి మచ్చుకు కొన్ని. వన్డే, టీ20తో పాటు టెస్టు ఫార్మాట్ను కూడా సరికొత్తగా మార్చేందుకు ఐసీసీ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ప్రస్తుతం జింబాబ్వేలో జరుగుతున్న భేటీలోనే జై షా(Jai Shah) నేతృత్వంలోని ఐసీసీ పలు అంశాలపై చర్చించే అవకాశముంది.
ఐసీసీ దృష్టిలో ఉన్న కీలక అంశాల్లో ఒకటి.. వన్డేల్లో రెండు బంతుల నియమాన్ని రద్దు చేయడం. 50 ఓవర్ల ఫార్మాట్ మాదిరిగానే టీ20ల్లోనూ అండర్ -19 ప్రపంచ కప్ నిర్వహించడం. ఇక మూడోది ఏంటంటే.. టెస్టుల్లో ఓవర్ రేటును లెక్కించడానికి టైమర్ ప్రవేశపెట్టడం. ఆఫ్రికా దేశంలో ఏప్రిల్ 10 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న ఐసీసీ సమావేశంలో ఈ మూడు అంశాలపై ప్రకటన వెలువడడం ఖాయం అంటున్నాయి సన్నిహిత వర్గాలు.
The multi-day @ICC Board meetings and activities have begun in Harare, with Member Board representatives holding important discussions with @JayShah on hand for the first time as Chair, and great hospitality on display from @ZimCricketv. pic.twitter.com/8kisHdOcYp
— ICC (@ICC) April 11, 2025
వన్డేల్లో ప్రతి జట్టు బౌలింగ్ సమయంలో కొత్త బంతిని ఉపయోగిస్తుంది. ఈ విధానంపై లెజెండరీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) సహ పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం ఏంటంటే.. కొత్త బంతి మెరుస్తూ ఉండడం వల్ల పేసర్లు రివర్స్ స్వింగ్ రాబట్టలేకపోతున్నారు. 25 ఓవర్లు పూర్తయ్యాక మల్లీ కొత్త బంతిని తీసుకునే వీలుంది. దాంతో, బ్యాటర్లు అదనపు లబ్ది పొందుతూ బౌండరీలతో చెలరేగుతున్నారు. అందుకే.. బౌలర్లకు కూడా సమానంగా అవకాశం ఉండేలా చూడాలనుకుంటోంది ఐసీసీ. తమ క్రికెట్ కమిటీ సూచన మేరకు రెండు బంతుల నిబంధనను రద్దు చేయడంపై ఆలోచించనుంది.
ఐపీఎల్లో స్లో ఓవర్ రేటు కారణంగా పలువురు కెప్టెన్లు భారీగా జరిమానా కడుతున్నారు. దాంతో, బీసీసీఐకి పెద్ద మొత్తంలో డబ్బు సమకూరుతోంది.ఇదే విధానాన్ని టెస్టు క్రికెట్లోనూ అమలు చేయాలని ఐసీసీ భావిస్తోంది. ప్రస్తుతానికి టీ20ల్లో, వన్డేల్లో వాడుకలో ఉన్న టైమర్ పద్ధతి సత్ఫలితాలను ఇస్తోంది. అందుకనే
.. సుదీర్ఘ ఫార్మాట్లోనూ ఈ రూల్ను తీసుకురావాలని ఐసీసీ పెద్దలు భావిస్తున్నారు. కొత్త నిబంధన ప్రకారం ఓవర్ పూర్తైన 60 సెకన్లలో అంటే.. నిమిషంలో మరో ఓవర్ తొలి బంతి పడాలి. టెస్టుల్లో ఒక రోజులో 90 ఓవర్లు వేయాలనేది ఐసీసీ రూల్. ఇది అన్ని జట్లకు అలవడాలంటే.. టైమర్ నిర్ణయం సరైందే అని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు.
వన్డేల్లో అండర్ -19 వరల్డ్ కప్ ఎంతో ఫేమస్. పురుషులు, మహిళల విభాగంలో ఈ ప్రపంచ కప్ను ఏటా ఐసీసీ నిర్వహిస్తోంది. ప్రస్తుత కాలంలో టీ0 లకు ఆదరణ పెరగడంతో.. ఫ్రాంచైజ్ క్రికెట్ ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే పొట్ట ఫార్మాట్ను మరింత విశ్వవ్యాప్తం చేసేందుకు అండర్ -19 టీ20 వరల్డ్ కప్ ఆడించాలని ఐసీసీ ఆలోచిస్తోంది. ఇప్పటివరకూ రెండు సార్లు మాత్రమే మహిళల అండర్ -19 టీ20 వరల్డ్ కప్ జరిగింది. 2023లో దక్షిణాఫ్రికాలో, 2025లో మలేషియాలో ఈ టోర్నీని ఐసీసీ నిర్వహించింది. అయితే.. పురుషుల విభాగంలోనూ ఈ ఫార్మాట్లో అండర్ -19 ప్రపంచ కప్ పెట్టాలని ఐసీసీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారు.