Hanuma Vihari : భారత జట్టులో చోటు కోల్పోయిన క్రికెటర్ హనుమా విహరి(Hanuma Vihari) మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆంధ్రా క్రికెట్ జట్టు(Andhra Cricket Team)ను వీడేందుకు సిద్ధమయ్యాడు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తనను ఎంతో వేధనకు గురి చేసిందని, తన ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసిందని విహరి ఆరోపించాడు. అంతేకాదు ఆంధ్రా క్రికెట్ జట్టుకు ఆడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. సోమవారం తన ఇన్స్టాగ్రామ్లో విహరి ఓ పోస్ట్ పెట్టాడు. అందులో పలు విషయాల గురించి అతడు ప్రస్తావించాడు.
‘మేముంతో పోరాడాం. ఆంధ్రా తరఫున మరో క్వార్టర్స్ ఓడిపోవడం చాలా బాధగా ఉంది. ఈ పోస్ట్ ద్వారా కొన్ని వాస్తవాలు మీ ముందు పెడుతున్నా. బెంగాల్తో ఫస్ట్ మ్యాచ్కు నేనే కెప్టెన్గా ఉన్నా. మ్యాచ్ సమయంలో 17వ ఆటగాడిపై అరిచాను. దాంతో, అతడు రాజకీయనాయకుడైన వాళ్ల తండ్రికి నాపై ఫిర్యాదు చేశాడు. ఆ పొలిటీషియన్ నాపై చర్యలు తీసుకోవాలని అసోసియేషన్పై ఒత్తిడి తెచ్చాడు. నా తప్పు ఏం లేకున్నా నన్ను కెప్టెన్గా వైదొలగమన్నారు. అయితే.. నేను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ ఏమీ అనలేదు. కానీ, అసోసోషియేషన్ మాత్రం నాపై చర్యలు తీసుకుంది.
జట్టు కోసం సర్వశక్తులు ఒడ్డి.. గాయం వేధిస్తున్నా లెఫ్ట్ హ్యాండ్తో బ్యాటింగ్ చేసి.. ఆంధ్రాను 5 సార్లు నాకౌట్ దశకు తీసుకెళ్లి.. భారత జట్టు తరఫున 16 టెస్టులు ఆడిన నాకంటే అతడే వాళ్లకు ముఖ్యమయ్యాడు. అసోసియేషన్ తీరుతో నేనెంతో కుంగిపోయా. నా ఆత్మగౌరవం దెబ్బతిన్నది. అయినా ఆటపై నాకున్న గౌరవంతోనే ఈ సీజన్లో ఆడుతున్నా. విషాదకరమైన విషయం ఏంటంటే.. అసోసియేషన్ ఏది చెప్పినా ఆటగాళ్లంతా వినాలని, అసోసియేషన్ ఉండబట్టే ఆటగాళ్లు ఉన్నారనే ధోరణి ఉంది. అందుకనే ఇకపై ఆంధ్రాకు ఆడకూడదని నిర్ణయం తీసుకున్నా’ అని విహరి వాపోయాడు.
హనుమా విహరి